అవతరణ అంటే దిగిరావటం, అభివ్యక్తం కావటం! ధర్మగ్లాని జరిగినపుడల్లా తనను తాను సృష్టించుకుని, ఆ తరాన్ని ఉద్ధరించి.. తదనంతర తరాలను నడిపించడం అవతారమూర్తుల లక్ష్యం. కాల, కార్య, కారణ, కర్తవ్యాలకు లోబడే వారి సంచారం ఉంటుంది. అవతారాలన్నీ ప్రభవాలే! అంశ, కళ, అర్చ, ప్రవేశ, అనుప్రవేశ, ఆవేశ… మరెన్నో రీతులుగా అవతారాలు రావడం కొత్తకాదు. ఇన్నిటికీ.. ఏదో ఒక కారణం తప్పనిసరి. వీటన్నిటికీ భిన్నంగా జిల్లెళ్లమూడి అమ్మరాక ఒక ఆశ్చర్యం! ఆ మాతృమూర్తి శతజయంతి ఉత్సవ వేళ.. ఆమె అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకోవడం ఒక అదృష్టం.
కర్మలను అనుభవించటం కోసం కాకుండా కష్టాలను విని, వాటిని అధిగమించే దారి చూపటమే జగజ్జనని తత్వంగా అర్థం చేసుకోవాలి. ఇది తల్లి లక్షణం. బిడ్డ రక్షణే ఆమెకు ఉండే ఆత్రుత. కనబరచే తాపత్రయమంతా.. తన కోసం కాక బిడ్డ సుఖశాంతుల గురించే! ఎందరో మహాయోగుల కామన అంతా ప్రపంచం సుఖంగా ఉండాలనే! సుఖంగా ఉంచ గలిగిన శక్తి జగజ్జననికే ఉంటుంది! వారందరి ప్రార్థనల ఫలితంగా ఈశ్వరి ఈ జగత్తులో ప్రవేశించి, సుఖదాయిగా, ఆనందదాయిగా, సర్వదాయిగా ఉంటుంది. జీవుణ్ణి తడిమి, ఒడిచేర్చుకుని, లాలన, పాలన సాగిస్తుంది. జీవుడి దుఃఖాన్ని, భయాన్ని, బాధను తొలగించి, ఆత్మోన్ముఖుణ్ణి చేయడం తల్లి కర్తవ్యం. జీవుడిలో ఉన్న దానవత్వ, దీనత్వ, మానవత్వ, మాధవత్వ స్థితులను జీవుడికి తన దర్శన, స్పర్శన, సంభాషణ, అనుగ్రహ, వాత్సల్య, ప్రేమ ద్వారా స్ఫురణకు తెచ్చి, రాక్షస భావాలను నశింపచేసి, మానవ మాధవీయంగా తీర్చిదిద్దటం మాతృలక్ష్యం. పరమ చరమంగా తనలో లయం చేసుకోవటం అసలు పరమార్థం.
జీవుడు తనలో ఉన్న పశులక్షణం కారణంగా బాధను అనుభవిస్తాడు. పశువుకు బాధే ఉంటుంది. దుఃఖం తెలియదు. మానవుడే రెండిటినీ అనుభవిస్తాడు. మాతృభావన ఈ రెండిటినీ శమింపచేయగలదు. జిల్లెళ్లమూడి అమ్మ తన దగ్గరికి వచ్చినవారికి బాధను, దుఃఖాన్ని తగ్గించి ధైర్యాన్నిచ్చేది. పశువులో ఉన్న జీవుణ్ణి తాకడం, పలకరించడం, సాంత్వన చేకూర్చడం, లాలించడం, పోషించడం, నిర్వాణ సౌభాగ్యం కల్పించడం పరమేశ్వరి గుణం. జిల్లెళ్లమూడి అమ్మ ఇవన్నీ చేసింది! కాకిలో, నెమలిలో, పాములో, పశువులో అమ్మ చూసిందంతా ఆత్మనే! గుణభేదం, కులభేదం, ప్రమోద భేదం ఎరుగని కారుణ్య వారాశిగా అమ్మ సంచారం ఒక సహజస్థితి. మార్గం చూపించడం, లక్ష్యం బోధించడం, గమ్యం చేర్చడం అవతార ప్రణాళికలో భాగం. తన నడకే మార్గమైనపుడు, మార్గం జీవకోటిని సముద్ధరించే బాధ్యత అయినప్పుడు.. అమ్మ నడిచిన బాటలో అడుగువేయడమే సాధన!
అమ్మ అందించిన అన్నం ముద్దలు కేవలం మెతుకులు కావు. ప్రసాదగుణ సంపన్నమైన ఆశీరక్షతలు. పరమ కారుణ్య సంభరితమైన హృయారవిందం పంచే జ్ఞాన సౌరభాలు. ప్రతి మెతుకూ, సంచిత ప్రారబ్ధాన్ని సమసింపజేసే దివ్య ఔషధమే! గడచిన కాలంలో, చరిత్రలో… గురువులుగా, తాత్వికులుగా, సంప్రదాయ రక్షకులుగా, ధర్మ స్వరూపిణులుగా ఎందరో స్త్రీమూర్తులు వచ్చారు. నిండైన తల్లిదనంతో, వాత్సల్య చందన గంధంతో, కారుణ్య గుణంతో, ఇంతటి పూర్ణత్వంతో రావడం అరుదు! ‘అమ్మా! ఇంకొంత కాలం మీరుంటే బాగుంటుంది’ అని సద్గురు శివానందమూర్తిగారు కోరినప్పుడు, ‘రావడం, ఉండటం, పోవడం, ఈ దేహానికేగాని.. నాకేముంది? ఇవేమీలేని ‘నేను’ ఎప్పుడూ ఉంటుంది’ అన్నది అమ్మ సమాధానం. మాతృపార్శ్వాన్ని ప్రపంచానికి రుచి చూపించిన మమతామూర్తి జిల్లెళ్లమూడి అమ్మ!