ఒక పండితుడు గ్రామంలోని కొందరు యువకులకు ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు నిర్వహించే వాడు. ఊరికి సమీపంలో ఉన్న పట్టణంలో ఉన్న కృష్ణ మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో భక్తులకు సేవ చేయడానికి సహాయకుల అవసరం వచ్చింది. కొందరు యువకులను పంపమని నిర్వాహకులు పండితుడిని కోరారు. అందుకు ఆయన సంతోషంగా అంగీకరించాడు. యువకులు సైతం సహాయకులుగా వెళ్లడానికి ఎంతో ఉత్సాహం చూపారు. వారు పట్టణానికి వెళ్లే రోజు రానే వచ్చింది. శిక్షణ పొందుతున్న యువకులను, పండితుడు రెండు బృందాలుగా విభజించాడు. మొదటి జట్టును పిలిచి మీరు సేవతోపాటు అక్కడ కారుచౌకగా ఏమి దొరుకుతుందో గమనించమన్నాడు. అలాగే రెండో బృందంతో, మీరు వెళ్తున్న ప్రదేశంలో ఎక్కువ ఖరీదైనది ఏమిటో పరిశీలించమన్నాడు. ఆలాగేనని చెప్పి యువకులు వేడుకలకు బయల్దేరారు. వారం రోజులపాటు సేవ చేసి గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.
వస్తూ వస్తూ మొదటి బృందంలోని సభ్యులు గురువు తమకు చెప్పింది గుర్తుకు తెచ్చుకున్నారు. పట్టణమంతా తిరిగి ‘బొరుగులు’ కారుచౌకగా ఉన్నాయని గుర్తించారు. ఒక మూట బొరుగులు కొన్నారు. తమ తెలివికి పండితుడు అభినందిస్తాడని భావించారు. రెండో జట్టులోని సభ్యులు అక్కడ వీధులన్నీ గాలించి ‘వజ్రం’ ఎక్కువ ఖరీదైనదని నిర్ణయానికి వచ్చారు. అందరూ చందాలు వేసుకొని ఓ వజ్రపుటుంగరాన్ని కొన్నారు. దానిని ఇస్తే గురువు చాలా సంతోషిస్తారని భావించారు. అందరూ కలిసి గ్రామానికి చేరిన తర్వాత.. పండితుడిని కలుసుకున్నారు. కుశల ప్రశ్నలయ్యాక మొదటి జట్టు బొరుగుల మూట చూపించింది. రెండో బృందం వజ్రపుటుంగరాన్ని చూపించింది.
అప్పుడు ఆ పండితుడు చిన్నగా నవ్వి ‘నేను గమనించమన్నది ఇవి కాదు. ఈ ప్రపంచంలో చిరునవ్వును మించిన చౌకైనది లేదు. కోపం కన్నా ఖరీదైనది లేదు. కోపం వల్ల కలిగే నష్టాల విలువను అంచనావేయలేం. మిమ్మల్ని జన సమూహంలో గమనించమన్నది అదే’ అని వివరించాడు. ‘నవ్వితే కోటి లాభాలు, కోప్పడితే కోటి నష్టాలు!’ అని తెలుసుకున్నారు ఆ యువకులు.