క్లైబ్యం మా స్మ గమః పార్థ! నైతత్త్వయ్యుపపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥
(భగవద్గీత 2-3)
‘ఓ పార్థా! పిరికితనానికి స్థానమైన ైక్లెబ్యాన్ని విడిచిపెట్టు. నీలాంటి వీరుడికి, ప్రాజ్ఞునికి హృదయ దౌర్బల్యం తగదు. ఓ పరంతపా! సుస్థిరమూర్తివై యుద్ధరంగంలో నిలబడు’ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణపరమాత్మ.
కురుక్షేత్ర యుద్ధరంగంలో చావోరేవో తేల్చుకోవలసిన సమయంలో అర్జునుడు మోహంలో మునిగి, అడవులలో కందమూలాలు భుజిస్తూ జీవించేందుకు సన్నద్ధుడయ్యాడు. ఆదరణీయమైన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రసన్యాసం చేశాడు. ప్రతివ్యక్తిలో సహజస్థితి అయిన చేతన వెలుగు చూసినప్పుడే ధర్మస్థాపన జరుగుతుంది. మోహంలో మునిగి కర్తవ్యాన్ని విస్మరించిన సమర్థుడైన వ్యక్తిని కార్యోన్ముఖుడిని చేయాలి. సమర్థత కలిగీ ఎదురైన సమస్య పట్ల ఉదాసీనంగా వ్యవహరించడమే ైక్లెబ్యత. నిర్లిప్తత, ఉదాసీనతల వల్ల స్తబ్ధత ఏర్పడుతుంది. కానీ, మనిషి చైతన్య శీలి. కాబట్టి అర్జునుడిలో ఏర్పడిన ఉదాసీనతతో కూడిన స్తబ్ధతను పారదోలాలి. అప్పుడే ధర్మస్థాపన జరుగుతుంది.
సంకల్పించిన కార్య నిర్వహణ జయప్రదంగా కొనసాగాలంటే నాయకుడిలో ఉత్సాహం, స్ఫూర్తి, పట్టుదల అవసరం. ఆశావహ దృక్పథంతో, సమర్థతతో ముందుకుసాగాలి. మధ్యలో ఎదురయ్యే ప్రతికూలతలను అధిగమిస్తూ… అనుచరులకు ప్రేరణను ఇస్తుండాలి. బద్ధకం, వాయిదా వేసే జబ్బు, దురలవాట్లు, అజ్ఞానం, మోహం లాంటి మనోకల్పిత భ్రాంతులకు దూరంగా సహచరులతో ఏకోన్ముఖుడై సాగితేనే విజయం సాధిస్తాడు. అనివార్యమైన యుద్ధంలో ఎదుటివారు బలవంతులైన సమయంలో దక్షత కలిగిన నాయకునిలో కావాల్సిన మూర్తిమత్వాన్ని, సాధకుడిలోని అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాడు, సమర్థుడైన గురువు.
ఇక్కడ అర్జునుడిని పార్థా, పరంతపా అని సంబోధిస్తున్నాడు కృష్ణుడు. రెండు కూడా సాభిప్రాయాలే. పృథుడి కుమారుడు పార్థుడు. కుంతీదేవికి ఇంద్రుని అనుగ్రహంతో జన్మించినవాడు, అర్జునుడు. ఇంద్రుడు దేవతలకు రాజు. ఎన్నిమార్లు రాక్షసుల దౌర్జన్యాలకు గురైనా ఏదో ఒక ఉపాయంతో వారిని నిగ్రహించి ధర్మాన్ని స్థాపించాడు. తన హక్కుగా ఉన్న అమరావతిని సొంతం చేసుకున్నాడే కానీ.. ప్రయత్నాన్ని విడవలేదు. నిరాశా నిస్పృహలకు మనసులో చోటివ్వలేదు. ‘అసామాన్య శక్తిసామర్థ్యాలు కలిగిన ఇంద్రుని పుత్రుడవైన నీవు కూడా అసమాన్య ప్రతిభాపాటవాలను ప్రదర్శించాలే కానీ, పిరికివాడిలా, అధైర్యపరుడిగా నిర్వేదనతో పారిపోవడం సమంజసం కాద’ని హితవు పలికాడు.
పరంతపా! శత్రువులను తపింప చేసే వాడా అనడం వల్ల శత్రువులకు భయపడి, పౌరుష హీనుడివై వెనక్కి తగ్గడం పురుషత్వం కాదని హెచ్చరిస్తున్నాడు. ప్రతి వ్యక్తికీ విజయసాధన సహజ లక్షణం. ఆ సహజత్వంపై బంధుప్రీతి, ఆత్మన్యూనత లాంటి అసహజమైన ఎన్నో ముసుగులను కప్పడం వల్ల విజయానికి దూరమవుతున్నారు. ‘అంతర్గత శత్రువులను తపింప చేసిన సాధన నీలో ఉంది’ అని అర్జునుడి సామర్థ్యాన్ని గుర్తుచేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ‘నీ నిజ స్వరూపాన్ని గుర్తించి.. దానిని బహిర్గతం చేయమ’ని ప్రబోధిస్తున్నాడు.
ఆ సమయంలో అర్జునుడి మనసును కలచి వేస్తున్న భావనలు తనవారిపై కృపాకారుణ్యాలు, నైతికమైన సామాజిక బాధ్యత కాదు. నిజానికి అది చిత్తభ్రాంతితో కలిగిన శోకం మాత్రమే. దీనికి మూలం మానసిక బలహీనత. నియంత్రణ లేని మనసుపై ఇంద్రియాల విజయం వల్ల కలిగిన వైరాగ్యం దూరమైతే అతని వ్యక్తిత్వంలో పరిణతి కనిపించేది. అతనిలోని ధర్మాగ్రహం వెలుగు చూసేది. ఆ క్రమంలో తనకు అయోమయం, శోకం కలిగి ఉండేవి కావు!
– పాలకుర్తి రామమూర్తి