విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా
విభాతి త్వన్నేత్రత్రితయ మిదమీశానదయితే
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్
రజస్సత్వం భిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ!
(సౌందర్యలహరి-53)
హే ఈశానదయితే! ఓ పరమశివుడి ప్రియురాలా… పార్వతీ మాతా! నీ మూడు కన్నులూ కాటుక పెట్టుకోవడం వల్ల వేరుగా కనబడుతూ ఉన్నాయి. ఆ మూడు కన్నుల్లోనూ ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశాన్ని చూస్తే మహాప్రళయ కాలంలో పరమాత్మలో లీనమైన త్రిమూర్తులు మళ్లీ జన్మించేందుకు ఆ రంగులను నీవు ధరించావా అన్న భావన కలుగుతున్నది.
అమ్మ కన్నులు మూడూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలు. అందులో కనిపించే రంగులు ఎరుపు, తెలుపు, నలుపు. ఈ మూడు రంగులూ మూడు గుణాలను తెలుపుతున్నాయి. ‘అజామేకామోహిత శుక్లకృష్ణాం’ అని వేదం కూడా మూడు రంగులను తెలుపుతుంది. అమ్మ కుడికన్నులో ఎరుపు రజోగుణానికి, ఎడమ కన్నులో తెలుపు సత్వగుణానికి, ఫాలనేత్రంలో నలుపు తమోగుణానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. రజోగుణం సృజనకు, సత్వగుణం స్థితికి, తమోగుణం లయానికి నిదర్శనాలు. అవే బ్రహ్మ, విష్ణు, రుద్రులకు ప్రతీకలుగా చెప్తారు. ఇదే భౌతికార్థంలో.. మనమొక కార్యాన్ని ఆరంభిస్తాం- అది బ్రహ్మస్థితి. చేస్తూ ఉంటాం- అది విష్ణుస్థితి. ఆ కార్యాన్ని పూర్తిచేస్తాం- అది రుద్రస్థితిగా చెప్పుకోవచ్చు.
అమ్మ ధరించిన కాటుక చీకటికి ప్రతీక. ఆ చీకటి ఈ విశాల విశ్వసృష్టికి ఆద్యమైనది లేదా ముందున్నది. ఆ చీకటి నుంచే సమస్తం రూపొందుతున్నది. ఆ చీకటి అమ్మ మూర్తి కానీ, శూన్యం కాదు. మన కన్నులకది చీకటిగా కనపడవచ్చు. దానికి కారణం మన కన్నులు చూసే పరిమితత్త్వమే. లోకములేవీ లేని సమయంలో అనంతంగా పరుచుకున్న చీకటికి ఆవల ఉన్నది ఆదిశక్తి వెలుగు అంటున్నది భాగవతం. అమ్మ ధరించిన ఆ కాటుక దర్శనం వల్ల అనంత సృష్టి జరుగుతుంది, నిలుస్తుంది, లయమవుతుంది. ‘ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః’ అంటుంది లలితా సహస్ర నామాలు. అమ్మ కనులు తెరిచి మూయడంలోనే సృష్టి స్థితిలయాలు జరుగుతున్నాయి. కనులు తెరిస్తే సృష్టి, మూస్తే లయం, మధ్యసమయం స్థితిగా అభివర్ణిస్తారు.
విత్తనం నుంచి మహావృక్షం జన్మించి పెరిగి కొంతకాలానికి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. దానికి ముందుగా ఆ మహావృక్షం ఫలాలలో తన అస్తిత్వాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది.. తిరిగి మరొక జన్మను తీసుకుంటుంది. ఈ విజ్ఞానమంతా సూర్యుడు అనే విత్తనంలో నిక్షిప్తమై ఉంటుంది. ఈ విత్తనమే ప్రకృతి లేదా సృష్టించు స్వభావం. ఈ స్వభావానికి మూలం లలితాపరమేశ్వరి.
తన చిరునవ్వుల కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సును ఓలలాడించు చిద్రూపి అయిన లలితా పరమేశ్వరిలో (మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా- లలితా సహస్రనామం) కలిగే స్పందనలే సృజనాది కార్యాలకు మూలాలు. త్రిమూర్తుల ఆవిర్భవానికి, లయాలకు కారణాలు. పరమశివుని కామేశ్వరునిగా, ఆమెను కామాక్షిగా సంబోధిస్తారు. ‘క’ కారం బ్రహ్మవాచకం, ‘అ’ కారం విష్ణువాచకం, ‘మ’ కారం రుద్రవాచకాలుగా చెప్తూ కామాక్షి స్పందనలే జగత్తు ఆవిర్భావానికి మూలం అంటారు.
సమస్త భావనలకూ గమ్యమైన పరమభావన పరమార్థమే తానై, తనను ఆరాధించినవారికి ప్రియాన్ని, సుఖాలను, శుభములను, క్షేమాన్ని, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తుంది లలితామాత. అత్యంత సౌందర్యవంతమైన ఆమె ముఖాన్ని వర్ణిస్తూ ‘ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం, పాతునః సర్వ భూతేభ్యః కాత్యాయని నమోస్తుతే’ అంటుంది, దేవీ సప్తశతి. అమ్మ ముఖం సూర్యచంద్రాగ్ని ప్రకాశాలకు అతీతమైన కాంతితో వెలుగుతున్నది. ఆ మూడు వెలుగులూ మూడు కన్నుల నుంచి వస్తున్నాయి. అలాంటి కాత్యాయినీ మాత మనలనందరినీ కాపాడుగాక.
–పాలకుర్తి రామ్మూర్తి