స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ (భగవద్గీత 2-54)
భగవద్గీత తెలియజెప్పిన ప్రధాన విషయాల్లో ‘స్థితప్రజ్ఞత’ ఒకటి. దాన్ని గురించి అందరికీ వచ్చినట్లే అర్జునుడికీ ఓ సందేహం వచ్చింది. ఆ సందేహాన్నే తీర్చమని శ్రీకృష్ణ పరమాత్ముణ్ని అడిగాడు. ఈ ప్రశ్న మిక్కిలి మౌలికమైనది. ఒక వ్యక్తికి అవసరమైన మానసికస్థితే స్థితప్రజ్ఞత. అందుకే దాన్నిగురించి ఎటువంటి సందేహం వచ్చినా తీర్చుకోవాలి. ఆ పనే చేశాడు అర్జునుడు. ‘కేశవా! ఆత్మస్థయిర్యం కలిగినవాడు స్థితప్రజ్ఞుడు అనుకుంటే అతని లక్షణం ఏమిటి? అతను ఏం మాట్లాడుతాడు? ఏ విధంగా కూర్చుంటాడు? ఎలా సంచరిస్తాడు?’ అని స్వామిని ప్రశ్నించాడు. అర్జునుడి సందేహమే ప్రతి వ్యక్తికీ కలుగుతుంది.
చిత్తవృత్తిని నిరోధించుకోవడమే యోగం అని భారతీయ యోగశాస్త్రం భావించింది. ఇది మనిషి తనను తాను నిగ్రహించుకోవడానికి సంపూర్ణంగా తోడ్పడుతుంది. అలాంటి యోగబుద్ధినే ప్రజ్ఞగా భావించాలి. స్థిత అంటే ప్రతిష్ఠితమైనదిగా తెలుసుకున్నప్పుడు, స్థితప్రజ్ఞత అంటే యోగబుద్ధిని తనలో ప్రతిష్ఠించుకోవడమని అర్థమవుతుంది. దాన్ని సాధించినవాడే స్థితప్రజ్ఞుడు. పైన పేర్కొన్న శ్లోకంలో కృష్ణ భగవానుడు ‘స్థితప్రజ్ఞత’ అన్న శబ్దాన్ని రెండుసార్లు ప్రస్తావించాడు. మొదటిసారి ‘స్థితప్రజ్ఞ’ అనీ, రెండోసారి ‘స్థితధీః’ అనీ అనడంలో మనం ఆలోచిస్తే మరిన్ని సత్యాలు ఆవిష్కృతమవుతాయి. అయితే ఈ రెండుసార్లూ ఇవి ఒకే అర్థంలో వాడినట్లు అర్థమవుతున్నది. రెండూ కూడా ఒకే భావంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.
యోగబుద్ధి కలిగినవాడిలో ఆత్మ సంయమనం ఎక్కువ. అతనినే మన సంప్రదాయం ఆత్మజ్ఞాని అని సంబోధించింది. ఒకవిధంగా అతను జీవన్ముక్తుడని నిర్ధారించింది. ఉపనిషత్తులు మొదలుగా సర్వ శాస్ర్తాలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఈ యోగబుద్ధి కలిగినవానిని బ్రహ్మజ్ఞాని, బ్రహ్మనిష్ఠుడు, జీవన్ముక్తుడని పలు విధాలుగా ప్రశంసించాయి. ఇవన్నీ సమానార్థాలుగా భావించవచ్చు. దీన్నిబట్టి స్థితప్రజ్ఞుడే ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మనిష్ఠుడు అని రూఢి అవుతుంది.
ఆత్మజ్ఞానిలో అంతర్ముఖత్వం ప్రధాన లక్షణం. తననుతాను శోధించుకొని సంస్కరించుకోగలడు. రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతంగా ఉండగలడు. సుఖదుఃఖాల్లో సమభావనను కలిగి ఉండే ప్రవర్తన ఉంటుంది. అతని మాటల్లోనూ అవే భావాలు ప్రకటితమవుతాయి. అతని మాటల్లో ఎలాంటి తొట్రుపాటు కానీ, అనవసరమైన భావోద్వేగాలు కానీ కనిపించవు. అవే అతనిని స్థితప్రజ్ఞునిగా గుర్తించే అవకాశాన్ని ఇస్తాయి. దాన్ని మనం ఆదర్శంగా గ్రహించాలన్నది గీతాసారం. అదే భగవానుడి ఆశయం.
మాట్లాడటం, నడవడం వంటివి వ్యక్తి ప్రవర్తనకు అద్దం పడతాయి. ఈ విషయంలో లోకంలోని వ్యక్తులకు అటువంటి స్థితప్రజ్ఞులే ఆదర్శంగా నిలుస్తారు.
ఇక్కడ ప్రశ్నించినవాడు అర్జునుడు, సమాధానం చెప్పినవాడు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు. ఈ సందర్భంలో.. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కదా! ఆయన గురించి అర్జునుడికి తెలియని విషయం లేదు కదా! ఆయనను మించిన స్థితప్రజ్ఞుడు ఎవరు? అనే సందేహం అర్జునుడికి రాలేదా! ఈ విషయంలో శ్రీకృష్ణుడిని ప్రశ్నించడం ఏమిటి? అనిపిస్తుంది. ఇందులో కృష్ణుడిని ‘కేశవ!’ అని అర్జునుడు సంబోధించాడు. కేశవ అనే శబ్దంలో క, ఈశ అనే పదాలున్నాయి. ‘క’-శబ్దం.. బ్రహ్మ, విష్ణువులకు సంకేతం. ఈశ శబ్దం ఈశ్వర సంకేతం. అంటే కేశవుడు త్రిమూర్త్యాత్మకుడు. అందుకే, శ్రీకృష్ణుడిని ‘కేశవ’ అని పిలిచాడు అర్జునుడు. కృష్ణుడి నడవడిక, ప్రవర్తన.. స్థితప్రజ్ఞుడి ప్రవర్తన, నడవడిక అన్న భావం ధ్వనిస్తూ ఉంది. ఆయనలా అన్నింటినీ అవగాహన చేసుకొని సర్వభావాతీత దృష్టిని మనిషి సాధించాలన్నది ఇక్కడ ప్రధానం.
మనిషిలోని స్వపర భేదాలు, స్వార్థబుద్ధి, రాగద్వేషాలు అనేక దుష్పరిణామాలకు దారితీస్తాయి. పైగా వాటివల్ల తాను నిర్వర్తించవలసిన బాధ్యతలనూ నిర్వహించడు. అందుకే, అర్జునుడు కూడా తాను నిర్వహించవలసిన యుద్ధాన్ని చేయలేనని దైన్యాన్ని ప్రదర్శిస్తే.. సారథిగా రథాన్నే కాకుండా జీవనసారథి అయి రథిని కూడా నడపించవలసిన బాధ్యత స్వామివారిపై పడింది. ఆ సందర్భమే విశ్వమానవాళికి ప్రయోజనకరమైన భగవద్గీతగా ఆవిర్భవించింది.
-గన్నమరాజు
గిరిజామనోహరబాబు