నారద మహర్షి రాజర్షి
ధర్మరాజుతో.. యుధిష్ఠిరా!
ఆగ్రహంతో ఊగిపోతున్న
ఉగ్ర నరసింహుని, భక్తి
విగ్రహుడైన ప్రహ్లాదుడు ప్రపత్తి- శరణాగతి పూర్వకంగా ఇలా ప్రస్తుతించాడు.. పరమ పురుషా! అమరవరులు, మహర్షులు, ముని ముఖ్యులు కూడా నిన్నుపరిపూర్ణంగా ప్రస్తుతించలేరట!
ఇక, అసురుని ఆత్మజుణ్ని (కుమారుణ్ని), అహంకారిని, అజ్ఞానిని, అర్భకుణ్ని అయిన నేనేపాటి వాడను? నీ ప్రసన్నతను పొందడానికి పౌరుష ప్రతాపాలు, పాండిత్య ప్రకర్షలు, ప్రతిభా పాటవాలు, జపహోమాలు, నిష్ఠా నియమాలు, తపస్తేజాలు, అందచందాలు, ఆభిజాత్యాలు అస్సలు అక్కరకు రావు. పూర్వం నీకు ప్రపత్తి చేసిన గజేంద్రుని వలె, శక్తిని ముక్తిని అనుగ్రహించే అమితమైన అనన్యభక్తి మాత్రమే నిన్ను సంతృప్తిపరచే అనితర సాధనం! ఈశ్వరా! నీవు పరిపూర్ణుడవు. సంపూర్ణ కర్మఫలాలను నీకు సమర్పించడం పరమ ధర్మం. అప్పుడు ముఖానికి చేసిన అలంకారాలు దర్పణం (అద్దం)లోని ప్రతిబింబానికి కూడా దక్కునట్లు (చెందునట్లు) భగవంతుడవైన నీకు చేసిన ఉపచారాలన్నీ భక్తునికి కూడా ప్రాప్తిస్తాయి. దయామయా! నీ ఆదేశాలు తలదాల్చే బ్రహ్మాది దేవతలు కూడా ఈనాడు నీ భీషణ ఆకృతి చూచి భీతిల్లుతున్నారు. శాంతించు స్వామీ!..
అవనికి అశనిపాతమైన- కంటకుడైన అసురేంద్రుని అంతమొందించావు. సాధు, సజ్జనులకు సంతోషం సమకూరింది. అవతార ప్రయోజనం అమరింది- సిద్ధించింది కదా! ఈ ఆనంద సమయంలో కూడా నీకింత ఆగ్రహం ఎందుకయ్యా! నిర్మలాత్మా! నీరజాక్షా! లోకులు నిరంతరం నిన్ను నిత్యకళ్యాణకరుడవనీ, భృత్య (దాసుల) కల్మషహరుడవనీ భావిస్తున్నారు. స్వామీ! నీ ఈ ఉగ్రవేషం చూచి నేను ఏ మాత్రం వెరచి, వ్యగ్రత పొందడం లేదు. కానీ, భయంకరమైనదీ, భరింపరానిదీ అయిన ఈ భవ (సంసార) దావాగ్నికి నేను భయపడుతున్నా. అశరణ శరణా! కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు.
‘నరసింహ దేవా! నన్ను రక్షించి నా పితృదేవులను శిక్షించడం నాపై పక్షపాతంతో కాదు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ నీ సహజ స్వభావం. మహానుభావా! కామక్రోధాదులతో కలుషితమైన నా చిత్తం నిన్ను చింతించదు. మాధుర్యాది రసాలను మరగిన నా రసన నీ నామ స్మరణామృతం పానం చెయ్యదు. కామినీజన ఆనన (ముఖ) దర్శనం కోరే నా అక్షి (కన్ను) పాప ప్రక్షాళకమైన నీ దివ్యమంగళ విగ్రహం వీక్షించాలని కాంక్షించదు. వివిధ దుర్భాషలు వినగోరే నా వీనులు వ్యథలు తొలగించే నీ కథలు వినలేవు. గృహపతి (గృహస్థు)ని సపత్నీ (సవతి) సమూహం సతాయించునట్లు పురుషుని సతతం ఇంద్రియాలు వ్యథితం చేస్తాయి- బాధిస్తాయి. కామ వికారం లేని వారికి నీ కంటే కోరదగింది ఏముంది? భక్తి లేనిచో నీ తత్తం తెలియదు. తాత్తికులైన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారాలు (కర్మలు) విరమించి వేదాంత వేద్యుడవైన (ఉపనిషత్తులచే తెలియదగిన) నిన్ను సమాధిలో దర్శించి రమిస్తూ- ఆనందిస్తూ ఉంటారు’ ఇట్లు ప్రశ్రయ (వినయ) ప్రణామ పూర్వకంగా ప్రస్తుతించిన ప్రహ్లాదుని సంస్తుతికి రోషం మాని ప్రసన్నవేషుడై నరసింహుడు నవ్వుతూ ఇలా పలికాడు..
‘నాయనా! ప్రహ్లాదా! నీ చరిత్ర నాకు చాలా నేత్రోత్సవంగా ఉంది. నీకు శుభం కలుగుగాక! నేను భక్తుల కోరికలు తీర్చేవాడను. నీవు కోరిన వరం నేను తప్పక ప్రసాదిస్తా. దిగులు పడకు. నేను చూడ శక్యంకాని వాడను, సందేహం లేదు. అయినా, నన్ను ఒక్కసారి చూస్తే చాలు, ప్రాణికోటికి పునర్జన్మ ఉండదు సుమా! వత్సా! నన్ను ఎందరో ఎన్నెన్నో వరాలు వేడుకుంటారు. నువ్వూ ఏదైనా కోరుకో, తప్పక తీరుస్తా!’
మూలంలోని శ్లోకంలో ‘కామపూరః’ అని ఉండగా పోతన ‘కామదుడ’నని స్వారస్యంగా ప్రయోగించాడు. ‘కామదుడ’ అనగా కోరికలు తీర్చేవాణ్ని, వాటిని పూర్తిగా తొలగించేవాణ్ని అని కూడా అర్థం! ప్రహ్లాదుడు ‘కామదుడ’ పదాన్ని పై రెండవ అర్థంలోనే అన్వయించుకొన్నాడు. పరమాత్మ ప్రహ్లాదుని కామ విజయాన్ని పరీక్షించడానికి కపటంగా వరం కోరుకో-కోరుకో అంటూ ప్రలోభపెట్టాడు. ప్రలోభానికి లొంగని ప్రహ్లాదుడు పరమాత్మతో ఇలా పలికాడు.. ‘స్వామీ! ‘త్వం పూర్ణ కామః’- నీకు లేనిది లేదు. ‘అహం అకామః’-
నాకు కావలసింది లేదు. కాన ‘పూర్ణమదః పూర్ణమిదమ్’- ఇద్దరం పూర్ణులమే! ప్రభూ! ఈ స్థితినే సదాసిద్ధంగా ఉండునట్లు అనుగ్రహించు. అయినా, నీవు నాకు వరమివ్వాలని పట్టుదలతో ఉన్నట్లయితే, వరదాయకా! నా మనసులో కోరికలు మొలకెత్తకుండా వరం ప్రసాదించు. కోరికలు విడిచిన మేటి నీతో సాటి అయిన వైభవం దీటుగా పొందుతాడు’ అని ప్రహ్లాదుడు ప్రణవ పూర్వకంగా పురుషోత్తమునికి ప్రణామాలు అర్పించాడు. ప్రహ్లాదుని భక్తికి నిష్కామ మతియే చరమ పరిణతి!
స్వామి ఇలా సెలవిచ్చాడు.. నీ వంటి జ్ఞాన సంపన్నులైన ఏకాంత భక్తులు ఏ కోరికా కోరరు. అయినా, దానవ భర్తవై మన్వంతర కాలం సమస్త భోగాలూ భోగించు. భోగానుభవం వలన పుణ్యఫలాలు, నిష్కామ పుణ్యకార్యాల వలన పాపాలు నశింపజేసుకుంటూ ప్రారబ్ధం తీరగానే శరీరం విడిచి ఘనమైన కీర్తితో నా సాన్నిధ్యం పొందుతావు. అర్భకా! మరణకాలంలో నిన్ను, నన్ను స్మరణ చేసినవాడు మరల మాతృగర్భం పొందడు. ఇది విని ప్రహ్లాదుడు పరమానంద భరితుడై ఇలా పలికాడు… ‘దేవదేవా! నా పితృదేవునికి కూడా దుర్గతి కలగకుండా దయచూపు.’ నృసింహుడు.. ‘ప్రహ్లాదా! నేటివరకు నేను ఏ మేటి రాక్షసుని నా ఒడిలోకి తీసుకోలేదు. నీ వంటి భక్తుని కన్నతండ్రి ముయ్యేడు (ఇరవై ఒక్క) తరాల వారితో సద్గతి పొందాడు. భవ్యచరితా! నీవు భక్త లోకానికి ఉత్తమ ఆదర్శం! గుణనిధీ! నీ తండ్రికి వేదోక్త విధిగా ఉత్తర క్రియలు ఆచరించు’ అని ఆనతిచ్చాడు. ‘పంకజాసనా! పాపాత్ములైన అసురులకు ఇలాంటి భయంకరమైన వరాలు అనుగ్రహించడం పాములకు పాలుపోయడం వంటిది. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు’ అని హిరణ్యగర్భుణ్ని (బ్రహ్మదేవుని) గట్టిగా మందలించి హెచ్చరించాడు. నరహరి అంతర్ధానం చెందాడు. ఈ విధంగా జయవిజయులు మొదటి జన్మలో
శాపవిముక్తులు అయ్యారు.
ప్రహ్లాద చరిత్రకు వక్త అయిన నారద
మహర్షి ముక్తాయింపుగా ఫలశ్రుతి ఇలా ముచ్చటించాడు..
ధర్మరాజా! అత్యంత రమణీయం, కమనీయం, కళ్యాణప్రదమైన శ్రీనృసింహదేవుని వీరవిహారం, హిరణ్యకశిపు సంహారం, పుణ్యభాగవతుడైన ప్రహ్లాదుని సంచారమూ శ్రద్ధాభక్తులతో విన్నా, చదివినా మానవుడు పరమ శోభనరూపుడై అమృతపదవి అందుకొంటాడు.
ధర్మరాజా! బ్రహ్మాది దేవతలు కూడా పరస్పరం మనసులో ఆలోచించి, చర్చించి, శోధించి మాటలలో పలకలేని- వర్ణింపజాలని పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీకు (పాండవులకు)
మిత్రుడుగా, మేనబావగా,
మనఃప్రియుడుగా, మహాఫల (మోక్ష) ప్రదాతగా మీ గృహంలో
విహరించడం మీ మహాభాగ్యం! ఎందుకని? ‘ప్రహ్లాదుని గృహంలో నరసింహుడు వసించ (ఉండ) లేదు. కాని, పాండవుల గృహంలో పరమాత్మ శ్రీకృష్ణుడు పలు రూపాలలో నివసించాడు’ అని శ్రీధరస్వామి వ్యాఖ్య.
ఇలా నారదమహర్షి ధర్మరాజుకు ప్రహ్లాదచరిత్ర పూర్ణంగా
ప్రవచించాడు.
(సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ ,98668 36006