ధర్మ సంస్థాపన కోసం అవతరించిన భగవంతుడు శ్రీకృష్ణుడు. తను స్థాపించిన ధర్మాన్ని కలియుగంలో సుస్థిరం చేయడానికి ఆయనే స్వయంగా గౌరాంగుడిగా అవతరించాడు. చైతన్య మహాప్రభుగా కృష్ణ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. ‘కలియుగంలో ఆవిర్భవించి, సదా కృష్ణనామం చేసే భగవత్ అవతారమూర్తి వర్ణం నలుపు కానప్పటికీ, ఆయన సాక్షాత్తూ శ్రీకృష్ణుడే’ అని భాగవత వచనం. దీనిని నిజం చేస్తూ మేలిమి బంగారు వర్ణంలో అవతరించిన పుణ్యపురుషుడు శ్రీ చైతన్య మహాప్రభును ‘గౌరాంగా’ అని పిలుస్తారు. ఆయన అవతరించిన ఫాల్గుణ పౌర్ణమిని ‘గౌర పౌర్ణమి’గా శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తారు భక్తులు. ఆ మహనీయుడు చూపిన భక్తి మార్గంలో పయనించడానికి కంకణబద్ధులు అవుతారు.
లౌకిక విషయాల్లో కొట్టుమిట్టాడుతున్న కలియుగవాసులను ఉద్ధరించాలని దేవదేవుడు సంకల్పించాడు. అత్యంత కారుణ్యంతో యుగధర్మమైన హరినామ సంకీర్తనను స్థాపించడమే లక్ష్యంగా శ్రీచైతన్య మహాప్రభుగా అవతరించాడు. జగద్గురువు అనుగ్రహం కోసం ఆయన తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. కఠోర తపస్సు చేయాలి. ‘స్వామి నా వాడు’ అని త్రికరణశుద్ధిగా నమ్మాలి. ఇవి ఆచరించడం చెప్పినంత సులభం కాదు. కానీ, శ్రీచైతన్య ప్రభు చూపిన మార్గాన్ని అనుసరిస్తే చాలు ఆ నల్లనయ్య చల్లని చూపులు భక్తుడిపై అనంతంగా ప్రసరిస్తాయి.
నామస్మరణతో కృష్ణతత్వ జ్ఞానంతోపాటు కృష్ణుడిపై ప్రేమ పెంపొందుతుంది. పవిత్ర భగవన్నామమైన ‘హరేకృష్ణ’ మహామంత్రాన్ని జపిస్తే చాలు విశుద్ధమైన కృష్ణప్రేమను పొందగలరు. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు మనపై చూపిన కారుణ్యం. ఆయనతోపాటు హరిదాస ఠాకూర్ వంటి మహనీయులంతా ‘హరేకృష్ణ’ మహామంత్రాన్ని జపించి తరించారు. గౌర పౌర్ణమి సందర్భంగా ఆయన ఉపదేశించిన ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామరామ హరే హరే’ మహామంత్రాన్ని మనసారా జపిస్తూ శ్రీచైతన్య మహాప్రభును, వారి పరంపరను, శ్రీల ప్రభుపాదను ఆశ్రయించిన వారు ఈ కలియుగ భవసాగరాన్ని సులభంగా దాటి మాధవుడి ప్రేమను పొందుతారు.
…?శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ 93969 56984