శ్రీశైలం: శ్రీశైలంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 18 వరకు జరుగనున్న ఈ ఉత్సవాలు.. గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభమవుతాయి. సాయంకాలం 5.30 గంటల నుంచి అంకురారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 7 గంటలకు ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ప్రతిరోజు విశేష పూజలు అందుకోనున్నారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశ స్థాపన, వేదపారాయణాలతో పాటు ప్రత్యేక పూజాధికాలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని ఆర్జిత, పరోక్ష సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు.