ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబుతూపోయాడు. అతనో ‘ఫిర్యాదుల పెట్టె’ అని గుర్తించాడు గురువు. చిన్నగా నవ్వి అతణ్ని పట్టణంలోని ప్రధాన కూడళ్ల దగ్గరికి వెళ్లమన్నాడు. ఆయా కూడళ్లలో రాజు స్థాపించిన శిల్పాలను, శిలా ఫలకాలను చూసి రమ్మన్నాడు. సాయంత్రం దాకా పట్టణమంతా చుట్టివచ్చిన యువకుడితో, చూసిన శిల్పాలు ఎవరివో పేర్లు చెప్పమన్నాడు గురువు. తను చూసిన ఎందరో మహానుభావుల శిల్పాల గురించి చెప్పాడు యువకుడు. ఓపికగా విన్న గురువు ఆ మహనీయులు చేసిన మంచి పనులేమిటో చెప్పమని అడిగాడు. వాటి గురించి మరింత గొప్పగా చెప్పాడు యువకుడు. అంతా విన్న గురువు చివరిగా ‘వీరిలో ఎవరైనా గొప్ప విమర్శకులు ఉన్నారా?’ అని అడిగాడు. లేదని సమాధానమిచ్చాడు యువకుడు. ‘ఎంతటి సహృదయత కలిగిన రాజైనా విమర్శకులకు శిల్పాలు పెట్టి, శిలాఫలకాలు రాయించరు. సన్మానాలు చేయరు.
మనకు నలుగురు కావాలంటే మన మాట మంచిగా ఉండాలి. మాటలతోనే కదా యుద్ధాలు మొదలయ్యేది. అన్నిటిలోనూ చెడునే చూడకూడదు. మంచి కూడా చూడాలి. అందరిలోనూ తప్పులు ఎంచుతూ, అన్ని విషయాల్లోనూ రంధ్రాన్వేషణ చేస్తూ పోతే… మనకంటూ ఎవ్వరూ మిగలరు’ అని హితబోధ చేశాడు. ‘నిజమే… ఏ నాణానికైనా బొమ్మాబొరుసూ రెండూ ఉంటాయి. బొరుసే చూస్తూ బొమ్మే లేదనుకుంటే ఎలా? విమర్శలు చేయడం తగ్గించుకుంటాను’ నిర్ణయించుకున్నాడు యువకుడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 9393662821