TTD | శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి మార్చి 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ క్రమంలో తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుపతికి చెందిన శ్రీమణి రెండు పరదాలు, రెండు కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. వాటిని బ్రహ్మోత్సవాలు వినియోగించనున్నారు. ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.