Pothana Bhagavatam Episode 110 | శ్రీ మహావిష్ణువు ధరించిన పరమ పావనమైన వామన అవతార మహిమ అంతా ప్రధానంగా ఆయన విక్రమం- పాద విక్షేపం (అడుగుల)లోనే నిక్షిప్తమై ఉన్న విధంగా, ప్రహ్లాదుని ఖేదం తొలగించి మోదం కలిగించడమే ప్రధాన కారణంగా ప్రభవించిన నరసింహావతార వైభవ ప్రాభవమంతా ఆయన నఖముల- గోళ్ల ప్రభావంలోనే ప్రక్షిప్తమై ఉంది.
శ్లో॥ ‘ప్రమాణ నఖ నిర్భిన్న మహా మోహామరారిహే, నమస్కుర్వే నృసింహాయ స్వప్రకాశ చిదాత్మనే’- ‘చిత్సుఖి’ (వ్యాస సూత్ర భాష్యం) మంగళాచరణ- ప్రార్థనా రూపమైన ఈ సుశ్లోకం విబుధారి- హిరణ్యకశిపుని వక్షఃస్థలాన్ని విదళించిన ఉగ్రనరసింహుని ప్రఖర- తీక్షణమైన, నఖాల పరమార్థాన్ని ప్రకటించే ప్రౌఢ- గంభీరమైన వ్యాఖ్య. మహామోహమే- అజ్ఞానమే అమరారి హిరణ్యకశిపుడు. వేదాంత (ఉపనిషత్) సారభూతమైన మహావాక్య చతుష్టయమే (అయమాత్మా బ్రహ్మ, తత్తమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ) పరమ ప్రామాణికమైన భేదాంత- అజ్ఞాన నాశకాలైన నరహరి నఖాలు. అట్టి స్వయం ప్రకాశ చిదానంద స్వరూపుడైన నరసింహ దేవునికి సదావందన చందనాలు!
నారద మహర్షి ధర్మనందనునితో.. నరేంద్రా!
‘నరమూర్తి గాదు, కేవల హరిమూర్తియు గాదు’- ఇలా కేవల నరరూపమూ, అలాగని మాత్ర మృగరూపమూ కాని నరమృగ- నరసింహ రూపంతో పగలూ రాత్రీ కాని సంధి- సంధ్యా సమయంలో, ఇంటా బయటా కాక ఇంటి గుమ్మం మీద, మింటిలోను మంటి మీదా కాక ఒడిలో- తొడల మీద, ఏ అస్త్రం శస్త్రం వాడక, ప్రాణమున్న ప్రాణం లేని నఖాల- గోళ్లతో, విరించి- బ్రహ్మ వరించి ఇచ్చిన అన్ని వరాలను మన్నిస్తూ, ముల్లోకవాసుల
హృదయాలను భల్లం- శూలం, వంటి ఆ భయంకర దైత్యమల్లుని ప్రాణాలు హరించాడు నరహరి. ఆ విచిత్ర రూపం చూసి కోపం పట్టలేక అక్కసుతో
తనపైకి దండెత్తి వచ్చిన పెక్కువేల రక్కసులను ఒక్కపెట్టున మట్టుపెట్టాడు.
సుందరమైన ఈ సర్వలఘు కంద పద్యమాకందంలో మహాకవి పోతన, సంధ్యారాగ రంజితాలైన చంద్రరేఖవలె ప్రకాశిస్తున్న, స్వామివారి సర్వజన వంద్యములైన (నమస్కరింప తగిన) అలఘు- గురు (గొప్ప) నఖములను- ‘ముఖములు,
శిఖములు, సఖములు’ అంటూ తనకు పసందైన అంత్యప్రాసలో సహృదయ హృదయానందంగా ఎంతో అందంగా అభివర్ణించాడు.
కం॥ ‘స్ఫురిత విబుధజన ముఖములు
పరివిదళిత దనుజ నివహగతి తనుముఖముల్
గురు రుచి జిత శిఖిశిఖములు
నరహరి కరనఖములమరు నతజన సఖముల్’
ఆహవం- యుద్ధం, చాలించినా స్వామికి ఆగ్రహం తగ్గలేదు. మహోగ్ర ముఖంతో ఊగిపోతున్నాడు. దేవతలందరూ బిత్తరపోయి పరికించటానికి కానీ, పలుకరించటానికి కానీ భయభ్రాంతులై తత్తరపడుతుండగా నరసింహుడు సభా భవనంలోని సింహాసనంపై ఆసీనుడయ్యాడు.
నరనాథా! నరసింహుడి విజయోత్కర్షం తిలకించి దేవకాంతలు పులకించి హర్షంతో పుష్పవర్షం కురిపించారు. దగ్గరకొచ్చే ధైర్యం చాలక దేవతలందరూ దూరం నుంచే తమ హస్తాలను మస్తకాలపై చేర్చి, అనాది అవిద్యా సంసార సాగరాన్ని సంతరింపజేసేవాడు, ప్రఖర నఖాలే ప్రశస్త శస్ర్తాలుగా కలిగినవాడు, దానవ మత్తగజేంద్రాలను మృగేంద్రం వలె హరింపజేసే నరకేసరికి- హరికి నమస్కరించారు. బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు ఇందిరావరుని వివిధ రీతుల వేర్వేరుగా వినుతించారు… ‘రమేశా! ఘోరమైన విప్రశాపంచే క్రూరదానవుడై పుట్టి, నీతో కత్తి కట్టిన ఈ దితిపట్టి (కనక కశిపు)ని ఇప్పట్టున తుదముట్టించి వీనికి నీవు కీడు కాదు, కృప చూపి అపవర్గాన్నే- మోక్షమే అనుగ్రహించావు. ఆపన్న శరణ్యా! భక్తితో కన్నా వైరంతోనే నిన్ను వేగంగా చేరవచ్చునన్న మాట! స్వామీ! నువ్వు సంతరించుకొన్న అంచితమైన ఈ అద్భుత నరసింహ స్వరూపం తిలకించి మేము తరించాము. మా అందరికీ ఆపదలు అంతమొందగా ఆనందం కలిగింది’- అని విష్ణు సేవకులు విన్నవించుకున్నారు. ఇలా దేవతా ప్రముఖులు ప్రపన్నులై దేవదేవుని పరిపరి విధాల దీనంగా ప్రార్థించారు. అయినా స్వామి ప్రసన్నుడు కాలేదు. నరహరి దరి చేర వెరచిన విబుధవరులు హరిప్రియను- మహాలక్ష్మిని ఆహ్వానించి..
కం॥‘తర్షంబుల నరసింహుని,
హర్షంబులఁజూచి నిర్జరాంగనలు మహో
త్కర్షంబులఁ గుసుమంబుల
వర్షంబులు గురిసి రుత్సవంబుల నధిపా!’
‘శ్రీహరికి పట్టపురాణివి, పతి సేవాధర్మం తెలిసిన నిపుణ మతివి, హరియే గతియైన మానవతివి, హరియందే రతి (ప్రీతి) గల సతివి (హరికి ప్రియమైన సతివి). ఓ సింహ మధ్యమా! ఉగ్రనరసింహుని శాంతింపజేయ రావమ్మా’ అంటూ ‘హరి’ నామస్మరణ పూర్వకంగా ‘భాస్కరి’ (లక్ష్మీదేవి)ని అభ్యర్థించారు. అంగీకరించిన ఆదిలక్ష్మి ఆసక్తితో స్వామి సన్నిధికి వెళ్లి ఆ భీమ రూపం చూసి సందేహించింది-
‘మా వారి ఈ విభిన్నమైన ఆకారం మున్నెన్నడూ విన్నదీ కాదు, కన్నదీ కాదు. శ్రీవారు శాంతించిన తరువాతే వారిని సమీపిస్తా’ అని భావించి భామామణి మిన్నకుండిపోయింది.
కం॥ ‘హరికిం బట్టపుదేవివి
హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా
హరిరతివి, నీవు సని నర,
హరి రోషము డింపవమ్మ! హరివరమధ్యా!’
భార్గవి మనోభావం గ్రహించిన బ్రహ్మ, మెల్లగా వెళ్లి మా ఎవరి వల్లా శాంతించని స్వామిని చల్లపరచమని వల్లమాలిన ప్రేమతో పిల్లవానిని- ప్రహ్లాద కుమారుని కోరాడు. సన్నిధి చేరి వినయంతో తన పెన్నిధి పాదపద్మాలకు సాష్టాంగపడ్డ గుణనిధి ప్రహ్లాదుని మస్తకాన్ని ప్రశస్తమైన తన హస్తంతో ప్రేమగా నిమిరాడు నరసింహుడు. శ్రీహరి హస్త స్పర్శతో ప్రహ్లాదుని సమస్త (సంసార) భయాలు తొలగి బ్రహ్మజ్ఞానం కలిగింది. ఒళ్లు పులకరించింది. కళ్ల నుంచి ఆనందాశ్రువులు పెల్లుబికాయి. పొంగులువారే ప్రేమతో గొంతుబొంగురు పోయింది. చిత్తం భగవదాయత్తమయింది. భక్తి పరవళ్లు తొక్కింది. మదిలో మాధవుని మృదుపద పద్మాలను పదిలంగా నిలుపుకొని చేతులు మోడ్చి ప్రహ్లాదుడు పరమాత్మని ప్రస్తుతించాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ , 98668 36006