శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! ప్రాగ్దిశ- తూర్పు దిక్కున పూర్ణచంద్రుడు ఉదయించినట్టు సదయ, నిర్మల హృదయ, సాటిలేని సాధ్వి కౌసల్యకు జగన్నాథుడే జగదభిరాముడైన శ్రీరాముడిగా జన్మించాడు. అతడు ప్రభాకర (సూర్య) వంశమనే పాలకడలికి పున్నమ చంద్రుడు. తన పాదసేవకుల ఖేద- శోకమనే కారుచీకట్లను పోకార్చే పంకేరుహ సఖుడు- సూర్యుడు. దానవులనే దారుణ అరణ్యాన్ని దహించే దావాగ్ని. రావణుని గర్వమనే పర్వతాన్ని పిండి-పిండి చేసే పురందరుడు- ఇంద్రుడు. విశ్వామిత్రుని యాగ రక్షణలో భాగంగా మోసపు మాటలతో నాటకమాడే తాటక- అవిద్యామాయ, తాట తీసి మహర్షి మనస్సును తేట పరచాడు. సుబాహుని సంహరించి, నీచుడైన మారీచుని సాగర తీరం దాకా తరిమి కొట్టాడు.
మిథిలా నగరంలో జనకుని గృహంలో మున్నూరు మంది మోసుకుంటూ తెచ్చిన ముక్కంటి (శివ) ధనుస్సును, గున్న ఏనుగు చెరకు గడను విరిచినట్లు హేలగా, అవలీలగా తుంచివేశాడు. భూతలనాథుడు రాముడు భూ జాత, భాగ్యోపేత, బాలామణి సీతను ప్రీతితో పెండ్లాడాడు. రణరంగంలో అరి (శత్రు) గణ భీకరుడైన భార్గవ (పరశు) రాముని గర్వాన్ని భంగపరచాడు. దశరథుడు మునుపు కైకకు ఇచ్చిన వరాలకు వశుడై మాట తప్పక దశముఖు (రావణు)ని ముఖ కమలాలకు తుహిన ధాముడైన (చంద్రుడైన) రాముని కానలకు పంపాడు. నిజపద సేవా నిరతుడైన భరతునికి రాజ్యభారం అప్పగించి, శత్రువులకు దుర్భేద్యం- అసాధ్యమైన అయోధ్యను విడిచి సీతా సౌమిత్రీ (లక్ష్మణ) సమేతుడై…
ఉ॥‘ పుణ్యుఁడు రామచంద్రుఁ డట వోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్ధత బర్హిబర్హ లా
వణ్యము, గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్’
‘తాపసులకు శరణ్యమూ- వాస యోగ్యమూ, పురివిప్పి నాట్యమాడే నెమళ్లతో లావణ్యమూ- చూడముచ్చటైనది, పరవళ్లు తొక్కే పవిత్ర గోదావరీ జలాలతో హృదయాలను పరవశింపజేసే గొప్పగుణము కలదీ, పెద్దపెద్ద పాదపా (వృక్షా)లతో, పొదరిండ్లతో మండితమైనదీ- అలరారుచున్నదీ అయిన దండకారణ్యాన్ని పుణ్యమూర్తి రాముడు సంతోషంతో సందర్శించాడు. అడవిలో సతీ సమేతంగా ఉన్న జనపతి రాముడితో రతి కోరి వచ్చిన చుప్పనాతి శూర్పణఖ ముక్కుకోశాడు ఊర్మిళాపతి సౌమిత్రి.
కం॥‘ఖరకరకుల జలనిధి హిమ
కరుఁడగు రఘురామ విభుడు గరకరితోడన్
ఖరుని వధించెను ఘన భీ
కర శరముల నఖిల జనులుఁ గర మరుదందన్’
‘అది విని దండెత్తి వచ్చిన ఖరుడనే రక్కసుణ్ని, సూర్యవంశమనే సముద్రానికి సుధానిధి- చంద్రుని వంటివాడైన ఆ రామచంద్రుడు అందలి జనులందరూ అచ్చెరువొందగా కోపంతో మిక్కిలి భీకరమైన బాణాలు సంధించి వధించాడు. దూషణాది పదునాలుగు వేల రాక్షసులను తన కర్కశ బాణాగ్నిలో భస్మం చేశాడు. మైథిలి అతిలోక సౌందర్యాన్ని విని మన్మథ వికారానికి లోనైన మతిమాలిన రావణుడు పంపగా విధిలేక సింగారాల బంగారు లేడి రూపం ధరించి కంగారు పడుతూ వచ్చిన మాయా మారీచుని ఆ సీతాపతి హతమార్చాడు. మగడు, మరిది ఇంటలేని సమయంలో ఒంటరిగా ఉన్న సీతను తుంటరి రావణుడు అపహరించాడు. అప్పుడు రామ కార్యసాధనకై ప్రసాదింపబడిన ఆయువు కలవాడు, తన రెక్కల వేగంతో వాయువును కూడా పరిహసించినవాడు ఐన జటాయువు అడ్డుపడగా.. నిస్సహాయుడైన అతని రెక్కలను నిర్దయుడు రావణుడు ఖండించాడు.
శుక ఉవాచ- రాజా! ఆ తర్వాత ఇనకుల తిలకుడు అనుజు (లక్ష్మణు)నితో కలసి అవనిజ (సీత)ను అన్వేషిస్తూ వచ్చి తనకై అసువులు అర్పించిన జటాయువుకు అంత్యక్రియలు చేసి రుష్యమూక పర్వతం సమీపించాడు. ‘నిన్ను నిగ్రహించిన- నిర్బంధించిన నీ అగ్రజుడు- ఉగ్రుడైన వాలిని వధిస్తాన’ని సుగ్రీవునికి అభయమిచ్చి, అతనిని తన ఆత్మీయులతో అగ్రేసరు (ప్రముఖు)నిగా స్వీకరించాడు.
కం॥ ‘లీలన్ రామవిభుండొక
కోలం గూలంగ నేసె గురు నయశాలిన్
శీలిన్ సేవితశూలిన్
మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్’
‘రామచంద్రుడు ఒకే బాణంతో గొప్ప నీతిశాలి, శూలి (శివ) సేవా తత్పరుడు, ఇంద్రుడిచ్చిన మాలను కంఠంలో ధరించినవాడు, రావణ దర్పాన్ని హరించిన మహావీరుడూ ఐన వాలిని కూల్చివేశాడు’.
క॥ ‘..హరి విభునకు హరి మధ్యను హరి రాజ్యపదంబు నిచ్చె హరి విక్రముడై’- సింహ పరాక్రముడైన శ్రీరాముడు సూర్య సుతుడైన సుగ్రీవునికి కిష్కింధా రాజ్యాన్నీ, సింహం వంటి నడుముగల ‘రుమ’నూ అప్పగించాడు. ఈ రామకథలో మున్ముందు నిర్విరామంగా మహాకవి పోతన కవితా చేతన నుండి నిత్య నూతనమై అందగించిన అక్షరాల పొందిక గల అనేక కంద పద్యాలు వీనుల విందుగా రూపందుకొన్నాయి.
కం॥ ‘ఇల మీద సీత వెదకఁగ
నలఘుడు రాఘవుడు పనిచె హనుమంతు నతి
చ్ఛలవంతున్ మతిమంతున్
బలవంతున్ శౌర్యవంతుఁ బ్రాభవ వంతున్’
‘మహా పురుషుడైన మహీపాలుడు రాముడు మహీజ మైథిలిని వెదకడానికి మహా మహిమాన్వితుడూ, మోసపు గుట్టును ఇట్టే రట్టు చేయగల అతి మతి (బుద్ధి)మంతుడూ, బలవంతుడూ, సర్వోపరి- అన్నిటినీ మించి సుగుణవంతుడూ అయిన హనుమంతుని వినియోగించాడు. ఆ అనిల (వాయు) పుత్రుడు సాగర సలిలాన్ని (జలాన్ని) అలవాటు మేరకు అవలీలగా అధిగమించాడు. సీతా దర్శనం చేసి అక్షకుమారాది అసుర వ్రాతా (సమూహా)న్ని పరేత (యమ) సదనానికి పంపించాడు.
కం॥ ‘సముదగ్రత ననిలసుతుం
డమరాహిత దత్తవాల హస్తాగ్నుల భ
స్మము సేసె నిరాతంకన్
సమదాసుర సుభట విగతశంకన్ లంకన్’
‘అసురులు తన తోకకు పెట్టిన నిప్పుతో అడ్డులేనిది, మదించిన దొడ్డ దానవ భటుల అటుల పరాక్రమం చేత, నిరాతంకన్- ఏదైనా ఆటంకం (ముప్పు) వాటిల్లుతుందన్న శంక- సంశయం ఏ మాత్రం లేనిదీ ఐన లంకను హనుమ భస్మం చేశాడు. ఇలా, చూచి రమ్మంటే లంకను కాల్చి వచ్చిన శంకరావతార హనుమ శుభంకర సీతా వృత్తాంతం విన్నవింపగా ప్రసన్నుడైన రాఘవుడు భయంకరమైన వానర సేనలతో లంకవైపు పయనించి దక్షిణ సముద్ర తీరం చేరాడు. ఖల విదారి- దుష్ట సంహారకుడైన రాముడు వారినిధి (సముద్రం) దరి చేరి పరిపరి విధాల దారి ఇమ్మని కోరాడు. దాట వీలుగాని ఆ సాగరం తన మాట ఆలకించి బాట చూపనందున ఆయనకు ఆగ్రహం వచ్చింది. జగజెట్టి ఐన ఆ రాచపట్టి (రాకుమారుడు) రెట్టించిన కోపంతో చిరునవ్వు చిందిస్తూ నారి సారించి నారాచం (బాణం) ఎక్కుపెట్టాడు. వెంటనే నీరనిధి- సాగరం నత్త గుల్లలతో, నాచుతో, ముత్తెపు చిప్పలతో పెద్ద బీడుగా మారిపోయింది. అప్పుడు హడలిపోయి కడలి- సముద్రుడు నదులతో రూపుగొన్నవాడై వెడలి వచ్చి, శరణుజొచ్చి దయా శరధి- కరుణాపయోనిధి దాశరథిని ఇలా స్తుతించాడు..
శా॥ ఓ కాకుత్స్థ కులేశ! యో గుణనిధీ! యో దీనమందార! నే
నీ కోపంబున కెంతవాడ? జడధిన్, నీవేమి భూ రాజవే?
లోకాధీశుడ, వాదినాయకుడ, వీ లోకంబు లెల్లప్పుడున్
నీ కుక్షిం బ్రభవించు నుండు నడగున్ నిక్కంబు సర్వాత్మకా!’
‘ఓ కాకుత్స్థ కులేశ్వరా! గుణనిధీ! దీన మందారా! సర్వాత్మకా! నీ కోపానికి నేను ఏ పాటివాణ్ని? పాపపు జడత్వం కలిగిన వాణ్ని. నీవేమైనా సామాన్యుడైన భూపాలకుడవా? లోకాలకు, లోకాధిపతులకు ప్రభుడవు. ఆది దేవుడవు. ఈ లోకాలన్నీ ఎల్లప్పుడూ నీ ఉదరంలో పుడుతూ ఉంటాయి, పదిలంగా ఉంటాయి. ప్రళయంలో నీలోనే లయిస్తాయి. నిత్య నిరంజనా! ఇది పరమ సత్యం. ఓ సీతాపతీ! నాపై సేతువు కట్టు. లంకను చుట్టుముట్టు. నీ శరా (బాణా)గ్నిచే అసురుల శిరస్సులు నేల పడగొట్టు. సర్వ శుభాలకు ఆటపట్టయిన నీ ఇల్లాలిని చేపట్టు.’ (సశేషం)