Mahatma Gandhi | ఒకటిన్నర శతాబ్దం కిందట భారతావనిలో ప్రభవించిన మహాపురుషుడు గాంధీజీ. తల్లి పెంపకం, చిన్నతనంలో తాను చూసిన సత్య హరిశ్చంద్ర నాటకం గాంధీజీ మనసుపై బలమైన ముద్ర వేశాయి. ఇవి కేవలం సంఘటనలు కావు! తర్వాత కాలంలో బాపూజీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన జీవితానుభవాలు ఎన్నెన్నో!
భౌతిక, అధిభౌతిక స్థాయులు ప్రతీ వ్యక్తి జీవితంలో ఏర్పడుతూనే ఉంటాయి. కానీ, అధ్యాత్మ స్థితి అంత తేలికగా లభించేది కాదు. దానిని అందుకోవడానికి జిజ్ఞాస, తీవ్ర కాంక్ష, నిరంతర సాధన తప్పనిసరి. అంతేకాదు, జీవుడి సంస్కారం, పరిసరాలు, సమాజపు పోకడ, సంఘ అవసరాలు, పాపభీతి, సంఘనీతి, దైవప్రీతి, అవమానాలు, అనుభవాలు, ఆదర్శాలు వంటి ఎన్నో విషయాలు అధ్యాత్మ వైపు మనసును మళ్లిస్తాయి.
సత్యమంటే అబద్ధం ఆడకుండా ఉండటం మాత్రమే కాదని, మనసు పట్టుకోలేని ఆ స్థితి ఏమిటో తెలుసుకోవాలన్న ఆకాంక్ష గాంధీజీని ఆలోచింపజేసేది. ఇది ఆ మహనీయుడి సత్యాన్వేషణలో తొలిమెట్టు. ఇంతలో భారత స్వాతంత్య్ర సంగ్రామం మనసును బహిర్ముఖం చేస్తున్న వేళ ఆసన్నమైంది. రెండు వందల సంవత్సరాల పరాయి పాలనను అంతం చేసే బృహత్తర కార్యక్రమం అప్పటికే ప్రారంభమైంది. అది యుద్ధమే! ఆయుధాలు, సైనిక బలం లేని ప్రజాబలం, మనోశక్తి, వ్యూహరచన, భిన్నశక్తులను సంఘటిత పరచడం, త్యాగం, సహనం, సమన్వయం వంటి సహజ భావనలను ప్రజాక్షేత్రంలో బలంగా పాదుకొల్పడమే ప్రధాన విధానాలుగా సాగేవి. ఇది ఆయుధం లేని యుద్ధం. ముందెన్నడూ ఎరుగని, వినని, కనని, రక్తపాతరహిత విప్లవం. విప్లవం అంటే విధ్వంసం కాదని, పరిణామగతిశీలమైన సకారాత్మక మార్పు అని భావించిన గాంధీజీ ఎంచుకున్న తోవ అహింసా మార్గం. ఇదొక వినూత్న ప్రయోగం. అహింసను ఆచరించడానికి ముందుగా కావలసింది సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ! ఇవన్నీ ప్రాపంచిక మనసుతో లభించవు. మరి దారి ఏది?
ఈ మథనంలో గాంధీజీ ఆశ్రయించినది భగవద్గీత. అది కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు సంగమించిన అధ్యాత్మ త్రివేణి! తీవ్ర అధ్యయనం అనంతరం భగవద్గీతను అనుష్ఠాన వేదాంతంగా, పదునైన భావనా ఖడ్గంగా, భారతీయ ఆత్మను ఆవిష్కరించే దివ్య విధానంగా, రూపాంతరీకరణం చేసి.. భారతజాతి జనులను జాగృతం చేస్తూ, కర్తవ్యదీక్షా దక్షులుగా మార్చడమే బాపూ నమ్మిన కర్మయోగం. నిరంతర రామనామస్మరణతో, దైవశక్తి ఉనికిని ప్రసారం చేస్తూ భక్తి యోగాన్ని, మానవ ప్రజ్ఞను శాసించే దైవప్రజ్ఞ శక్తిమంతమైనదని జ్ఞానయోగాన్ని సమన్వయం చేస్తూ గాంధీజీ అధ్యాత్మ మార్గంలోకి ప్రవేశించడం, పయనించడం ఈశ్వర కృప!
మనో నియంత్రణ, నిర్భీతి, స్పష్టత, లక్ష్య గమ్యాలను సాధించడానికి కావలసిన దూరదృష్టి, విశాలదృష్టి, నిర్దుష్ట కార్యాచరణ వంటి ఎన్నిటినో భగవద్గీత నుంచి గ్రహించిన గాంధీజీ ఎంచుకున్నదీ, ఆచరించినదీ అధ్యాత్మ మార్గమే! జాతి, మత, కుల, వర్గ, వర్ణ లాంటి సంకుచిత పరిధుల నుంచి తనను తాను బయటపడవేసుకొని, నిష్ఠుర, కఠిన సత్యాన్ని గుండె నిండా నింపుకొని, దేశధర్మాన్ని, మానసిక శాంతిని, సర్వజనుల పట్ల ప్రేమను ఆచరణాత్మక వేదాంత ఖడ్గాన్ని ఝళిపించింది. స్వాతంత్య్ర సమరాన్ని సత్యమార్గంలో, సవ్యరీతిలో నడిపించి, దేశాన్ని దాస్య విముక్తం చేయడంలో విజయం సాధించారు బాపూ. గాంధీజీ అధ్యాత్మనే ఆయుధంగా చేసుకొని దేశాన్ని విజేతగా నిలిపిన వైనం భారతదేశపు ఆత్మశక్తి! గాంధీమార్గం కాలాతీతం! గాంధీజీ కాలాతీత వ్యక్తి! గాంధీ స్మృతి అనుసరణీయం. ఆయన అధ్యాత్మవాదం సదా స్మరణీయం!!
‘గీత’.. కరదీపిక
భగవద్గీత ఓ వజ్రాల గని. పద్దెనిమిది అధ్యాయాలు చదివి, వాటి సారాన్ని ఆకళింపు చేసుకోవడం ద్వారా జీవితం ఆనందమయం అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు నాకు పౌరాణిక పాత్రలా కాకుండా.. ఓ మహాగురువుగా, దివ్యజ్ఞాన యోగీశ్వరుడుగా దర్శనమిస్తాడు. తరతరాల భరతజాతికి భగవద్గీత తరగని పెన్నిధి. ఈ మహాగ్రంథం విశ్వమానవ కల్యాణ కారకానికి ఉపయుక్తమయ్యే జీవన సూత్రాల సమాహారం. ‘దీక్ష, కర్తవ్యం, విశ్వాసం, సత్యం, కృషి, గమ్యం వంటి ఉదాత్త అంశాల ప్రాతిపదికగా చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి సాధించాలి’ అనే సిద్ధాంతాన్ని భగవద్గీత సంపూర్ణంగా బలపరుస్తుంది. భారత స్వాతంత్య్ర సంగ్రామ దీక్షకు కావలసిన శక్తియుక్తుల్ని, దృఢచిత్తాన్ని, సానుకూల దృక్పథాన్ని నేను భగవద్గీత నుంచి పొందాను. ‘గీత’ లేని నా జీవితాన్ని ఊహించలేను. అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. భగవద్గీత అందించిన స్ఫూర్తి మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉంది. యువతరానికి భగవద్గీత కరదీపిక కావాలి.
– మహాత్మా గాంధీ
…? వీఎస్సార్ మూర్తి,ఆధ్యాత్మిక శాస్త్రవేత్త