TTD News | శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, అర్చన చేపట్టారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, గరుడాళ్వార్, విమాన గోపురానికి, పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, ఆంజనేయస్వామికి శాస్త్రోక్తంగా పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మీ, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.