శ్రీకృష్ణుడి అవతార ప్రయోజనంలో సాయపడేందుకు ప్రతియుగంలో బలరాముడూ అవతరిస్తాడు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా వచ్చి రాముడి సేవలో తరించాడు. కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువలు హరినామ సంకీర్తన ఉద్యమంలో తోడ్పడటానికి శ్రీనిత్యానందగా మళ్లీ అవతరించాడు. ముందు అవతారాల కన్న ఇది విభిన్నమైనది. కృష్ణనామాన్ని సేవిస్తూ ప్రపంచమంతా వ్యాపించేందుకు ఒక విశుద్ధ భక్తుడిగా వారు అవతరించడమే ఆ ప్రత్యేకత. శ్రీకృష్ణ భక్తి ఉద్యమంలో పేరెన్నికగన్న శ్రీ నిత్యానంద మహాశయుడు మాఘ శుక్ల త్రయోదశి నాడు జన్మించారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి అగ్రజుడైన బలరాముడే, ఈ కలియుగంలో శ్రీ నిత్యానంద రాముడిగా అవతరించారు. ఐదు శతాబ్దాల కిందట 1473 ప్రాంతంలో పశ్చిమ్ బెంగాల్ ఏకచక్రధామంలో హడాయ్ పండిత్, పద్మావతి దంపతుల కుమారుడిగా ఆయన జన్మించారు.
‘అవధూత’లైన వారు సామాజిక కట్టుబాట్లకు, వర్ణాశ్రమ ధర్మానికి అతీతంగా ఉంటారు. తమ అవతారంలో కొలువై ఉన్న పరమాత్ముడిని ధ్యానించడంలోనే సతుష్టులై జీవిస్తారు. ఇహపర బంధనాలను దాటి, మాయామోహం నుంచి విముక్తులై స్వతంత్ర జీవన విధానాన్ని అవలంబిస్తారు. అలాంటి అవధూత శిఖామణి శ్రీనిత్యానందులు. పతితులైన వారిని సైతం ఉద్ధరించడమే శ్రీచైతన్య మహాప్రభువుల సంకీర్తన ఉద్యమ ఉద్దేశం. ఆయన ఎందరి జీవితాలనో తీర్చిదిద్దారు. వారందరూ ఉత్తమ వర్ణాలకు చెందిన వారే. కానీ, శ్రీ నిత్యానంద ప్రభువులు మాత్రం జగాయ్, మాధాయ్ తదితర జాతులవారిని ఆదరించి, వారిని ఉద్ధరించారు. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లినా వెనుకంజ వేయలేదు. తన నిర్హేతుక కృపతో, ఔదార్యంతో వారి మనసులను గెలిచి పరివర్తనం తీసుకొచ్చారు. అలాంటి శ్రీ చైతన్య-నిత్యానందుల పరంపరను అనుగమించిన వారికి అంతటి సేవాభాగ్యం తప్పక లభిస్తుంది. శ్రీ నిత్యానంద ప్రభువుల పరంపరానుగతమైన ఆచార్యుల కృప నేటికీ ఎందరినో సన్మార్గం వైపు నడిపిస్తున్నది. ఇదే గురుశిష్య పరంపరకు నిదర్శనం. పరమ పవిత్రమైన ఈ నిత్యానంద త్రయోదశి తిథి నాడు వారు చూపించిన మార్గంలో అనుగమిద్దాం.
…?శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984