ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవర వనం
ఘనస్నిగ్ధ శ్లక్షం చికురనికురుంబం తవ శివే
యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే వలమథన వాటీ విటపినామ్!
(సౌందర్యలహరి-43)
ఈ శ్లోకంలో అమ్మవారి కేశపాశం మహిమను వర్ణించారు. ‘ఓ పార్వతీ మాతా! ‘ధునోతు’.. తొలగిపోవుగాక. తొలగిపోవలసినది ఏమిటి? అజ్ఞానం! ఎవరి అజ్ఞానం.. ‘నః’ అంటే మా అని! అమ్మా! అప్పుడే వికసించిన నల్ల కలువల వనం (తులిత దళితేందీవర వనం) వంటి నీ ప్రకాశవంతమైన చిక్కగా, ఒత్తుగా, నునుపు గలిగిన, మెత్తని మృదువైన వెంట్రుకలు మాలో నెలకొని ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించును గాక! సామాన్యంగా వెంట్రుకలకు పరిమళం ఉండదు. కానీ, అమ్మవారి కురులు సహజ పరిమళభరితమై ఉన్నాయి. అందుకనే బలమథనుని (బలుడనే రాక్షసుని మథించినవాడు-ఇంద్రుడు) నందనవనంలోని (వాటీ) కల్పవృక్షం (విటపి) పూలు (సుమనసః) నీ కురుల సువాసనలను పొందాలని భావించి నీ కురులలో చేరాయని తలుస్తున్నాను (మన్యే)..’ అంటున్నారు, ఆదిశంకరులు.
నల్లని కురులు అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తాయి? అంటే అవి స్నిగ్ధమైనవి. అంటే స్నేహపూరితమైనవి. మృదువైనవి (శ్లక్షం), ప్రకాశవంతమైనవి.. మోహాహంకార భరితమైన నా అజ్ఞానం నీ వెంట్రుకల నలుపు కన్నా కూడా దట్టమైన నలుపును కలిగి ఉన్నది కాబట్టి తొలగించగలవు. విరబూసిన నల్ల కలువలలో, అందంతో కూడిన సహజమైన నలుపు ఉంటుంది. సహజమైన పరిమళమూ ఉంటుంది. అందమూ, పరిమళమూ కలసి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆహ్లాదం తాదాత్మ్యమై తన్మయతను అనుగ్రహిస్తుంది. ఆ స్థితిలో ‘అనుభవించేవాడు‘ ప్రత్యేకంగా ఉండడు. అంతా ఏకీకృతమైన బ్రహ్మానందమే ఉంటుంది. నిజానికి అమ్మవారికి నల్లని వెంట్రుకలు యముని తేజస్సుతో వచ్చాయి. అవి కాలశక్తికి సంకేతంగా చెప్తారు. కాబట్టి అజ్ఞానమనే చీకట్లను కాలశక్తి స్వరూపమైన అమ్మ తొలగించగలుగుతుంది.
‘చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా’ అంటుంది లలితా సహస్ర నామం. ఈ దేవతా పుష్పాలన్నీ అమ్మ కొప్పును ఆశ్రయించాయి. ఎందుకంటే తమకు లేని సహజ సిద్ధమైన పరిమళాన్ని పొందేందుకు. ఎవరైనా లోకంలో తమకు లేని దాన్ని పొందేందుకు అవి దొరికేచోట ప్రయత్నించడం సహజమే కదా! ‘అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే’ అంటారు సౌందర్య లహరిలో మరొకచోట ఆదిశంకరులు. అమ్మవారి కేశాలు వంకరగానూ, మందహాసంతో ప్రకృతి సహజంగానూ ఉన్నాయట. అమ్మ కురులు వంకరగా ఎందుకు ఉన్నాయి? అంటే.. లోకాలను రక్షించడం కోసం పరమేశ్వరుని దయ అమ్మవారి శిరోజాలలో వక్రత్వాన్ని పొందింది అంటారు.
శ్రీదేవీ మహిమ్న స్తోత్రంలో కూడా… ‘ఓ జననీ! అగరు మొదలైన ధూపాలు వేసి, దట్టమైన నల్లని కాటుకతో సమమైన తుమ్మెదల వరుసలాగా ప్రకాశిస్తున్న నీ వెంట్రుకలు సంపెంగ, మొగలి, కడిమి, అశోక, దిరిశెన మొదలైన పూలతో అలంకరించి ఉన్నాయి. అలా భాసించే కురులు నా హృదయ పద్మాన్ని ఆశ్రయించి సదా ఉండుగాక’ అంటాడు దుర్వాసుడు.
మధుకర సహచర చికురైర్మదనాగమ
సమయ దీక్షిత కటాక్షైః
మండిత కంపాతీరైః మంగళ
కందైర్మమాస్తు సారూప్యమ్!
(మూకపంచశతి-ఆర్యాశతకం-39)
తుమ్మెదల గుంపు వంటి దట్టమైన నల్లని తలకట్టుగల అమ్మ.. భక్తులను అనుగ్రహించే విధానాన్ని చెప్తున్నాడు.. మూక కవి. శాక్తేయ మంత్ర సర్వస్వాన్నీ తన కడగంటి చూపులతో సాధకులకు అనుగ్రహించే కారుణ్యమూర్తి. సర్వమంగళాలకు పెన్నిధి ఆమె! అలాంటి లలితా పరమేశ్వరి కేశపాశం మనందరికీ ప్రేయస్సు (ప్రియం), శ్రేయస్సులనిచ్చి కాపాడాలని అమ్మవారిని కోరుకుందాం.
పాలకుర్తి రామమూర్తి