క్రైస్తవులంతా ప్రస్తుతం శ్రమదినాలు పాటిస్తున్నారు. పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండటం, ప్రార్థనా నియమం పాటించడం, చేసిన వాటికి పశ్చాత్తాపం చెందడం, దాన కృత్యాలు చేయడం ఇత్యాది కార్యకలాపాలతో ఈ శ్రమదినాలు పరిపూర్ణమైపోతాయా? మొదటి మూడూ వ్యక్తిగత విషయాలు. ఉపవాసం వల్ల వేరెవరికీ ప్రయోజనం లేదు. ఉపవాసం పాటించే వ్యక్తికి శారీరకంగా, మానసికంగా కొంత ఉపయోగం ఉండవచ్చు. అలాగే ప్రార్థన కూడా వ్యక్తిగతం. పశ్చాత్తాపం చెందడం కూడా స్వవిషయమే! శక్తి కొద్దీ దానధర్మాలు చేయడంలో సామాజిక కోణం దాగి ఉన్నది.
దీనివల్ల అన్నార్తులకు ఊరట లభిస్తుంది. ప్రభువు కోసం కన్నీటి ప్రార్థన చేసినా, చేయక పోయినా ఇబ్బంది లేదు గానీ, నీ స్వార్థం కోసం ఇతరులను ఇబ్బందిపెట్టకూడదు. దైవ సమీపమే ఉపవాసం. దైవ వాక్యం శ్రద్ధగా వినడమే ఉపవాసం. నలభై దినాల పాటు గుడిలోనే కదలకుండా కూర్చున్నంత మాత్రాన దేవుడు కూడా నిన్ను నమ్మడంటే నమ్మడు. మతాచారాన్ని కఠినంగా ఆచరించే వారు చాలామంది ఉంటారు. వారిలో కొందరు ఆ మత నియమాన్ని ప్రయోగాత్మకంగా మానవత్వం వైపు మళ్లిస్తున్నవాళ్లు నిజంగా ధన్యులు. వారిపై దైవకృప సదా వర్షిస్తూ ఉంటుంది.