‘నరక సదృశమైన ‘నేను’ అనుకునే అభిమానమే నరకుడు. అభిమానాన్ని నిర్మూలించి తనకు తానుగా (ఆత్మ)గా ప్రకాశించడమే దీపావళి’ అంటారు భగవాన్ రమణ మహర్షి. వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా లక్ష్మీపూజ చేస్తాం. ‘గతేడాది గొప్పగా పూజ చేశాం కదా! లక్ష్మీదేవి మనల్ని మరింతగా కరుణించలేదేమి?’ అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. కానీ, మనం గమనించాల్సింది ఏమిటంటే ‘ఉన్నది పోకుండా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం లాంటివి కూడా సంపదే!
ఓ కొత్త కోడలు, శుభదినాన అత్తగారింటికి వచ్చింది. అత్త చెప్పిందని చేదబావికి నీళ్ల కోసం వెళ్లింది. బిందెడు నీళ్లను ఇంట్లోకి మోసుకొచ్చిన కోడలు బాధగా తననెవ్వరూ పలకరించడంలేదని చెప్పింది. అత్త నవ్వుతూ ‘వాళ్లు పలకరించకపోతే నష్టమేమి, నువ్వే వాళ్లను పలకరించు’ అన్నది. ‘తెలియని వాళ్లు కదా అని సంశయించవద్దు, వాళ్లు నవ్వినా నవ్వకపోయినా వాళ్లను చూసి చిన్న నవ్వు నవ్వు’ అని చెప్పింది. వారం తిరిగేసరికి ఊళ్లోని అమ్మలక్కలంతా కొత్తకోడలికి స్నేహితులు అయ్యారు.
ఎవరూ మోగించకుండా గంట మోగదు. పాడకుండా పాటకు రాగమూ కట్టలేం. ఎవరూ వెలిగించకపోతే దీపం వెలగదు. ఎవరో వెలిగించేంతవరకు ఎదురు చూడకుండా మనమే ప్రారంభించాలి. ‘ప్రేమ’ అనే ప్రమిదలో ‘మంచి ఆలోచన’ అనే వత్తి వేసి ‘సేవ’ అనే చమురు పోసి వెలిగించిన దీపం ఎంతో సుందరంగా ఉంటుంది. ఆ దీపం ఎన్ని దీపాలనైనా వెలిగించగలదు. అదే ఒక బల్బు ఆ పని చేయలేదు కదా! ఏడాదికి ఒక్కసారే కాదు దీపావళి. ప్రతి రోజూ మనకు దీపావళి కావాలి. మన ముఖమే సమాజానికి ప్రతిబింబం అవుతుందనేది కాదనలేని వాస్తవం. అందుకు మన ముఖాల్లో, పైసా ఖర్చు లేని చిరునవ్వుల దివ్వెలు వెలిగించాలి. ఎందుకంటే ఒకే ఒక అగ్గిపుల్ల ఉన్న నిప్పుపెట్టె లాంటిది మన జీవితం.
ఆర్.సి.కృష్ణస్వామి రాజు
93936 62821