బ్రహ్మర్షి శుకుడు రాజర్షి పరీక్షిత్తుతో.. వసుమతీశా! వసువులనే దేవతలలో వరిష్ఠుడు ద్రోణుడు. అతని వర పత్ని ధర. వారిని ధరణి భూమిపై జన్మించమని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. విశ్వేశ్వరుడైన మహావిష్ణు సేవాభాగ్యం ప్రసాదించినట్లయితే అలాగే పుడతామన్నారు ఆ పుణ్యదంపతులు. ఆ ద్రోణుడే నందుడు. ధరాదేవే యశోద. శ్రీహరి కూడా వీరిని మాతాపితరులుగా మన్నించి ఎంతో అనురాగంతో ఆదరించాడు.
ఒకనాటి తెల్లవారుజామున యశోద ఉల్లములో నల్లవాని అల్లరి చేష్టలను వల్లె వేస్తూ ‘దధి మంథనం’ పెరుగు చిలుకుతోంది. ‘బాలు నంకించి పాడెడి పాట వలన దరువు లిగురొత్త బెరుగింతి దరువ జొచ్చె’ అరుణోదయ వేళ ఆ తరుణీ మణి పాడే పాటకు తరువులు చిగురు తొడుగుతున్నాయని కడు వేడుకతో వర్ణిస్తాడు పరమ భాగవతుడు పోతన.
క॥ సుడియుచు వ్రాలుచు గిదుకుచు
సడి గొట్టుచు నమ్మ రమ్ము! చన్నిమ్మనుచున్
వెడవెడ గంతులు వైచుచు
గడవ గదిసి బాలకుండు గవ్వము బట్టెన్
ఆ సమయంలో బాలముకుందుడు మామూలు కంటె ముందుగానే మేల్కొని వచ్చి తల్లిపై వాలుతూ, పైట లాగుతూ, అల్లరి చేస్తూ, మెల్లమెల్లగా గంతులు వేస్తూ ‘అమ్మా! ఆకలేస్తోంది, పాలివ్వవే’ అంటూ పెరుగు కడవలోని కవ్వం కదలకుండా పట్టుకొన్నాడు.
ఉపనిషత్తులు పరమాత్ముని అకాము(నిష్కాము)డని, అప్రాణు ప్రాణ రహితుడని నివేదిస్తాయి. అసువు(ప్రాణా)లు లేని ఆ పునర్వసువుకు, ప్రాణపతికి ఆకలి దప్పులు ఉంటాయా? కాని, శుక యోగి ఆ అకలంకుని మాయాదూరుని ‘స్తన్యకామః’ (తల్లిపాల కొరకు తల్లడిల్లువాడు) సకాముడని అంటున్నాడు. నారాయణుడు నిరాహారియే. కాని, అవతార లీలా సమయంలో పరమాత్మ తన చిన్మయ శరీరాన్ని మృణ్మయంగా పాంచ భౌతికంగా భ్రాంతి గొలిపే విధంగా ప్రదర్శిస్తాడు. భక్తుల భావాన్ననుసరించి భగవంతునికి ఆకలి వేస్తుంది, దప్పిక అవుతుంది. నిద్ర వస్తుంది, భయం కలుగుతుంది. చలి వేడి కూడా తగులుతాయి! భక్తుని హృదయం ప్రేమచే ఆర్ద్రమైనప్పుడు ఓ పరీక్షిత్తూ! పరమాత్మకు క్షుత్తు ఆకలి పుడుతుంది. యశోద నిష్కామ భక్తి రుచి మరిగిన శుచిశ్రవుడు (శుద్ధమైన కీర్తి కలవాడు) విష్ణువు సకాము(కోరిక కలవా)డవుతాడు.
యశోద సాధకురాలు. దధి మంథనం సాధనం. శ్రీకృష్ణుడు సాధ్యం. (‘సిద్ధః, సిద్ధిః, సిద్ధిదః, సిద్ధిసాధనః’ అని విష్ణు సహస్రనామాలు) సాధనలో తన్మయత్వం వలన సాధ్యం లక్ష్యం స్వయంగానే లభించగలదని భక్తిశాస్త్ర సిద్ధాంతం. ఇదే ‘పుష్టి భక్తి’. సర్వ సాధనలు, ఆరాధనలు నారాయణుడు రానంతవరకే! నవనీతా(వెన్న)లకు నవనీతమైన నీలమణి శ్యామ బ్రహ్మ శ్రీకృష్ణులవారు మెచ్చి విచ్చేసిన తరువాత కూడా ఇంకా మంథనం సాధన ఎందుకు? ‘నదిని దాటి కూడా నావను అదే పనిగా పట్టుకు కూర్చుంటామా?’.. అన్నట్టుగా కిట్టప్ప కవ్వం తిరగకుండా పట్టుకున్నాడు.
ఈ మంథాన లీలలో (‘మనో మంథానం’ శంకరులు) మనస్సే కవ్వం. కవ్వపు దండం కర్ర శ్రవణానికి ప్రతీకం. ఆ దండానికి క్రింద ఉండే గుత్తికి తొమ్మిది డోరియాలు ఉంటాయి ఇది అనాది సంప్రదాయం. ఈ తొమ్మిది డోరియాలు శ్రవణ, కీర్తనాది నవవిధ భక్తులకు చిహ్నాలు. ప్రేమా భక్తి భగవత్ ప్రీతియే రజ్జువు తాడు. ‘దృఢభక్తి రజ్జు సహితం’ అంటారు ఆదిశంకరులు. గట్టిగా ఉన్న పెరుగును కవ్వం పట్టి మథించడమే ‘మననం’. పెరుగు పల్చబడ్డ తరువాత చిలకడం ‘ధ్యానం’. దాని ఫలమే శుద్ధ సత్త రూపమైన ‘హయ్యంగవీనం’ వెన్న అనే కన్నయ్య!
శుకుడు రాజా! అలా కవ్వం పట్టుకొన్న తన ముద్దులపట్టి బాలకృష్ణుని యశోద నవ్వుతూ ఒడిలో కూర్చోపెట్టుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలివ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లి రొమ్ములో తలదూర్చి పాలు తాగుతున్నాడు. ఇంతలో పొయ్యి మీది పాలు పొంగిపోతుంటే ఆ ఇంతి యశోద చూచింది. పాలు కడుపార తాగని బాలుని కిందకు దించి పాలకుండ దించడానికి గబగబ లోపలికి వెళ్లింది. మధ్యలో వదిలేసి వెళ్లిందని కోపంతో కృష్ణుడు ఒక పదునైన రాతిముక్కతో పెరుగుకుండను పగులగొట్టాడు. అందున్న వెన్న తింటూ కన్న దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు. పాలకుండ దించి వచ్చిన యశోద బాల నేల పాలైన పెరుగును చూచి తన లోపల చాల నవ్వుకొని పైకి కోపం నటిస్తూ, తుంటరి కొడుకు కొంటె కృష్ణుడు కానరాక వెత చెందుతూ అతనిని వెదుకుతూ బయల్దేరింది. ఇక్కడ మాయమైన కృష్ణుడు మరో ఇంటిలో ప్రత్యక్షమయ్యాడు. రోలు తిరగవేసి దానిపై ఎక్కి నిలబడి చాలా కోపంగా, ఉట్టి మీద ఉన్న వెన్న తీసి దగ్గరున్న కోతికి తినిపిస్తున్న కన్నయ్యను తల్లి చూసింది. కొడుకు దుడుకుతనాన్ని తలచుకొని పడతి యశోద కడకుఇలా తలపోసింది…
కం॥ ‘లాలనమున బహుదోషము
లోలిం బ్రాపించు దాడనోపాయములం
జాల గుణంబులు గలుగును
బాలురకును దాడనంబ పథ్యంబరయన్’
‘మక్కువతో ఎక్కువగా మురిపము గారాబం చేస్తే మారాము పెంకె పట్టు పెరిగి పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు తగిలిస్తూ ఉంటేనే కట్టడి చేస్తేనే చాలా మంచి గుణాలు అలవడతాయి. దుండగులైన బాలురకు దండోపాయమే కడు మెండైనది’ అని నిశ్చయించి యశోద చేతిలో బెత్తం పట్టుకొని బెదిరిస్తూ, కోపంగా అదలిస్తూ దగ్గరకు వచ్చింది. భయానికే భయమై అభయ స్వరూపుడైన ఇభరాజ (గజేంద్ర) వరదుడు బాలకృష్ణుడు భయం నటిస్తూ రోటి మీద నుంచి గభాలున దూకాడు. అతివేగంగా పారిపోసాగాడు. చుట్టుపక్కల ఉండే గోపికలు గుట్టుగా చూస్తూ నవ్వుతూ ఉండగా యశోద కూడా బెత్తంపట్టి ముద్దులపట్టి (కొడుకు)ని పట్టుకొందామని వెంట పరుగెత్తింది.
కరపాత్రీ స్వామి అంటారు కరిరాజ వరదుడు హరి భయపడి పరిగెత్తడమా! ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం! తన ఐశ్వర్యశక్తిని, అనురాగాన్ని పంచుతూ తన్ను పెంచుతూన్న తల్లి వాత్సల్యానికి అంకితం చేశాడు పరమాత్మ. అసురుడెవడైనా వెంటపడితే వెంటనే సుదర్శన చక్ర స్మరణ! కాని, ఇప్పుడు అంబ (తల్లి) బెత్తాన్ని వారించడానికి అంబుజాక్షుడు త్రివిక్రముని వద్ద ఏ అస్త్రశస్ర్తాలూ లేవు! ‘ఘన యోగీంద్ర మనంబులున్ వెనుకొనంగా లేని లీలా రతున్’ ‘మహా మహా యోగీంద్రుల మనస్సులు కూడా వెంటపడి పట్టలేని ఆ లీలా గోపాల బాలుని పట్టుకొని కట్టివేయాలనే పట్టుదలతో అతనిని వెంబడించి తరుమ గలిగిన ఆ తరుణీమణి ఎంత భాగ్యవంతురాలు!’ అంటూ పోతనగారు కూడా శుకుల వారి గొంతుతో గొంతు కలిపి తనవంతుగా నందసీమంతినిని యశోదను ఎంతగానో నుతించారు.
యశోద పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది కాని కన్నయ్యను పట్టలేకపోయింది. శ్రీధరులంటారు.. పరమాత్మకు ముఖము, వక్షఃస్థలము ధర్మమైతే పృష్ఠభాగం వెన్నువీపు అధర్మం. వెన్నదొంగను వెంటాడుతున్న యశోద కన్నయ్య వెన్నును మాత్రమే కనగలుగుతోంది. అధర్మం వెంటపడువారు ధర్మ రూపుడైన పరమాత్మను పట్టలేరు, ముట్టలేరు సరికదా కనిపెట్టలేరు కూడా! భక్తి కూడా ధర్మానుకూలంగానే ఉండాలి. కర్తవ్య నిర్వహణ, ధర్మాచరణ పరమాత్మకి చాలా ప్రియమైనవి. భక్తిలో అధర్మం చోటు చేసుకుంటే అది మిక్కిలి చేటు కలిగిస్తుంది. యశోద చేతిలో అహంకారమనే బెత్తం ఉంది. అహంకారంతో కూడిన భక్తి కూడా సఫలం కాదు. ఈశ్వరుడు అహంకారాన్ని ఎప్పుడూ క్షమించడు. జడ వస్తువును ప్రకృతిని పట్టుకొని ఉన్నంతవరకు చేతన పరమాత్మని కట్టలేము. ఖిన్నురాలైన యశోద కర్రను పారవేయగానే కర్రిపిల్లడు (నల్లబాలుడు), చన్నిచ్చి పెంచిన తల్లికి ఇక ఎంతమాత్రం వెన్ను చూపరాదని మన్నించి ప్రసన్నుడై వెనుదిరిగి చూచాడు. ముఖ (ధర్మ) దర్శనం కాగానే ఆ ఇందుముఖి యశోదకు దేవకీ నందనుడు పట్టుబడ్డాడు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006