‘దూడల దండులో దూరిన ఏకు వంటి లేత దంభం కల వత్సా(దూడ)సురుని వధించి శౌరి- కృష్ణుడు, మరోసారి ముని మానస బృందంలోనికి చొచ్చుకు వచ్చిన పెచ్చరిల్లిన- మేకు వలె ముదిరిన, దంభం కల బకాసురుని అసువు(ప్రాణా)లను హరించాడు.’- ఇది వ్యాఖ్యాతృ చక్రవర్తి శ్రీధరాచార్యుల శ్రీముఖం! ‘ఏకు మేకయింది, మొక్కగా వంగనిది మానై వంగుతుందా?’ అనే సామెతల ఆసాములే వత్సాసుర బకాసురులు. శ్రీశుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! బలరామాది గోపబాలురందరూ చిన్నారి కన్నయ్యతో కూడి దూడల మందలను మళ్లించుకొంటూ తిన్న- తిన్నగా బృందావనంలోని తమ తమ వాడ(వీధు)లకు చేరుకున్నారు. అసురవధను గురించిన కథను వారి ద్వారా విని బృందావని వాసులు నివ్వెరపోయి ఇలా తలపోశారు…
కం॥ ‘ఆపదల మీద నాపద
లీ పాపని జెంది తొలగె నీ యర్భకుపై
వేపడిన ఖలులు దహనుని
వైపున శలభముల పగిది బడిరి ధరిత్రిన్’
ఈ బుడతనిపై కడు ఆపదలు వచ్చిపడుతూ వడి-వడిగానే విచ్చి- సమసి పోతున్నాయి. పసివాడే కదా అని వీని మీద కసితో విరుచుకుపడ్డ ఖలులు- దుష్టులందరూ మంటల్లో ఎగసి (గర్వించి) పడే మిడుతల వలె పస (సారం, సమృద్ధి) చెడి నశిస్తున్నారు.
శుకుడు- రాజా! ఒకనాడు రామకృష్ణులు తోడి బాలురతో కూడి వన భోజనాలు చేయాలని సరదాపడ్డారు. పొద్దునే లేచి చద్ది అన్నపు కావడులను, పిండివంటల మూటలను ఒద్దికగా భుజాలకు తగిలించుకొని సందడి చేస్తూ దూడలతో అడవిలో ప్రవేశించారు. కేరింతలు కొడుతూ, కుప్పించి దూకుతూ తమ నీడలను చూసి నవ్వుకుంటూ, పరుగెత్తుతూ, కలసిమెలసి పకపకలతో ఎకసెక్కెము (పరిహాసము)లాడుతూ పలు రకాల ఆటలు ఆడుకొంటున్నారు…
కం॥ ‘వనజాక్షుడు మున్నరిగిన
మునుపడగా నతని నేనె ముట్టెద ననుచుం
జని మును ముట్టని వానిన్
మును ముట్టిన వాడు నవ్వు మొనసి నరేంద్రా!’
మునీంద్రుడు పరీక్షిత్తుతో… ‘నరేంద్రా! కరీంద్రుని గాచిన విష్ణుడు- కృష్ణుడు దూరంగా ముందు నడుస్తూ ఉంటే ఇద్దరు కొంటె పిల్లలు అతనిని ‘ఎవరు ముందుగా ముట్టుకుంటారో’ అంటూ వెంటపడ్డారు. నందుపట్టి- బాలకృష్ణుని ముందుగా ముట్టుకున్నవాడు పట్టలేని వాణ్ణి చూసి బెట్టుగా పకపకా నవ్వాడు’. వనశోభను దర్శిస్తూ భువన సుందరుడు నందనందనుడు కొద్దిగా ముందుకు వెళ్లినప్పుడల్లా వల్లవ కుమారులందరూ పోటీపడి మరీ పరిగెత్తుతూ వెళ్లి యదువల్లభుని తాకి- తాకి అలౌకికమైన ఆనందాన్ని పొందేవారట! సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే’- అన్న గీతావాక్యం అపురూపంగా రూపుదాల్చింది. ‘ఒక్క పరమాత్మ విషయంలో తప్ప ఈ ప్రపంచంలో మరి దేని కొరకూ ‘నేను-నేను’ (అహం పూర్వం అహం పూర్వం) అంటూ మేనును- శరీరాన్ని మోసుకుంటూ ముందుకు తోసుకు రాకూడదు’- అని ఈ లీలా పరమార్థం.
ఉ॥ ‘ఎన్నడు నైన యోగి విభులెవ్వని పాద పరాగ మింతయుం
గన్నుల గాన రట్టి హరి గౌగిట జేర్చుచు జెట్ట బట్టుచుం
దన్నుచు గ్రుద్దుచున్ నగుచు దద్దయు బై పడి కూడి యాడుచున్
మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యము లింత యొప్పునే!’
శుకుడు… మహారాజా! మహామహా యోగులు కూడా ఏ పరమ పురుషుని పాద పద్మాల పరాగాన్ని- పవిత్ర ధూళిని ఏనాడూ కన్నులారా కొద్దిగా కూడా కనలేరో, అట్టి వనమాలా విరాజితుని, ఘన చక్రహస్తుని, అనవద్యుని, లీలావినోది విష్ణుని- బాలకృష్ణునితో గోపబాలురు కలసిమెలసి అతణ్ణి కౌగిలించుకుంటూ, చెట్టపట్టాలు పట్టుకుంటూ, తన్నుతూ, మీదపడుతూ, వెన్నుమీద గుద్దుతూ, హద్దులెరుగని హర్షంతో హాస్యాలాడుతూ, హేరాళం- హెచ్చుగా ఆడుతూ ఎంతో చనవు- ముచ్చటతో మెలగుతున్నారు. కల్లలెరుగని ఆ వల్లవ (గొల్ల) కుమారుల ఎల్లలు లేని భాగ్యాలు ఎంతటివని చెప్పవచ్చు?
కం॥ ‘విందులకును బ్రహ్మసుఖా
నందంబై భక్తగణమునకు దైవతమై
మందులకు బాలుడగు హరి
పొందుగనిరి గొల్లలిట్టి పుణ్యులు గలరే?’
విందులకు- యోగులకు, జ్ఞానులకు నిర్వికల్పానంద- బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు పరమ ఆరాధ్యదైవమూ అయిన ఆ గోవిందుడు, మందులకు- అజ్ఞానులకు సామాన్య బాలునివలె కనిపిస్తున్నాడు. అట్టి అరవింద నేత్రుని, బాల ముకుందుని స్నేహాన్ని, సాన్నిధ్యాన్ని పొందినవారు ఈ గొపబాలురు! ఆహా! వారి ఇహపరాల అగణ్య (లెక్కలేని) పుణ్యాల నైపుణ్యాలు ఊహాతీతాలు కదా!
శుకుడు- రాజా! ఇదిలా ఉండగా కొలది కాలానికే అఘుడు అనే అసురుడు కంసుని పంపున శిఖిపింఛావతంసుని- నెమలి పింఛం తలపువ్వుగా కలవానిని, బకవైరిని, శౌరిని సఖులతో సహా సంహరిస్తానని అజగర (కొండచిలువ) రూపంతో పొదల మాటున నెమ్మదిగా కదలివచ్చాడు. అఘము అంటే పాపం. వీడి పేరే అఘుడు. మూర్తీభవించిన ‘పాపం’! అనుభవించకుండా ఏది అంతరించదో అదీ ‘అఘం’- పాపం. ఇతరుల సుఖం, సంతోషం, సంపద, సమున్నతి చూడలేనివాడు. వీడు అఘుడైతే గోపబాల సఖుడు, ఘన శ్యాముడు అనఘుడు- పాప రహితుడు. అంతేకాదు, ‘అఘహృత్’- ఎంతో పాపహరుడు కూడా! ఈ అఘాసురుడు పూతనా, బకాసురుల అనుజుడు. అనగా అవిద్య (పూతన), దంభం (బకుడు)- ఈ రెండూ పాపానికి అక్క, అన్నలు. అవిద్యా దంభాలున్న చోటుకు పాపం తప్పక తిన్నగా- సూటిగా, దన్ను (అండ)గా, హెచ్చుగా చొచ్చుకు వస్తుందని హెచ్చరిక!
రామకృష్ణులు తమవారితో రోజువారీగా వచ్చి పోయే దారిలో ఆ మాయదారి రాకాసి చిలువ (పాము) కొండగుహ లాంటి తన నోరు నిండుగా తెరిచి పండుకొని ఉండిపోయింది. గోపబాలురు ఆ దారిన వస్తుండగా అది వారి కంటపడ్డది..
మ॥ ‘బకునిం జంపిన కృష్ణుడుండ మనకుం బామంచు జింతింప నే
టికి? రా పోదము దాటి, కాక యది కౌటిల్యంబుతో మ్రింగుడున్
బకు వెంటం జను గృష్ణుచేత’ ననుచుం బద్మాక్షు వీక్షించి యు
త్సుకులై చేతులు వ్రేసి కొంచు నగుచున్ దుర్వారులై పోవగన్…
రాజా! దానిని ఒకరికొకరు చూపించుకున్నారు కాని, ఎవరూ భయపడలేదు. ‘బకాసురుని చంపిన అభయ స్వరూపుడైన మేటి కృష్ణుని అండ ఉండగా ఈ కొండచిలువ వలన మనకు భయమేమిటి? రండు, దాటిపోదాం. అలకాక, కౌటిల్యం- కుచ్చితపు బుద్ధితో మోసగించి ఇది మనలను మ్రింగితే, బకాసురుని మాదిరి ఈ రాకాసి పాము కూడా కచ్చితంగా చచ్చిపోతుంది’ అని అనుకుంటూ చలువ- చల్లని చూపుల కృష్ణునికేసి చూస్తూ గొల్లపిల్లలందరూ ఆగలేక తమ లేగలతో సహా దారుణమైన ఆ రాకాసి చిలువ నోటిలో దూరారు. వారిని వారించే వారెవరూ లేకపోయారు. వారికి ఎర్రగా, మెత్తగా ఉన్నదాని నాలుక ఒక తివాసీవలె, పరుపులాగా సుఖప్రదంగా తోచింది. ఇదే జీవుణ్ణి సంసార మోహం లోనికి లాగివేసే భ్రమ! ఆపదను సంపదగా భావించే భ్రాంతి!
అప్పుడు పరమాత్మ… ‘అయ్యో! ఈ అర్భకు (అమాయకు)లందరూ దీనిని రాకాసి కొండచిలువ అని గ్రహించక, నేనున్నాననే మొండిధైర్యంతో నిర్భయంగా దీని తుండం- ముఖంలో ప్రవేశించారు’ అని తలచాడు. ఈ తావులో పోతన కష్టమైన సంయుక్తాక్షరాన్ని (ల్ప) ప్రాసగా గ్రహించి తనకిష్టమైన అంత్యానుప్రాస అలంకారంలో స్వకీయమైన ఈ విశిష్ట శార్దూల వృత్తాన్ని ఎంతో అందంగా విరచించాడు..
శా॥ ‘వేల్పుల్ సూచి భయంబునొంద గ్రసనావేశంబుతో నుజ్జల
త్కల్పాంతోజ్జలమాన జిహ్వదహనాకారంబుతో మ్రింగెన
స్వల్పాహీంద్రము, మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్
స్వల్పాకారుల శిక్యభారుల గుమారాభీరులన్ ధీరులన్’..
అప్పుడు ఆ అసురుడు ఆ ఆభీర (గొల్ల) కుమారులందరినీ మింగివేసే ఆవేశంలో నోరు ఒక్కసారిగా అప్పళించాడు. ప్రళయకాల అగ్నిజ్వాలల వలె మండుతున్న తన నాలుకతో వారందరినీ మింగబోయాడు. ఇది చూచి దేవతలంతా కంగారుపడ్డారు. రాజా! గొల్లపిల్లల ఉల్లము(మనసు)లన్నీ ఎల్లప్పుడూ నల్లవాని చుట్టూనే అల్లుకు తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా అంత శక్తిమంతులు కారు. ఎంత చిన్నవారంటే, తాము మోస్తున్న అన్నపు చిక్కాలు కూడా వారికి బరువే! అయితే వారంతా కృష్ణునికి అన్ని విధాల సమర్పితులు కాన, అంతగా ధైర్యవంతులుగా ఉన్నారు. ఆపద్బాంధవుడు కనుక దానవారి, మురారి ఆ పాప (సర్ప) రూపధారి అయిన అసురుని వంచనకు కినుకపూని- కోపగించి, తన పంచన- ఆశ్రయంలో ఉన్నవారి వెనుక తానూ వెళ్లాడు. ఆ దానవుని గొంతుకలో అడ్డంగా నిలిచి తన మేను- దేహాన్ని అడ్డదిడ్డంగా పెంచి తమ్మికంటి (పద్మాక్షుడు) కృష్ణుడు దిమ్మిస కొట్టి వాని నడ్డి విరిచాడు. ఊపిరి ఆడక ఆ పాపి ప్రాణాలు తల పగుల కొట్టుకొని- బ్రహ్మరంధ్రం చీల్చుకొని చాల పెద్ద శబ్దంతో బహిర్గతాలై అనంతవాయువులో కలిసిపోయాయి. సర్ప శరీరం నుంచి వెలికి వచ్చిన అద్భుతమైన వెలుగు- శుద్ధ సత్తమయ జ్యోతి, కందర్పదర్పహరుని దివ్యదేహంలో అర్పితమయింది!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006