ఒక కొడుకు పై చదువులకు వెళ్తూ.. తండ్రి ఆశీర్వాదం కోరాడు. ‘నువ్వు ఎంత బాగా చదువుతావో నేను అడగను. ఎన్ని మార్కులు సాధిస్తున్నావో కూడా ఆరాలు తీయను. కానీ, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావని మాత్రం అడుగుతాను’ అన్నాడు. పక్కనే ఉన్న భార్య ఎందుకలా ఆశీర్వదించారని భర్తను అడిగింది. అప్పుడు అతను ‘నేను చిన్నప్పుడు విన్న కథ చెబుతాను విను.. పూర్వం జన్మవాసనలు తెలిసిన ఒక పండితుడు ఉండేవాడు.
ఒకరోజు శిష్యులను దగ్గరికి పిలిచి తనకు చివరి క్షణాలు సమీపిస్తున్నాయని చెప్పాడు. శిష్యులు బాధపడుతూ ఉంటే, తను ఈ శరీరాన్ని వదలి, వారం రోజుల్లో పక్క ఊరిలోనే పుట్టబోతున్నట్లు చెప్పాడు. శిష్యులు చాలా సంతోషించారు. అయితే వారి సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. ఎందుకంటే పండితుడు పుట్టబోయేది పంది రూపంలోనని తెలిసింది. కొన్నాళ్లకు పండితుడు మరణించాడు. పదిరోజుల తర్వాత గురువు ఎలా ఉన్నాడో చూద్దామని శిష్యులు పక్క గ్రామానికి వెళ్లారు. అక్కడ పంది రూపంలో బురద గుంటలో పొర్లుతున్న గురువు కనిపించాడు.
‘ అయ్యో, గురువుకు ఎంత దుర్గతి పట్టింది!’ అని విలపిస్తూ పందిరూపంలో ఉన్న గురువును తమతో పాటు తీసుకెళ్లడానికి శిష్యులు సమాయత్తం అయ్యారు. అప్పుడు వరాహ రూపంలో ఉన్న గురువు ‘వద్దువద్దు, నన్ను ఇక్కడినుంచి ఎక్కడికీ తీసుకెళ్లకండి. నాకిక్కడ ఎంతో హాయిగా ఉంది. ఈ హాయి నాకు మరెక్కడా దొరకదు’ అని చెప్పి శిష్యులను పంపించాడు. ఇలాంటి దాన్ని ‘సహవాస దోషం’ అంటారు. పదిరోజులు కలిసి ఉంటే వారు వీరవుతారు, వీరు వారవుతారని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనం ఏం కావాలనుకుంటే వారితో సాంగత్యం చేయాలి. మల్లెలు చుట్టిన దారానికి మల్లెల గుబాళింపు వస్తుంది. అందుకు మంచివారితో సహవాసం చేస్తే మంచి గుణాలు తప్పకుండా వస్తాయని మన అబ్బాయికి అలా ఆశీర్వదించాను’ అని వివరించాడు తండ్రి.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821