సహజంగా, సరళంగా, సంతోషంగా గడప వలసిన విలువైన జీవితాన్ని మనిషి సంకటమయం చేసుకుంటున్నాడు. అల్పజ్ఞానంతో, అజ్ఞానంతో, అహంకారంతో, పక్షపాతంతో, ద్వేషంతో, అన్నీ కలిసిన వక్రాభిప్రాయాలతో పతనం అవుతున్నాడు. మానవజన్మకు ఐహికం ప్రాధాన్యం కంటే ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎక్కువ. ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైనంత మేరకే ఐహికత బలం ప్రధానం. మానవ జీవితంలో ఆధ్యాత్మిక పుష్ఠి తగినంతగా లేకుంటే అన్ని రంగాల్లో ఆ జీవిత నాణ్యత చాలా పడిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మార్టిన్ లూథర్ కింగ్ – ‘We have guided missiles but misguided men’ అని అంటాడు. ఆధ్యాత్మికత విషయంలో మహానుభావులైన ఋషులు మనకు అనేక శాస్ర్తాలను తమ తపస్సంపన్నతతో అందుకొని ఇచ్చారు. మనం వాటిని సందర్భశుద్ధితో అర్థం చేసుకోలేకున్నాం. వాటికి విరుద్ధ వ్యాఖ్యానాలను ఇచ్చి, స్వార్థ సంకుచిత బుద్ధితో వైషమ్యాలను పెంచుతూ కుటిల జీవితాలను గడుపుతున్నాం. ఐహికంగానూ, ఆధ్యాత్మికంగానూ మిథ్యాసౌఖ్యంలో పడిపోతున్నాం.
ఎవరైనా తమ శాస్త్ర, సంప్రదాయ సారాన్ని బాగా అవగతం చేసుకొని, తేటయైన అనుభూతితో పైకి తేలి, ఇతర మార్గాల విశిష్టతలను గ్రహించగలగాలి. వాటిని సమాదరించి, ఆత్మీయతతో సమన్వయించుకోగలగాలి. ప్రత్యేకించి ఆధునిక సమాజానికి ఇది అనివార్యం. అలా కాక తమ శాస్త్రగ్రంథాలు, సంప్రదాయాలకు సంకుచితత్వంతో అతుక్కొని, సారాన్ని గ్రహించక ఖైదీయై, ఇతర మార్గాల విశిష్టతను గ్రహించే ఔన్నత్యం లేక అల్పత్వంతో గుడ్డిగా వ్యవహరించడం బహుముఖీనమైన మన ఆర్షధర్మానికే అవమానకరం. ప్రాచీన భారతదేశంలో సత్యనిష్ఠ, స్వచ్ఛమైన, స్వతంత్రమైన అన్వేషణ, సంవాదాత్మక సమాలోచన సహజ గుణాలుగా ఉండేవి. ఫలితంగానే వైవిధ్యభరిత మార్గాలు, విస్తార వాఙ్మయం, సాధనాపరంగా అనేక ఆచారాలు, సంప్రదాయాలు వెల్లివిరిసాయి. అయితే, కాలక్రమేణా ఆ చిత్తశుద్ధి తగ్గిపోయి దాని స్థానంలో సంకుచితత్వం, ప్రచార కండూతి బాగా పెరిగాయి. అందువల్ల దేవాలయాల సంఖ్య, ప్రాభవం, ఉత్సవాల ప్రదర్శనలు పెరుగుతున్నా ప్రజాజీవనంలో ధర్మం, న్యాయం, ఆత్మీయతలు కృశించి పోతున్నాయి. మన సమాజంలో సగటున పూజ, భజన, వ్రతదీక్ష, జపం, ధ్యానం ముఖ్యమైన సాధనా మార్గాలు. వీటిలో ఏ మార్గాలను అవలంబించినా రోజూ కనీసం 15 నిమిషాలపాటు సత్యచింతన, 15 నిమిషాలు ఆ సత్యధ్యానం చేయడం శ్రేష్ఠం. దానివల్ల క్రమంగా దేశకాలాలకు అతీతమైన, నామ రూపాతీతమైన ‘పరబ్రహ్మానుసంధానం’ సాధ్యమవుతుంది.
ఫలితంగా ప్రాపంచిక జీవనంలో సహజంగా కలిగే రకరకాల భేదభావాలు, ద్వేషదూరాలు తగ్గుతాయి. ఏ మతానుయాయులైనా, మరే సైద్ధాంతిక మార్గాలను అవలంబించే వారైనా ప్రార్థన, ఆరాధన, సంప్రదాయాచరణ నిజమైన ఆధ్యాత్మిక పరిణతిని కలిగిస్తే దయాధర్మాలు, ప్రేమాత్మీయతలు గుండెనిండా పండుతాయి. అప్పుడు జీవితమూ, ప్రపంచమూ అంతా ఈశ్వరమయంగానే అనుభూతికొస్తుంది. అనుకూలతపట్ల కృతజ్ఞత, ప్రతికూలతపట్ల అచంచలమైన నిర్ద్వేష ధర్మనిష్ఠ కలుగుతాయి. జీవితం వ్యక్తి గతంగాకాక, లోకహితగతమైన బాధ్యతగా సాగుతుంది. లోలోన స్వాత్మానంద స్థితి వర్ధిల్లుతుంది. చేతనమైనా, అచేతనమైనా అటు పూర్తి ప్రకృతిపట్ల, ఇటు సమాజం పట్ల అన్ని భేదాలకు అతీతంగా అనన్యత, ఆత్మీయత, ప్రేమ పెల్లుబికి ప్రవర్తన మధురార్ద్రతను సంతరించుకొంటుంది. ఇదే నిజమైన దైవారాధనా ఫలం. ఇదే సాధించవలసిన ఆధ్యాత్మిక పరిణతి, జీవన్ముక్తి.
యముగంటి ప్రభాకర్
94401 52258