ప్రఖ్యాత ఇస్లామియా తత్వవేత్త జునైద్ బగ్దాదీ చదువుకుంటున్న రోజులవి. ఒకసారి గురువు జునైద్తో ‘జుట్టు బాగా పెరిగిపోయింది. క్షౌరం చేయించుకో’ అని చెప్పాడు. అయితే క్షురకుడికి ఇవ్వడానికి జునైద్ దగ్గర చిల్లిగవ్వ లేదు. గురువు చెప్పడంతో తప్పక క్షురకుడి దగ్గరికి వెళ్లాడు. అతనితో ‘అల్లాహ్ కోసం క్షౌరం చేయమ’ని అడిగాడు. దానికి క్షురకుడు అంగీకరించాడు. క్షౌరం చేసిన తర్వాత తన జేబులోంచి నాణేల పొట్లాన్ని తీసి జునైద్కిస్తూ ‘అవసరానికి వాడుకోండి’ అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొన్నేండ్లకు జునైద్ బగ్దాదీ ధార్మిక విద్యాభ్యాసం పూర్తయింది. గొప్ప పండితుడిగా పేరుగాంచాడు. ఒకసారి ఆయన దగ్గరికి ఓ బృందం వచ్చింది. వారిలో కొందరు జునైద్ ధార్మిక సేవను మెచ్చుకొంటూ వారికి బంగారు నాణేలను సమర్పించుకున్నారు. ఆ నాణేలను చూడగానే జునైద్కు క్షురకుడు గుర్తుకొచ్చాడు.
వెంటనే అతని దగ్గరికెళ్లి ఆ నాణేల సంచిని అతని చేతిలో పెడుతూ.. ‘నా దగ్గరకు మొదటిసారి ఏదైనా కానుక వస్తే అది మీకే ఇస్తానని ఆనాడు సంకల్పించుకున్నాను. ఇదిగో ఈ రోజు మీరు దీన్ని స్వీకరించండి’ అన్నాడు. అది విన్న క్షురకుడు కోపంతో ‘మీకు దేవుడి పట్ల భయం లేదా? ఎవరైనా దేవుని మెప్పు కోసం చేసిన పనికి ప్రతిఫలం ఆశిస్తారా? ఈ సంచిని మీరే ఉంచుకోండి’ అని నిలదీస్తున్నట్లు చెప్పాడు. జునైద్ బగ్దాదీ నిర్ఘాంతపోయాడు. దైవంపై క్షురకుడికి ఉన్న విశ్వాసానికి ముగ్ధుడయ్యాడు. దేవుడి మెప్పు కోసం చేసిన పనికి ప్రతిఫలం ఆశించకూడదన్నది ఈ కథలోని నీతి.
…? ముహమ్మద్ ముజాహిద్