అనంత ఆకాశంలో ఒక కాంతి సంవత్సరం దూరం నుంచి చూస్తే ఈ భూగోళం అతి సూక్ష్మబిందువుగా కనిపిస్తుంది. అది ఇప్పటికిప్పుడు ఆవిరైనా ఆ మహా విశ్వచైతన్యానికి లెక్కలోకిరాని విషయం. ఆ మహా విస్తృతిలో మనిషి ప్రాధాన్యం, వైభవం శూన్యంతో సమానం. సమాధి దశలో అందుకున్న ఆ విశ్వచైతన్య స్థితిని రుషులు సచ్చిదానంద పరబ్రహ్మంగా, సదాశివంగా అభివర్ణించారు. అది ఏ ఇతర అస్తిత్వాలనూ ఆశ్రయించని సర్వస్వతంత్రమైన సత్చిత్ ఆనంద ప్రకాశమన్నది వారి అనుభవం.
సూక్ష్మాతిసూక్ష్మ స్థాయి నుంచి స్థూలాతి స్థూల స్థాయి వరకు ఉనికిలోకి వచ్చిపోయే వస్తుజాలం, వాటికి సంబంధించిన సంఘటనలన్నీ ఆ శివచైతన్య స్పందనల విలాసమన్నది రుషులకు విముక్తమైన అనుభూతి. ఆ దివ్యమైన అనుభూతితోనే వారు ఇంద్రియ సంబంధమైన అనుభవాలన్నిటినీ మితులలో చిక్కిన ‘మాయ’గా పేర్కొన్నారు. అయినా ఆ అనుభవాలు అసలు లేవని చెప్పడం తప్పని వారి భావన. ఆయా పరిమితులకు మాత్రమే సత్యమై, ఈ విశ్వపు ‘మహా అపరిమితికి’ రిక్తమై, లెక్కలోకి రానివి కాబట్టి వాటిని ‘మిథ్య’గా పరిగణించారు వారు. ఈ విధంగా జీవుల ఇహపర ఇంద్రియ అనుభవాల అనిత్యతను వక్కాణిస్తూ, ఇంద్రియ నిగ్రహం ద్వారా పరబ్రహ్మ చైతన్యాన్ని ఆత్మస్థమై, అఖండంగా అందుకొని ముక్తిని పొందమంటారు యోగులు.
ఈ అనుభవం పరమసత్యమైనా ఆ స్థాయిని అందుకోలేనివారు తమకు సాధ్యమైన మార్గాలలో ప్రయాణిస్తూ ఆ పరమసత్యాన్ని నిరాకరిస్తుంటారు, నిరసిస్తారు. ఇలాంటి వైఖరి పూర్ణ మానవ వికాసానికి దోహదపడని, విజ్ఞతలేని బాల్యచేష్ట అవుతుంది. అది విభేదాలకు, ఘర్షణలకు దారితీసి వినాశకారి అవుతుంది. సగటు మానవాళికి ఆ దేహాతీతస్థితిని చేరుకునే మాట అటుంచి, దాన్ని ఊహించడమే కష్టమైనపుడు ఆధ్యాత్మిక వికాసానికి దారి ఏది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మానవ జీవితంలో ఆధ్యాత్మికత అగ్రస్థానాన్ని ఎరిగిన మన పూర్వికులైన వేదమూర్తులు ఎంతో కరుణతో అనేక శివజీవన విధానాలను ఏర్పాటుచేశారు.
జీవన విధానాలేవైనా జీవన లక్షణాలు కొన్ని అందరిలో తప్పనిసరిగా ఉండవలసినవిగా నిర్దేశించారు. సత్యం, అహింస, శుచి, అస్తేయం (పరుల వస్తువులను ఆశించకపోవడం) నాలుగు పాదాలుగా కలిగిన ధర్మాన్ని ఆచరించడం అందరికీ తప్పనిసరి. అలాగే దేవరుణం (దివ్యశక్తులను కృతజ్ఞతతో ఆరాధించడం), పితృరుణం (తల్లిదండ్రులను కృతజ్ఞతతో సేవించడం), రుషిరుణం (పరంపరగా మనకు జ్ఞానభిక్షపెట్టిన గురువులను కృతజ్ఞతతో కొలవడం), భూతరుణం (పర్యావరణానికి హాని తలపెట్టకుండా, పంచభూతాలను కలుషితం చేయకుండా వాటిపట్ల కృతజ్ఞతతో జీవించడం), మనుష్యరుణం-ప్రాణిరుణం (మానవ సమాజానికి, ప్రాణికోటికి హాని చేయకుండా కృతజ్ఞతతో, పరిమితిలో జీవించడం) తీర్చుకోవడమన్నది అందరి విధి. అయితే వీటన్నిటిలో అంతర్గతంగా ప్రవహించే అతిపవిత్ర గుణం ‘కృతజ్ఞత’.
కృతజ్ఞతే నిరహంకారం, వినయం, ప్రేమ. కృతజ్ఞత వల్లే ధర్మాచరణం సాధ్యమవుతుంది. కృతజ్ఞత నిండుగా గుండెలో పండకపోతే ఏ ఆచారాలైనా, ఆరాధనలైనా, ఎంతటి భక్తి అయినా, జ్ఞానమైనా, కర్మలైనా, యోగమైనా మనిషిని వెంటాడే మానసిక వాసనలను ఛేదించలేవు. మధురమైన ఆత్మీయతను అందించలేవు. ఈశ్వరీయ పరిణతిని ఇచ్చి సమశాంతిని కలిగించలేవు. తీసుకువెళ్లగలిగినంత ముక్తికి దగ్గరగా తీసుకువెళ్లలేవు. ఈ కృతజ్ఞతే శ్రద్ధను, నిజాయితీని పెంపొందిస్తుంది. నిత్యవర్తనలో వినయాన్ని, సహనాన్ని దృఢపరుస్తుంది. ఈ కృతజ్ఞత వల్లే విజ్ఞత శుద్ధమై విశాలమవుతుంది. ఈ విధంగా ఇహపర సమున్నతికి, వికాసానికి తల్లివేరు కృతజ్ఞత. మనుషులంతా తప్పకుండా అలవర్చుకోవాల్సిన మేటి గుణం కృతజ్ఞత.
– యముగంటి ప్రభాకర్
94401 52258