Pothana Bhagavatam Episode 113 | శుకముని అవనీపతి విష్ణురాతుని (పరీక్షిత్తు)కి కరిణీపతి (కరి) మకరుల కనీవినీ ఎరుగని పోరాట కథను తనివితీర వినిపిస్తున్నాడు- రాజా! ఒక కొండను మరో కొండ వెనుదీయకుండా ఢీ కొన్నట్లు ఆ రెండూ ఎడాతెరపి లేకుండా తలపడ్డాయి. స్థానబలిమిచే నీరాటానిదే (మొసలిదే) వాటంగా- పైచేయిగా ఉంది. కరిరాజు కృష్ణపక్ష ఉడురాజు- చంద్రుని వలె క్రమంగా కృశించిపోయాడు. మహామాయ అనే గొప్ప అంధకారం అల్పమైన జ్ఞానకాంతిని తెప్పలుగా కప్పివేసిన విధంగా నక్రం- మొసలి, అవక్ర పరాక్రమంతో కుప్పించి ఎగసి ఏనుగును పెక్కురీతుల మిక్కిలిగా నొప్పించింది. ఈ సందర్భంలో పారాశరు (వ్యాసు)నిచే పరోక్షం- చాటు, చేయబడిన గజేంద్ర మోక్షణ కథా పరమార్థాన్ని ప్రత్యక్షీకరిస్తూ- విశదీకరిస్తూ, రస-ధుని (సాగరం) పోతన, పశువులైన కరి-మకరి పాత్రల ఆంతర్యాన్ని ఆవిష్కరిస్తూ ధ్వని గర్భితంగా అద్భుతమైన రెండు స్వకీయ- సొంత వృత్తాలను (పద్యాలను) పేర్కొని సాధక, సాహితీ ప్రియం భావుకుల చిత్తాలను రసానంద మద మత్తాలు గావించాడు. ఈ ఘట్టంలో బమ్మెర వారు కుమ్మరించిన ఆత్మీయత కనులున్నవారికి కొట్ట వచ్చినట్లు కనిపించక మానదు!
నీళ్లలో ఉన్న మొసలి ముందు కాళ్లను గట్టిగా నేలమీద అదిమిపెట్టి- ఊదిపట్టి (ఆసనసిద్ధి), ఊపిరి బిగబట్టి (ప్రాణాయామం చేస్తూ), పంచ జ్ఞానేంద్రియ- శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ సంబంధమైన విషయాల ఉన్మాదాన్ని- విశృంఖల విజృంభణాన్నీ, అదుపు తప్పిన ఆడంబరాన్ని అరికట్టి (ప్రత్యాహారం- ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి లోగొనటం), ప్రాకులాడే స్వభావం కలిగిన బుద్ధి అనే లత- తీగకు మారాకు (పాకుడు కొయ్య, ఆలంబనం, ఆశ్రయం) కలిగించి, అనగా బుద్ధివృత్తులకు, వ్యాపారాలకు విరామం కల్పించి- విరక్తిని కలిగించి, శోక రహితమైన పరబ్రహ్మ పదమును ఆశ్రయించి (ధ్యాన ధారణలు), అనగా బ్రహ్మ చింతన చేస్తూ, లోలోన బ్రహ్మానందాన్ని అనుభవించు (సమాధి సుఖం) మహా యోగీంద్రుని వలె ఆ మకరరాజు విక్రమంతో విజృంభిస్తూ మత్తేభరాజు పాదాన్ని కదలకుండా, వదలకుండా ఎంతో ఒడుపుగా పట్టుకున్నాడు.
రాజా! ‘హూహూ’ అన్న పేరుగల ఒక గంధర్వుడు నదిలో కామినుల- ప్రియురాళ్లతో జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ నదిలోనే కొద్ది దూరంలో స్నానానంతరం దేవదేవుని మానస జపం చేసుకుంటున్నాడు ‘దేవల’ మహర్షి. ‘వినాశకాలే విపరీత బుద్ధిః కర్మాను సారిణీ’- పోగాలం దాపురించినప్పుడు బుద్ధి వక్రించి కర్మను అనుసరించి విపరీతంగా- విరుద్ధంగా ప్రవర్తిస్తుంది కదా! ఆ గంధర్వుడు పరిహాసానికై నీటిలో ఈదుతూ వచ్చి పెద్ద పోటుగాని వలె ఆయన పాదాలను గట్టిగా వాటేసుకున్నాడు. ‘అయ్యబాబోయ్! మొసలి పట్టుకుందే!’ అని ముదుసలి మహర్షి బెదురుతో అదిరిపడ్డాడు. ఆ మూర్ఖపు పొగరుబోతు పళ్లు ఇకిలిస్తూ పైకి లేచాడు. ఆ చెనటి- నీచుడు, నిప్పుతో చెలగాటమాడాడు. ‘ఓరీ మదాంధుడా! నా పాదాలను మొసలిలాగా పట్టిలాగావు కాన మొసలివై పో!’ అని మహర్షి వాణ్ని శపించాడు. కైపు దిగిన తర్వాత ఆ కాముకుడు మునిపాదాలు పట్టుకొని క్షమించమని ఆర్తితో అర్థించగా దేవలుడు కనికరించి వానితో ‘వత్సా! వేదన చెందకు. ఈ నదిలో నా కాళ్లు పట్టుకున్నట్లు నీవు నివసించే మడుగులోకి దిగే గజేంద్రుని- గత జన్మలో భక్త చంద్రుని పాదాలను ఉత్సాహంతో విడవకుండా పట్టుకో. గజరాజును ఉద్ధరించే హరి పరమాత్మే నీకు కూడా మకరి జన్మనుంచి ముక్తి కలిగిస్తాడు’ అని అనుగ్రహించాడు..
రాజా! గొప్పదైన ఆ గ్రాహం దేవల మహర్షి శాప కారణంగా కలిగిన దారుణమైన తన పాప (మకర) దేహాన్ని విడిచి దివ్యదేహంతో ‘హూహూ’ గంధర్వుడుగా మారిపోయింది. గంధర్వుడు భక్తితో భగవంతునికి మొక్కి, మక్కువ మీరగ మిక్కిలి స్తుతించాడు. అచ్యుతుని అనుగ్రహంతో శాప విచ్యుతుడై పునఃపునః ప్రణామాలు అర్పించి పుణ్యాత్ముడై గంధర్వలోకానికి తరలిపోయాడు.
దిక్కు తోచక (ముందు వెనకలు తెలియక) జీవితాశకు చిక్కి, బతుకుతెరువును మారుత్రోవలో పడి పోరు సల్పుచూ, గొప్ప వ్యామోహమనే తీగచే గట్టిగా కట్టివేయబడిన పాదాన్ని- అనగా సంసారమనే పెను ఊబిలో కూరుకుపోయిన తనను విడిపించుకోలేక- శక్తి చాలక, తనకు కలుగబోయే దుర్గతిని శంకించి- ఊహించి, శోకించే దేహిక్రియ- మానవ జీవుని వలె, మొసలి వాడి కోరలచే కొరకబడిన కాలిగిట్టల కొస ఎముకతో ఏనుగు పస చెడి పరమదైన్యాన్ని పొందింది. ఆర్తితో అలమటించింది గజేంద్రం.
మోహమనే గ్రాహం- మొసలి, మదోన్మత్త జీవుణ్ని పట్టుకొని పీల్చిపిప్పి చేస్తోంది. దేహాభిమానాన్ని- అహంకారాన్ని వదలితే ‘జీవోదేవస్సనాతనః’- జీవుడే దేవుడు. పటుతరమైన ఈ మేటి విజ్ఞానంతో తప్ప కోటి కల్పాలకైనా కటువైన ఈ సంసార (అవిద్యా) బంధం తెగదు. అన్ని గ్రహాలు గగనంలో ఉంటే ఈ మోహ-గ్రాహం మనలోనే ఉంది. ‘గృహ్ణాత్యేవ న ముంచతి ప్రాణిన ఇతి’- గ్రహించడమే- పట్టుకోవడమే గాని వదలిపెట్టడం దీనికి తెలియదు. అందుకే ‘గ్రాహ’మని పేరు. ఎవ్వరినీ వదలదు… భగవత్ శరణార్థులను- భక్తులను తప్ప! (సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006