‘యతోధర్మస్తతో కృష్ణః, యతోకృష్ణస్తతోజయః’ అని మహాభారత వాక్యం. ఈ మాటలను భీష్ముడు ఒకసారి, సంజయుడు ఒకసారి పలికారు. అంటే ‘ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది’ అని అర్థం. నిజానికి ధర్మం అనేది ఒక కర్మ. దానికి చైతన్యం ఉండదు. ఏదో మనకు ఇవ్వగలిగే సమర్థత దానికి ఉండదు. కర్మను గమనించి చైతన్యాన్నిచ్చేవాడు ఈశ్వరుడు. ఆయనే కర్మ ఫలప్రదాత. ధర్మం ఎక్కడ ఉంటుందో, అక్కడ దైవం తనను తాను ఆవిష్కరింపజేసుకుంటాడు.
ధర్మం తెలిసినంత మాత్రాన ధర్మాత్ముడు కాలేడు. దాన్ని అనుష్ఠించినవాడే ధర్మాత్ముడు. ప్రాణం పోయే సందర్భంలోనూ ధర్మాచరణకు కట్టుబడినవాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఎన్ని తెలిసినా ధర్మాచరణలో అనురక్తి లేనివాడి వల్ల సమాజానికి ఏ ప్రయోజనం ఉండదు. రామయణాన్ని పరిశీలిస్తే, రాముడికి ఎంత తెలుసో, రావణుడికీ అంతే తెలుసు. రాముడు ఎంతటి శూరుడో, రావణుడూ అంతటి వీరుడు. అతనికి తెలియని ధర్మమంటూ లోకంలో ఏదీ లేదు. కాంచనలంక, కావలసినంత బలగం, గొప్ప తపస్సు, ఈశ్వర అనుగ్రహం ఇలా రావణుడికి ఏ లోటూ లేదు. కానీ, ధర్మాన్ని ఆచరించని కారణంగానే రావణుడు.. రాముడి చేతిలో హతమయ్యాడు. ‘ధర్మాన్ని విడిచిపెట్టినందుకే నువ్వు యుద్ధభూమిలో ఇలాంటి చావు చస్తున్నావ’ని మండోదరి గుండెలు బాదుకొని ఏడ్చింది.
రాముడు మాత్రం ధర్మాన్ని మీరి అడుగు కూడా కదపలేదు. ధర్మాన్ని ఆచరించడమే జీవితంగా మలుచుకున్నాడు. ‘సుగ్రీవునితో ఎందుకు స్నేహం చేశావు రామా! నన్ను మిత్రుడిగా చేసుకొని ఉంటే, సీతమ్మను తృటిలో నీ ముందు ఉంచేవాడిన’న్న వాలితో ‘అధర్మాన్ని పాటించే నీతో స్నేహం చేసి, నా భార్యను రక్షించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నాడు రాముడు. రాజ్యం పోయినా, తండ్రి మరణించినా, భార్య అపహరణకు గురైనా రాముడు ధర్మాన్ని వీడలేదు. చివరికి లక్ష్మణుడు సైతం ‘అన్నా! ఈ మార్గం వదిలి మరో మార్గం చూసుకోవాలి’ అన్నప్పుడు కూడా, రాముడు తన పంథాను మార్చుకోలేదు.
మహా భారతంలో ఒకవైపు ధర్మాన్ని పట్టుకున్న పాండవులు, మరోవైపు అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవులు కనిపిస్తారు. మార్గం ఎంత కఠినంగా ఉన్నప్పటికీ శాంతిని, ధర్మాన్ని కాపాడటమే తన కర్తవ్యం అంటాడు ధర్మరాజు. వనవాస సమయంలో ద్రౌపది ఒకసారి ధర్మరాజుతో ‘నువ్వు అనుష్ఠించే ధర్మం నిన్ను అడవుల పాలుచేసింది. అదే ధర్మాన్ని విడిచిపెట్టిన దుర్యోధనుడు రాజ్యమేలుతున్నాడు. ఈ ధర్మం నీకేం ఇచ్చింది?’ అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు ‘ఏదో ఆశించో, మరేదో కాంక్షించో ధర్మాన్ని పట్టుకోలేదు. స్వభావసిద్ధంగా ధర్మాన్ని ఆచరించేవాడిని నేను’ అని సమాధానం ఇస్తాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, మరెన్ని నష్టాలు చవిచూసినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఆయన. అందుకే పాండవాగ్రజుడు ధర్మరాజుగా కీర్తి మూటగట్టుకున్నాడు.
ధర్మాన్ని ఆచరించడం అంటే పంట పండించడం వంటిది. పొలం దున్నగానే పంట చేతికిరాదు కదా! ఆరుగాలం కష్టపడాలి. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొని నిలబడితే గానీ ఫలితం చేతికి అందదు. ధర్మాన్ని పట్టించుకోని వాడికి రోజులు బాగానే గడుస్తుండవచ్చు. సుఖాలూ కలుగవచ్చు. కానీ, అవన్నీ తాత్కాలికమే! అధర్మం ఇంటికి అంటుకున్న చిన్న మంట వంటిది. చిన్నదే కదా! అని ఉపేక్షిస్తే ఇళ్లంతా కాలిపోతుంది. ధర్మ మార్గాన్ని విడిచిపెట్టామని తెలిసి కూడా, అందులోంచి బటయపడకపోతే జీవితం నిష్ఫలమవుతుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మమే మనలను కాపాడుతుంది. మనల్ని ధర్మం ధరిస్తే, ధర్మాన్ని ఈశ్వరుడు ధరిస్తాడు. ధర్మం అంటే ఆధారం అనే అర్థం ఉంది. రైలుబండికి పట్టాలు ఎలా ఆధారమో! బతుకుబండికి ధర్మం ఆధారం. ఈ విషయాన్ని గుర్తెరిగి ధర్మబద్ధంగా జీవించడమే మానవుడి విధ్యుక్త ధర్మం కావాలి.
-వేముగంటి శుక్తిమతి , 99081 10937