ఎదుటివాడు ఎంత మొండివాడైనా అతణ్ని దారికి తీసుకురావడానికి మన శాస్త్రకారులు ‘ప్రమాణం’ అనే సూత్రాన్ని కనుగొన్నారు. ప్రత్యక్షం, అనుమానం, శబ్దం, ఉపమానం అని నాలుగు ప్రమాణాలు ప్రసిద్ధమైనవి. ఈ ప్రమాణాల ఆధారంగా సత్యాసత్యాలను గ్రహించవచ్చు. మనల్ని జ్ఞానవంతులను చేయడానికే నాలుగు ప్రమాణాలు ఉన్నాయి. ఇంద్రియాలు ప్రమాణంగా తెలుసుకునే జ్ఞానమే ప్రత్యక్షం. మనం సూర్యచంద్రుల నుంచి వెలుగు రావడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. చెట్లు చిగురించడం, పూలు పూయడం, నదులు ప్రవహించడం మొదలైన ప్రాకృతిక దృశ్యాలన్నీ ప్రత్యక్షాలే. అయితే సమస్త జ్ఞానం కేవలం ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మాత్రమే సిద్ధించదు. ఇంట్లోంచి పొగ వస్తుందంటే, అది అగ్నివల్ల వచ్చి ఉంటుందని, ఇంట్లో పొయ్యి రాజేయడం వల్ల పొగ బయటికి వచ్చిందని అనుమానించాల్సి వస్తుంది. నిప్పు లేకపోతే పొగ రాదు కదా! పొగను బట్టి నిప్పును అనుమానించడం వల్ల తత్ సంబంధమైన జ్ఞానం కలుగుతుంది.
ఇక ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాల తర్వాత చెప్పకోదగినది శబ్ద ప్రమాణం. ఆప్తోపదేశాన్ని శబ్ద ప్రమాణంగా లెక్కిస్తారు. యథార్థం చెప్పేవారు ఎవరైనా శబ్ద ప్రమాణానికి అర్హులే. నాలుగు వేదాలు శబ్ద ప్రమాణానికి మంచి ఉదాహరణలు. వేదకర్త పరమేశ్వరుడు. ఆయన సత్య స్వరూపుడు. పరమేశ్వరుడి నుంచి వచ్చిన వేదాలు సత్యవిద్యల గ్రంథాలు. వాటిలోని శబ్దరాశిని మన రుషులు ప్రమాణంగా తీసుకున్నారు. ‘వేదం స్వతః ప్రమాణం’- వేదం దానికి అదే ప్రమాణం. ‘మూలేనమూలే’ అనేమాట కూడా వినబడుతుంది. ఇది కూడా శబ్ద ప్రమాణానికి ఉదాహరణే. ఏది మూలమో దానికి మూలం ఉండదని విద్వాంసులు తేల్చారు. అంటే శబ్ద ప్రమాణానికి వేదం మూలం అవుతుంది. ‘ఈశావాస్యమిదం సర్వం’ (యజుర్వేదం-40.1) ఈ ప్రపంచం అంతా పరమేశ్వరుడితో నిండి ఉందని వేదం చెబుతుంది. కాబట్టి ఇది శబ్ద ప్రమాణమైంది. సృష్టికర్త ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోదగినవాడు కాదు. కాబట్టి, తక్కిన అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా ఆయన ఉన్నాడని ధ్రువపడుతుంది. ఇక నాలుగో ప్రమాణం ఉపమానం. యోగ దర్శన కర్త పతంజలి దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే, పరమేశ్వరుడితో సమానమైనవాడు కానీ, మించినవాడు కానీ లోకంలో లేడు. కాబట్టి ఉపమాన ప్రమాణం లౌకిక వ్యవహారాల్లో పనిచేస్తుందే కానీ, పరమేశ్వరుడి విషయంలో దాని ఆవశ్యకత లేదు.
– ఆచార్య మసన చెన్నప్ప, 98856 54381