యామిమాం పుష్పితాం వాచం, ప్రవదంత్య విపశ్చితః
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః॥ (భగవద్గీత 2-42)
లోకంలో మానవులకు ఫలాసక్తి ఎక్కువ. ఏ పనిచేసినా దాని సంపూర్ణ ఫలం తనకే లభించాలని తపిస్తుంటారు. పైగా ఇది మానవ సహజమని సమర్థించుకుంటారు. అలాగే చాలామంది ఈ జన్మ ఉన్నదే అనుభవించడానికి అని భావిస్తారు. కానీ, మోక్షపథంలో సాగాలని, భగవదైక్యం కావాలని ఆశించరు.
కర్మలు చేయడం వరకే మనకు అధికారం ఉంటుంది. ఫలితం భగవంతుడి నిర్ణయానికి వదిలివేయాలి. ఎప్పుడూ ఫలాసక్తిని కలిగి ఉండొద్దని అర్జునుడికి బోధిస్తూ.. ‘పార్థా! అవివేకులైన వారికి వేదం ప్రతిపాదించిన సకామ కర్మలపై ఇష్టం ఉంటుంది. దాని ఫలం మీద ఆసక్తి ఉంటుంది.
స్వర్గాన్ని మించిన సుఖం మరొకటి లేదని, వికసిత పుష్పాలు పరచినంత అందంగా వాదిస్తూ ఉంటారు’ అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే వేదం చెప్పిన విధంగా పుణ్యకర్మలు చేయవలసిందే! కానీ, కర్మఫలం విషయంలో మాత్రం అనవసరంగా ఆసక్తిని పెంచుకోరాదన్న భావనను స్వామి వ్యక్తీకరిస్తున్నారు. కేవలం ఫలితాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఏ కార్యాన్నీ, ఎటువంటి కర్మనూ చేయరాదన్నదే స్వామి బోధనలోని ఆంతర్యం. అర్జునుడికి బోధించే నెపంతో భగవద్గీత ద్వారా ప్రపంచానికి ఈ సందేశాన్ని అందించారు. ప్రతి పనికీ ఫలితం ఉండవచ్చు! కానీ, కర్మాచరణ చేసేవారికి అదే ప్రధాన లక్ష్యం కాకూడదు. పండితులు, ప్రవక్తలు కూడా ఈ కర్మను ఆచరిస్తే ఈ ఫలితం పొందుతామని, ఈ యాగం చేస్తే ఈ ప్రయోజనం కలుగుతుందని విస్తృతంగా తమ ప్రసంగాల్లో బోధిస్తూ ఉంటారు.
ఈ ప్రసంగాలు మనల్ని కర్మలు చేసే దిశగా ప్రేరేపించాలి కానీ, దాని ఫలితంపై ఆశలు పెంచేలా ఉండకూడదు. లేనిపోని ఆశలు పెంచొద్దు. ఫలాపేక్ష కారణంగా భగవంతుడి సన్నిధికి చేరలేం, మోక్షాన్ని సాధించలేం. అటువంటి వారి మాటలు తాత్కాలికంగా ఆనందం కలిగిస్తాయి, ఆశలు పుట్టిస్తాయి. అందుకే వారి మాటలను స్వామి ‘పుష్పితాం వాచం’ అన్నాడు. అంటే సుకుమారమైన పూలు పరచినట్లుగా ఆ మాటలు ఉంటాయని పేర్కొన్నాడు. కానీ, పుష్పాలు కొంత సమయానికి వాడిపోతాయి. అది వాటి సహజ లక్షణం. అదేవిధంగా కాంక్షించిన ఫలితాలు లభించినా అవి తాత్కాలికాలే. తొందరగానే నశిస్తాయి. అంతిమ లక్ష్యమైన మోక్షం దూరమవుతుందన్న విషయం స్ఫురింపజేస్తూ భగవద్గీత ఈ మాటలను వికసిత పుష్పాలని చెప్పి కనువిప్పు కలిగించింది.
ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఈ బోధనలు చేసేవారిని ‘విపశ్చితులు’ అన్నా డు. వీళ్ల బోధనలు, ప్రసంగాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇదే అసలైన దైవస్మరణ, దైవ ఆరాధనేమో అనిపించేలా ఉంటాయి. ఆరాధనలకు, భక్తి ప్రపత్తులకు సంబంధించిన మాటలే వాళ్లు చెబుతుంటారు. పైగా వేద, వేదాంగాలు అధ్యయనం చేసి మరీ ప్రబోధిస్తుంటారు. కానీ, వాళ్లు బోధించే విషయాల్లో చాలావరకు కామ్యార్థాలే కనిపిస్తాయి. ఆ మాటల్లోపడి కోరికలు నెరవేర్చుకొనే క్రమంలో మోక్షానికి దూరమైపోతుంటారు. అందుకే, చెప్పేవాళ్లను విపశ్చిత్తుల ని గీత స్పష్టం చేసింది. శంకరభగవత్పాదులు ‘శ్రూయమాణా రమణీయం’ అన్నారు. అంటే వీరిని అనుసరిస్తే ఫలమే యోగమని రూఢి అవుతుంది. ఏ ఫలం అనుభవించాలంటే ఏ కర్మ చెయ్యాలన్న విచికిత్సలోనే సాధకుడు సమయం వృథా చేయడం వల్ల అసలైన యోగం మరిచిపోయే ప్రమాదం ఉంది. మోక్షమే యోగమన్న సంగతి పూర్తిగా విస్మరించే అవకాశం ఉంటుంది.
మన ధర్మానుసారంగా వేదవిజ్ఞానపు లోతులను చూసి అవగాహన చేసుకున్న వాడు మృత్యువును అధిగమించి మోక్షమార్గంలో ప్రయాణిస్తాడు. కానీ, ఇతరులు వాంఛల దగ్గరే ఆగిపోతారు. వేదాల లోతులను తెలిపే వేదాంత శాస్ర్తాలైన ఉపనిషత్తులు సంపూర్ణంగా ఈ మార్గాన్నే సూచించాయి. మనిషి ఫలాసక్తి కారణంగా మోక్షానికి దూరమైపోతానన్న భావన కలిగినప్పుడే అసలైన జ్ఞానాన్ని సాధించినవాడు అవుతాడు. ఆ దిశగా తన ప్రస్థానం కొనసాగించాలన్నదే భగవద్గీత బోధించే ఆదర్శం, ఆశయం.
గన్నమరాజు
గిరిజా మనోహరబాబు