లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలమ్
విపర్యాసన్యాసా దుభయమపి సంభూయ చ మిథః
సుధాలేప స్యూతిః పరిణమతి రాకా హిమకరః
–ఆదిశంకరాచార్యులు (సౌందర్యలహరి: 46)
‘అమ్మా! నీ నుదురు ప్రధానంగా లావణ్యం (నిత్యనూతన సౌందర్యం), ద్యుతి (ప్రకాశం), విమలత్వం (నిర్మలత) అనే మూడు లక్షణాలతో, షోడశకళలతో ప్రకాశించే పౌర్ణమినాటి చంద్రునివలె భాసిస్తున్నది. అది అర్ధ చంద్రబింబం వలె కనిపిస్తున్నది’. ‘అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా’ అంటున్నది లలితా సహస్ర నామస్తోత్రం. అష్టమినాటి చంద్రునివలె ఆమె నుదురు ఉన్నది. మరి, రెండవ అర్ధభాగం తాను ధరించిన కిరీటంలో దురుమబడిన నెలవంకలో ఉన్నది. ‘అమ్మా! ఈ రెంటినీ తలకిందులుగా కలిపితే పూర్ణ చంద్రబింబమవుతుంది’. అంటున్నారు ఆదిశంకరులు. కలిపే వస్తువు ఏదంటే అది ‘సుధాలేప స్యూతిః’. ‘స్యూతి’ అంటే ‘అల్లడం’ (కుట్టడం). ‘సుధాలేపః’ అంటే ‘అమృత స్రావమనే లేపనం’తో రెండు సగభాగాలను అల్లితే (కుడితే) అది పూర్ణచంద్రబింబమై సాధకులకు ‘ముక్తి’ అనే వెన్నెలను పంచుతుంది. ఇది సాధకుల సాధనలో కలుగవలసిన ఒక భావన. ఇక్కడే ఒక విశేషం ఉంది.
ఇందులోని సగభాగం సగుణారాధన (ఒక ఆకృతి ఆరాధన)ను తెలిపితే, మరొక సగభాగం నిర్గుణారాధన (ఆకృతి లేని ఆరాధన)కు ప్రతీకగా నిలుస్తుంది. సగుణారాధనతో ఆరంభమైన సాధనాపర్వం నిర్గుణారాధనతో ముగిస్తే అది పరిపూర్ణమవుతుంది. సగుణోపాసన లేకపోతే లక్ష్యంపై దృష్టి నిలువదు. అలాగే, ఎప్పుడూ అక్కడే ఆగిపోతే లక్ష్యాన్ని చేరలేమనేది ఆదిశంకరుల ఆంతర్యంగా గ్రహించాలి. ‘ప్రథమం సగుణమాశ్రిత్య తతో నిర్గుణ మాసాదయేత్’ అన్నారు వారు. ముందుగా సగుణారాధనలో నిర్గుణమైన దివ్యానుభూతిని పొందిన సాధకుడు నిర్గుణారాధకుడై భగవత్తత్త్వాన్ని దర్శించాలనేది భారతీయ సంప్రదాయక విధానం. యోగసాధనలో మూలాధారంలో సర్పాకారంలో సుప్తావస్థలో ఉండే కుండలినీ శక్తి స్వాధిష్టాన, మణిపూరకం, అనాహతం, విశుద్ధ చక్రాలగుండా ప్రయాణించి ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది. ఈ స్థానమే అమ్మవారి నుదురు. అక్కడికి కుండలినీ శక్తి ప్రవేశించగానే ‘అమృత వర్షం’ కురుస్తుంది. దానినే ‘సుధాసారాభివర్షిణి’ అంటున్నది లలితా సహస్ర నామం. సుధ ఆసారమే సుధాసారం. ‘అమృతం’ అనే ‘జడివాన’ కురుస్తుంది. సాధకుని సర్వావయవాలు అమృతమయమై ప్రకాశిస్తుంటాయి. మనసూ అమృతమయమవుతుంది. ఈ ప్రయాణంలో సాధకుడు అణిమాది అష్టసిద్ధులను సాధిస్తాడు. వాటిని అనుసరించి అసురీశక్తులూ మనలోకి ప్రవేశించే అవకాశమూ ఉంటుంది. కాబట్టి, అప్రమత్తంగా అమ్మను అంటి పెట్టుకొని ధ్యానించే సాధకుని ప్రయాణాన్ని ఆమెనే పరిపూర్ణం చేస్తుంది.
పాడ్యమినుండి పౌర్ణమివరకు తిథులు 15 కాగా అష్టమి మధ్యతిథి. చంద్రునికి వృద్ధిక్షయాలు వుంటాయి. అమావాస్యనుండి పౌర్ణమివరకు వృద్ధి, పౌర్ణమినుండి అమావాస్యవరకు క్షయం. చంద్రునిలోని కళలు రోజుకు ఒక కళ చొప్పున క్షయమై సూర్యునిలో చేరుతాయి. అవే మళ్ళీ అమావాస్యనుండి చంద్రుని చేరుతాయి. నిజానికి కళలు పదహారు. మరి, ‘16వ కళ ఎక్కడ?’ అంటే అది అమ్మవారిలో ఉంటుంది. సాక్షాత్తు పరమేశ్వరియే షోడశకళగా భాసిస్తుంది. అష్టమి మధ్యతిథి కాబట్టి సమస్థితిలో ఉంటుంది. ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించిన కుండలినీ శక్తి అమ్మవారి అనుగ్రహానికి పాత్రమై ఆనందాన్ని అనుభవిస్తుంటుంది. అయితే, ఆ ఆనందంలో తాదాత్మ్యమై లక్ష్యాన్ని విడువడం జరిగే అవకాశమూ ఉంది. కనుక, అక్కడ్నించి ప్రయాణం ముందుకు సాగితే సహస్రారం చేరడం సాధనకు పరాకాష్ట. అక్కడే తన్మయస్థితిలో అమ్మవారి (అనంత శక్తి)లో లయమయ్యే స్థితి కలుగుతుంది.
–పాలకుర్తి రామమూర్తి