‘మాయ’ అనే మాట పండిత పామరులు అందరినోటా వినిపిస్తూనే ఉంటుంది. పండితులు దాన్ని మిథ్య అనే భావనలో ప్రయోగిస్తే, పామరులు దాన్ని మోహమనే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతకూ ‘మాయ’ అనే పదానికి భాగవతం ఏమని నిర్వచనం చెప్పింది? దీన్ని భగవద్గీత ఏమని వివరించింది? అయినా మాయ గురించి మనం తెలుసుకోవలసిన అవసరమేమిటి? ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలకు మనకు సమాధానం కావాలి. సాక్షాత్తుగా దేవదేవుడే తొలిసారిగా భాగవతాన్ని నాలుగు శ్లోకాలలో బ్రహ్మకు తెలియజేసినప్పుడు మాయ గురించి నిర్వచించాడు. ‘ఈ జగత్తులో ఏది సత్యమైనట్లుగా కనబడుతూ ఉంటుందో, దేనికి భగవంతుడితో సంబంధాన్ని మనిషి గుర్తించలేడో అదే మాయ’ అని వివరించాడు. అది చీకటిలో కనిపించే రూపంలా భయాన్ని కలిగిస్తుంది. భగవంతుడు చెప్పిన ఈ మాయా నిర్వచనానికి భాగవతంలో అందమైన ఉపమానం కనిపిస్తుంది.
ద్వారకలో సత్రాజిత్తు సూర్యోపాసనతో శమంతకమణి అనే అపురూపమైన మణిని పొందాడు. అది ప్రతిరోజూ ఎనిమిది బారువుల బంగారాన్నిస్తుంది. ఇప్పటి లెక్కల ప్రకారం సుమారు 77 కిలోలు. ఆ అపురూపమణితో ద్వారకకు తిరిగివచ్చిన సత్రాజిత్తుకు శ్రీకృష్ణుడు మంచి ఉపదేశం చేస్తూ దాన్ని ఉగ్రసేన మహారాజుకు ఇవ్వడం మంచిదని చెప్పాడు. కానీ, సత్రాజిత్తు దానికి ఒప్పుకోలేదు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడని సర్వత్రా విదితమైనా, సాక్షాత్తూ భగవంతుడే స్వయంగా ఉపదేశించినా తనకు లభించినదే సత్యమని భావించాడు. శ్రీకృష్ణుడి మాట పెడచెవిన పెట్టాడు. సత్యంగా ప్రతీతమైనా శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్నట్లుగా కనిపించకపోతే అదే మాయ. అందుకే మాయామోహితుడై.. శ్రీకృష్ణుడి మీదే నిందలు వేసే స్థితికి వచ్చాడు.
తన తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని తీసుకొని అడవికి వెళ్తాడు. అక్కడ సింహం బారినపడి మరణిస్తాడు. అదంతా శ్రీకృష్ణుడే చేశాడని సత్రాజిత్తు నిందలు మోపాడు. కానీ, శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్లి రహస్యాన్ని ఛేదించి మణిని తిరిగి తీసుకొనివచ్చాడు. దాంతో సత్రాజిత్తుకు ద్వారకలో చెడ్డపేరు వచ్చింది. దాన్ని తొలగించుకోవడానికి అతను తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి మణితోపాటుగా ఇచ్చే ప్రయత్నం చేశాడు. శ్రీకృష్ణుడు కన్యామణిని తీసుకున్నాడు, మణిని సత్రాజిత్తుకే ఇచ్చేశాడు. తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణ, బలరాములు ద్వారకలో లేని సమయంలో అక్రూరుడు, కృతవర్మ ప్రోద్బలంతో శతధన్వుడు సత్రాజిత్తును వధించి శమంతకమణిని అపహరిస్తాడు. ఆ విధంగా కథ కొనసాగుతుంది. అంటే, శ్రీకృష్ణుడితో శమంతకమణికి ఉండే సంబంధాన్ని చూడలేకపోయిన కారణంగా సత్రాజిత్తు మాయకు లోనై చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఇదే మాయ ప్రభావం. కాబట్టి జగత్తులో కనిపించే ప్రతిదీ భగవంతుడి రచనే. అదంతా భగవంతుని సొత్తే. ఇదే ఈశోపనిషత్తు సందేశం.
శ్లో॥ ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యస్విత్ ధనం॥
సర్వమూ భగవంతుని సొత్తే అయినప్పుడు, దాన్ని భగవంతునితో సంబంధం కలదిగా చూడలేకపోవడమే మాయ. చూడగలిగితే మాయ లేనేలేదు. మాయ లేకపోతే దుఃఖం లేదు. అంటే దుఃఖరాహిత్యం కావాలంటే మాయను తొలగించుకోవాలి. నిజానికి మాయ కూడా శ్రీకృష్ణభగవానుడి ఒకానొక శక్తే! ఎవరైతే భగవంతుని ఆశ్రయించరో వారిపై మాయ స్వైర విహారం చేస్తుంది. మనిషి కృష్ణాధీనుడో లేదా మాయాధీనుడో అయి ఉంటాడు. కృష్ణాధీనుడైతే అతను సుఖి అవుతాడు, మాయాధీనుడైతే దుఃఖి అవుతాడు. ఇదే శాస్త్ర సందేశం!
డా॥వైష్ణవాంఘ్రిసేవక దాస్
98219 14642