Pothana Bhagavatam Episode 95 |ప్రహ్లాదుడు తండ్రితో ఇలా పలికాడు- ‘పితాశ్రీ! మానవ జీవితానికి పరమ లక్ష్యం విష్ణుతత్తమే- భక్తే! అదే అందరికీ నేర్వదగిన విద్య. ఆ విద్య చదివిన, చదివించిన వాడే తండ్రి. అది చెప్పినవాడే గురువు. ‘బహూనాం జన్మనామంతే’- ఎన్ని జన్మలకైనా ఈ విద్యను సాధించడానికి దోహదపడే- సహకరించే, దేహేంద్రియాలను దేవదేవుడు- హృషీకేశుడు (ఇంద్రియాధిపతి) దయతో మనకు ప్రసాదించాడు. ఇవి కార్యసాధకాలు అయినప్పుడే వాని ఉనికి సార్థకం. బాధకాలైతే జన్మమే నిరర్థకం’
ఇలా జంకు-గొంకు లేకుండా ఒక ఝంఝామారుతం లాగా తనయుడు భాషిస్తుంటే తండ్రికి దిక్కుతోచలేదు. అవాక్కయ్యాడు. ఆ పలుకులు అతని చెవులకు పదునైన ములుకుల్లాగా నాటుకొన్నాయి. నదురూ బెదురూ లేని ఆ వదరుబోతును చూచి తండ్రి అదిరిపోయాడు. మనసు చెదిరిపోయింది. ఇదంతా కుదురు కల తన కుమారుని జన్మాంతర సంస్కార ఫలమని తెలుసుకోలేక రజోగుణ దూషితుడైన రాక్షసరాజు మోహంతో, గురుపుత్రులే తనకు ద్రోహం చేశారని సాహంకారంగా ఆగ్రహించి వారిని ‘ఛీ! మీరు బ్రాహ్మణ వేషధారులే కాని వాస్తవ బ్రాహ్మణులు కారు’ అంటూ నిందించాడు. గురువులు వణికిపోతూ వినయంగా ‘మహారాజా! మావల్ల ఏ తప్పూలేదు. మీకు మిత్రులం, పురోహితులం, మీ దయా పాత్రులం. మీ కుమారునికి విరోధి శాస్ర్తాలు బోధించడానికి మేము మీకు శత్రువులమా? ఇదంతా మీ పుత్రునికి నైజ మనీష- సహజంగా పుట్టిన బుద్ధేగాని పరులు నేర్పితే వచ్చింది కాదు. ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ- విరుగుడు మీరే జాగ్రత్తగా విచారించండి’ అని ఉన్న విషయం విన్నవించుకున్నారు. అప్పుడు అసుర ప్రభువు ప్రహ్లాదుని ఇలా ప్రశ్నించాడు- ‘బుజ్జి తండ్రీ! ఒజ్జలు (గురువులు) నేర్పని పాడు బుద్ధులు మజ్జాతుడవైన (నాకు పుట్టిన) నీకు ఎవరి వల్ల ఉజ్జాతమయ్యాయి- పుట్టాయి? తజ్జనులు- వారెవరో చెప్పు. ముజ్జగాలలో ఎక్కడ దాగి ఉన్నా వారిని బయటికి లాగి నుజ్జునుజ్జు చేస్తా’.
‘అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా’- అధర్మాన్ని ధర్మంగా భావించే బుద్ధి తమోగుణంతో కూడిన ‘తామస బుద్ధి’. తన సుతునికి తన మతమే- స్వభావమే ఉండాలని, అదే హితమని తండ్రి అభిమతం. కాని, అది ధర్మ సమ్మతం కానప్పుడు హితం చేకూర్చని ఆ బుద్ధే పుత్రునికి రావాలని పట్టుపట్టడం అజ్ఞానం- రెట్టమతం కాదా? తండ్రి అలా కోపంతో అడిగేసరికి తనయుడు వినయంతో వడివడిగా ఇలా వివరణ ఇచ్చాడు…
‘నాన్నగారూ! లోకులు కారుచీకటి వంటి అజ్ఞానం- మాయలోపడి, దేహ గేహ (గృహ) వ్యవహారాల్లో తగుల్కొని, శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పలు విషయ సుఖాలలో తలమునకలై, పరమార్థపు వెల తెలియక ‘పునరపి జననం పునరపి మరణం’- చావు పుట్టుకల చక్రంలో చిక్కుకొని ఇలలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి అజ్ఞానులకు హరిభక్తి స్వతహాగా గాని, ఇతరుల బోధనల వల్ల గాని, ప్రలోభాల వల్ల గాని- కంచాల, లంచాల ఆశలు చూపించినా, ఆఖరికి అన్నీ విడిచి అడవులకు వెళ్లినా అంత సులువుగా హరి బోధ- కరి వరదునిపై గురి- భక్తి అలవడుతుందా?’
ఉ॥ ‘అచ్చపుఁ జీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్వితచర్వణులైన వారికిన్ జెచ్చెరఁ బుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్ఛనైన నే మిచ్చిన నైనఁ గానలకు నేగిననైన హరి ప్రబోధముల్’
గృహవ్రతులు అనగా గృహమే వ్రతంగా గలవారు. మనోభీష్టాలు- కోరికలు నెరవేరడానికి ఆయా ఇష్టదేవతలను ఉద్దేశించి శ్రద్ధగా ఆచరించేది వ్రతం. గృహం దేవత కాదు గదా! దేవత కాని గృహం- సంసారం పట్ల అపారంగా శ్రద్ధ వహిస్తున్నారన్నమాట! విషయ ప్రవిష్టులు.. ప్రారబ్ధవశాత్తు వాటంతటవే, అప్రయత్నంగా వచ్చిపడే విషయాలు సరే. అలాకాక, వాటికోసం అదేపనిగా పదేపదే వెంటపడి వెదికేవారు, వెంపరలాడేవారు, దేబిరించే దౌర్భాగ్యులే విషయ ప్రవిష్టులు, నికృష్టులు. విషయ భోగాలు ఎంత అనుభవించినా భోగేచ్ఛ ఉపశమించదు- శాంతించదు. ఉప్పునీరు తాగితే దాహం ఎంతకూ తీరకపోగా అంతకంతకూ అధికమవ్వడం అందరికీ అనుభవమేగా! మూల శ్లోకంలోని ‘చర్విత చర్వణానాం’ అన్నమాటను ‘చర్విత చర్వణులైన వారికిన్’ అని ఉన్నదున్నట్లుగా విన్నవించి ‘గృహవ్రతుల’ వెన్నులో వణుకు పుట్టించాడు సిద్ధపురుషుడైన పోతన్న. లోకులు విధివంచితులై దంచినదాన్నే దంచుతున్నారు- ఇది పిష్ట పేషణం.
నమిలిన దాన్నే నములుతున్నారు- ఇది చర్విత చర్వణం! అజితేంద్రియులు- ఇంద్రియదాసులు కాన అనుభవించిన వానినే మరల-మరల అనుభవించడానికై అర్రులు చాస్తూ సంసారమనే భయంకర నరకానికి అభిముఖులై ఆగకుండా వేగిరంగా సాగిపోతున్నారు. ‘సంసారంలో జీవుడు శిశువుగా పూర్వం తాను పాలు తాగిన పాలిండ్లనే, యవ్వనంలో పశువులా మర్దిస్తూ- పీడిస్తూ అపూర్వంగా ఆనందపరవశుడు అవుతున్నాడు. పూర్వం తాను పుట్టిన యోనియందే పునఃపునః రమిస్తున్నాడు. పూర్వజన్మలో తల్లి అయిన తరుణియే తర్వాత ఇల్లాలవుతోంది. పూర్వపు భార్యే మళ్లీ తల్లి అవుతోంది. గత పితరుడే ఇప్పుడు పుత్రుడు అవుతున్నాడు. గతంలోని కుమారుడే పునః తండ్రి అవుతున్నాడు’ అని యోగతత్త ఉపనిషత్తు!
అతి పరిచయం వల్ల ఎప్పటికైనా అవజ్ఞ- అలుసు ఏర్పడుతుంది. తరచూ రాకపోకల వల్ల కూడా లోకంలో అనాదరణ- చులకనకు గురికావాల్సి వస్తుంది. మలయగిరి మీద మనుగడ సాగించే భిల్ల (కోయ)స్త్రీలు- చెంచెతలు వంట కోసం చందనపు- మంచిగంధపు కట్టెలతో మంటపెట్టడం వారి ఇంట కంటున్నాం కదా! అని అంటుంది పండితరాజ శతకం. కాని, అతి ‘పరిచయం వల్ల అలుసు’ అన్న నీతివాక్యం అసత్యమని అనిపిస్తోంది. ఎందుకని? అంటే అనాది కాలంగా- సృష్టి పుట్టింది మొదలు, ఎంతో అతిగా సుపరిచితమై ఉన్న సంసారం పట్ల ఎంతమందికి అరతి- రోత కలుగుతోంది? మొత్తానికి ఎందరికి మొహం మొత్తుతోంది? అంటూ ఈ నీతి వాక్యాన్ని నిలదీస్తోంది, నిజం కాదని రుజువు చేస్తోంది ఖ్యాతి వహించిన వేదాంత శాస్త్రం.
ఉ॥‘కాననివాని నూఁతగొని కాననివాఁడు విశిష్ట వస్తువుల్ గానని భంగిఁ గర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణుఁ గొందరటఁగందు రకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా!’
గృహాసక్తులైన మానవుల మనసు ఏవిధంగా కూడా మాధవుని యందు మగ్నం కాదు. భక్తి భగవత్ కృపాఫలం. పరమ భాగవతుల అనుగ్రహ ఫలం!
‘దానవ చక్రవర్తీ! అంధుని ఊతగొన్న- ఆశ్రయించిన మరో అంధునికి సైతం ఏ వస్తువునూ చూడటం చేతకాని విధంగా, విషయాల వాతబడి కర్మబంధాలలో చిక్కినవారు- కామ్య (సకామ) కర్మలలోనే మునిగి ఉండేవారు విశ్వకర్మను- విష్ణువును వెదికి వీక్షించలేరు. మానవుని స్వార్థం, పరమార్థం- రెండూ విష్ణువే. విష్ణు ప్రాప్తియే సర్వపురుషార్థ ప్రాప్తి అని తెలుసుకోలేరు. కాని, కర్మలను నశింపజేసుకొను కొందరు మాత్రమే నిష్కాములైన విష్ణుభక్తుల పవిత్ర పాదధూళిని తలపై ధరించి కమలాక్షుని కనులార కాంచగలుగుతారు’. హరిభక్తి కర్మను నశింపజేసి జ్ఞానాన్ని కలిగిస్తుందన్నది పరమార్థం! ప్రపంచం పట్ల ‘ఆసక్తి’ ప్రేమ. పరమాత్మ పట్ల ఆసక్తి ‘భక్తి’. సంసారాసక్తి బంధకం, పరమాత్మాసక్తి మోచకం- మోక్షదం!
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006