శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ వరకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి క్షేత్రంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లపై దేవస్థాన ఈవో లవన్న సోమవారం ఆలయ అధికారులు, స్థానిక రెవెన్యూ, పోలీస్, వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అందరు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. భక్తులకు అసౌకార్యలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగానే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ నెల రెండోవారంలోగా ప్రతి విభాగం ఏర్పాట్లకు సంబంధించి యాక్షన్ ప్లాన్ పూర్తి చేసి, ఈవో కార్యాలయానికి అందజేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఈవో సూచించారు. విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. భక్తులను అలరించేందుకు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
కొవిడ్ నేపథ్యంలో ఉత్సవాలను నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలన్నారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు దేవస్థానం పరిధిలో ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని, కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు మైక్సెట్ల ద్వారా అవగాహన కల్పిస్తూ ఉండాలన్నారు. అన్ని విభాగాలు సమష్టిగా ఉత్సవాల్లో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా వాహన సేవలు, స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఉత్సవాల్లో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లపై చర్చించారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు నాగలూటి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాసద్వారం, సాక్షి గణపతి ఆలయం వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
ముఖ్యంగా శివదీక్షా స్వాములకు ప్రత్యేక క్యూలైన్లు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన చర్చించారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు పందిళ్లు, షామియానాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మంచినీరు అందుబాటులో ఉంచాలని, అల్పాహారం అందజేయాలన్నారు.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ముఖ్యంగా పాతాళగంగ వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ రాజేంద్ర సింగ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ రమణ, వైద్యారోగ్య కేంద్రం డాక్టర్ సోమశేఖరయ్య పాల్గొన్నారు. వేడుకల్లో ప్రభుత్వ సిబ్బంది నియామకం, భ్రదతా ఏర్పాట్లు, వైద్య శిబిరాలపై వివరించారు.