యద్యత్ పశ్యతి చక్షుర్భ్యాం తత్త దాత్మేతి భావయేత్ 69
మనుష్యుడు కండ్లతో దేనిని దేనిని చూస్తాడో అదంతా ఆత్మయే అని.. అంటే పరబ్రహ్మమే అని భావించాలి.
యద్యచ్చృణోతి కర్ణాభ్యాం తత్త దాత్మేతి భావయేత్ 70
చెవులతో ఏదేది వినిపిస్తుందో అదంతా ఆత్మయే అని.. అంటే పరబ్రహ్మమేఅని భావించాలి.
యోగ తత్త్వోపనిషత్తు.(ఉపనిషద్రత్నాకరము 176 పు)
ప్రతినిత్యం లోకంతో మనకు సంబంధం ఏ విధంగా కలుగుతూ ఉన్నదని పరిశీలిస్తే ఉదయాన మనం మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో శబ్దాలను వింటూ ఉంటాం. ఎన్నో దృశ్యాలను చూస్తూ ఉంటాం. వాటితోనే కదా లోకంతో మనకు సంబంధం ఏర్పడుతున్నది! లోకేశ్వరునితో సంబంధం ఏ విధంగా ఏర్పరచుకోవాలో మనలో చాలామందికి తెలియదు. తెలియకపోవచ్చు కూడాను. ఎందుకంటే మనమంతా సామాన్యులమే! అందుకనే మన కందరికీ అర్థమయ్యే రీతిలోనే యోగ తత్వోపనిషత్తు చాలా సరళంగా తరణోపాయం వివరించింది.
అదేమంటే కనిపించేది, వినిపించేది అంతా బ్రహ్మమే.. అని భావిస్తూ ఉంటే చాలు.. క్రమంగా పరబ్రహ్మంతో మమేకమై పోతాం. ఆ దివ్యసాన్నిధ్యం మనను వరిస్తుంది. ఇంతకంటే సులభోపాయం మరేం ఉంటుంది కనుక! ఇందులో ఏవో కప్పి చెప్పడాలు విప్పి చెప్పడాలు గూఢార్థాలు లేనే లేవు కదా! వివేకానందుడు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకునేవాడు. సరిగ్గా అదే సమయంలో, ఇంటి పక్కనే జూట్ మిల్లులో పెద్ద శబ్దంతో సైరన్ మోగించేవారు.
దానితో ఆయన చాలా చికాకు పడిపోయేవాడు. ఇదే విషయం శ్రీరామకృష్ణ పరమహంసకు చెప్పుకొన్నాడు. పరమహంస చిరునవ్వు నవ్వి ఆ సైరన్ కూతనే పరబ్రహ్మంగా భావించి మనస్సును లగ్నం చెయ్యమని పలికారు. కొద్దిరోజుల్లోనే వివేకానందుని సమస్య పరిష్కారమై పోయింది.సాధకుడైన వాడు ఇంటినే ఆశ్రమంగా మార్చుకోవాలి. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలనే సాధనగా మార్చుకోవాలి అని దీనివల్ల తెలుస్తున్నది.
…? డా.వెలుదండ
సత్యనారాయణ