తపోధన్యాగ్రణి, ధీమణి అయిన శుక మునే తెలుగునాట తిరుగులేని, తరగని
భక్తిరస ఖని (గని) పోతన అమాత్యుని రూపంలో విష్ణురాతునికి (పరీక్షిత్తుకు)
కనీవినీ ఎరుగని ఫణితి- బాణీలో గజేంద్రమోక్షణ కథను వినిపిస్తున్నాడు…
గజేంద్ర ఉవాచ- ఓ కరుణా పయోనిధీ!
‘ప్రాణుల పిలుపులు విన్నంతనే ప్రేమతో పలుకుతావట! ఆపదలో చిక్కి అలమటిస్తున్న వారిని ఆదుకొనటానికి చనరాని, చొరరాని చోట్లకైనా చేరుకుంటావట! నీ చరణాలే శరణన్నవారికి కరుణతో ‘ఓ’ అంటావట! తలచిన మాత్రాన తెలపకనే అంతా తెలుసుకుంటావట! కాని, నా నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉన్నావంటే, ఇప్పుడు ఇదంతా నాకు అపనమ్మకంగా- అనుమానంగా ఉన్నది స్వామీ!’ ‘సంశయాత్మా వినశ్యతి- సంశయగ్రస్తుడు నశిస్తాడ’ని గీతామాత హెచ్చరిక. అవిశ్వాసమనేది ఎప్పటికైనా బాధకమే కాని కార్యసాధకం మాత్రం కాదు. గజేంద్రుడు విశ్వమూర్తి అయిన విష్ణువుని ఆర్తితో కీర్తిస్తూ..
‘ఓ కమలప్రియా! ఓ విమల ప్రభావ!- నిర్మలమైన మహిమ గల దేవా! కోరిన వరాలిచ్చే ఓ దేవరా!
విపక్షుల- విరోధుల యందు కూడా కక్ష- వైరం,వివక్ష- భేదభావం లేని దక్షతగల దొరా! నా మొర వినవా? కవులు, యోగులచే పలువిధాల వందింపబడే ఇందిరా రమణా! ఓ సుగుణ భూషణా! శరణాగతులకు కల్పవృక్షమా! కానరావా? కనికరింపవా? శరణన్న నన్ను కరుణించి కాపాడవా? అలుపెరుగక వలచిన వానిని తలచకపోతే ఇలలో పలుచన కావా అశరణా శరణా? వేగ చనిచని రావా మునిమానస హరణా?’ అని పరిపరి విధాల పరితపిస్తూ, ఇక ఇదే ‘చివరిసారి’ అన్నట్లు- ‘ఓ హరీ! ఉరితాడు వంటి మకరి బారిన పడ్డ ఈ కరిని కనికరించి దరిజేర్చు’ అంటూ నిక్కినిక్కి చూస్తూ నిట్టూర్పులు విడిచాడు, ఆకాశానికి చెవులప్పగించి ఆక్రోశించాడు గజేంద్రుడు.
ఆ సమయంలో దగ్గరే ఉన్నా, విశ్వవ్యాపకత్వం- విశ్వమంతా వ్యాపించి ఉండే విశిష్ట లక్షణం వారికి లేనందున బ్రహ్మాది దేవతలు కరీంద్రుని కుయ్యి విన్నా, గూబ గుయ్యిమన్నా వానికి సాయపడక మిన్నకుండి పోయారట! ‘విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు, భక్తి యుతున కడ్డపడఁదలంచె’- అప్పుడు తాను ఎన్నుకొన్న విభుడు- అంతటా ఉన్నవాడు, విజయ శీలుడూ అయిన పన్నగశాయి వెన్నుడు- విష్ణువు, భక్తవరుడైన గజరాజును గట్టెక్కించాలని గట్టిగా ఒట్టుపెట్టుకున్నాడు.
‘సుగుణోత్తమ’- భగవంతుని కల్యాణాత్మకాలైన సుగుణాలనే ఉత్పలాల (కలువపూల) మాల అల్లి గజేంద్రుని రూపంలో నిజేంద్రుడైన- ఇష్టదైవమైన, ఉపేంద్రునికి- ఇనకుల తిలకుడైన వనమాలి- శ్రీరామచంద్రునికి శరణాగతి గావిస్తూ అలంకరించింది పోతన అమాత్యుడే! ‘ఏవం గజేంద్ర ముపవర్ణిత నిర్విశేషం’- సంస్కృత భాగవతంలో గజేంద్రుడు స్తుతించింది మూర్తిభేదం- నామరూపాలు లేని పరతత్తాన్నే, పరమాత్మనే! కనుకనే, విభిన్నమైన నామరూపాలను తమ స్వరూపాలుగా భావించే- అభిమానించే విరించ్యాది విబుధులు- బ్రహ్మాది దేవతలు రక్షించడానికి రాలేదు. గజేంద్రుని పిలుపును అనుసరించి ‘అఖిలరూపులు తనరూపమైనవాడు’- సర్వాత్మ స్వరూపుడు, సుదర్శన చక్రధారి శ్రీహరి వేదస్వరూపుడైన సుపర్ణుని (గరుడుని) అధిరోహించి అక్కడ ఆవిర్భవించాడు. బ్రహ్మాండపతిని, పుండరీకాక్షుని చూచి వేదండ (గజ)రాజు- ‘అబ్బ! అండజ (గరుడ) వాహనుని అండ అబ్బిందిగా!
ఇక నా గండం గడచినట్లే’ అని జబ్బలు చరుస్తూ ‘ఉత్క్షిప్య సాంబుజకరం’- అతి నిబ్బరంగా తొండంతో ఒక పుండరీకాన్ని (కమలాన్ని) పైకెత్తి, ‘నారాయణా! జగద్గురో! భగవంతా! నీకు దండాలయ్యా!’ అంటూ అర్పించాడు. వైనతేయుని (గరుత్మంతుని) వేగం కూడా చాలదని భావించిన ఆదిదేవుడు విష్ణువు అమాంతం వాహనంపై నుంచి కిందికి దూకి, అందరు దేవతలకూ కనువిందు చేస్తూ మకరి ముఖం ఖండించి కరిరాజును చెరనుంచి విడిపించాడు. మూలంలో ‘గజేంద్ర మోక్షణం’ ఇంతటితో ముగిసింది. కాని, తెలుగులో భక్తకవి రాజు బమ్మెర పోతరాజు భావుకుడై పరవశించి భాగవతానికి ఆత్మ అయిన భక్తిరసాన్ని పరవళ్లు తొక్కిస్తూ, మూలానికి మెరుగులు దిద్ది రక్తి కట్టిస్తూ గ్రంథాన్ని విస్తరించి భక్తలోకాన్ని తరింపజేశాడు. పోతన తన అతిలోక కల్పనా చాతురిని, అమిత కవితా వైభవంతో వెలుగొందునట్లు ఇందు పొందుపరిచాడు. ఈ కృతిలోని అతి మధురమైన పద్యాలు సుకృతాత్ములు, రసికులైన తెలుగువారి రసనాంచలాలపై (నాలుకలపై) నర్తిస్తున్నాయనడం ఈ కాలానికీ వర్తిస్తుంది.
పోతన భాగవతంలో గజేంద్రుని ‘పుష్ప సమర్పణ’ వాచ్యంగా- మాటల్లో లేకపోయినా, పరాకాష్ఠకు (ైక్లెమాక్స్కు) చేరిన కరీంద్రుని ఆర్తిని, ఆక్రోశాన్ని పై ఉత్పలమాలలో పోతపోస్తూ పోతన ఆదిలోనే అన్యాపదేశంగా ‘ఓ కమలాప్త’ అంటూ కమలాప్రియునికి ‘మనః పుష్పం సమర్పయేత్’- మనస్సనే కమలాన్ని సమర్పించడాన్ని ధ్వనింపజేశాడని అనిపిస్తుంది. పరమాత్మను నిర్విశేషంగా- నిర్గుణంగా స్తుతిస్తే, ఆయన సగుణంగా, సవిశేషంగా ప్రత్యక్షమవడం, గజరాజుకు మోక్షమివ్వడం ఇక్కడ విశేషం! ‘అద్వైతం
పరమార్థమైనా భక్తి కొరకు కల్పించుకొన్న ద్వైతం అద్వైతం కంటే కడు సుందరం, ఆ భక్త్యానందం మోక్షం కన్నా వందరెట్లు అధికం’ అన్న భక్తి సూత్రాలకు భక్త పోతన కల్పించి పెంచిన కథాభాగం జ్వలంతమైన దృష్టాంతం! (సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ , 98668 36006