నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!
ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. వ్యాపారం నడుస్తుందో లేదో చెప్పలేం. స్టాక్మార్కెట్ ఏ క్షణాన కుప్పకూలుతుందో అర్థం కాదు. కరోనా ఏ రూపంలో దాడిచేస్తుందో ఊహించలేం. పొద్దున్నే చిరునవ్వుతో పలకరించినవాడు, సాయంత్రానికి శవమై కనిపిస్తాడు. దగ్గాలంటే భయం, తుమ్మాలంటే వణుకు, ముక్కు చుట్టూ గుడ్డ చుట్టుకుని బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి?
గాణ్డీవం స్రంసతే హస్తాత్…
న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మనః..
‘పరమాత్మా! పరంధామా! నిటారుగా నిలబడలేకపోతున్నా. ఒద్దికగా కూర్చోలేకపోతున్నా. తల తిరుగుతున్నది. నోరెండిపోతున్నది. చెమటలు పడుతున్నాయి. చేయి పట్టు తప్పుతున్నది..’
ద్వాపరయుగంలో అర్జునుడిలో కనిపించిన ‘యాంగ్జయిటీ న్యూరోసిస్’ లక్షణాలన్నీ కలియుగ ప్రథమ పాదంలో ప్రతి మనిషిలోనూ బయటపడుతున్నాయి. మా వల్ల కాదంటూ.. డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. భవరోగ వైద్యుడు మాత్రమే ఈ గండం నుంచి గట్టెక్కించగలడు. పరమాత్మ నూరిన పసరుమందు.. శ్రీమద్భగవద్గీతలోనే ఆ శారీరక, మానసిక రుగ్మతలకు సమాధానం ఉంది.
పద్దెనిమిది అధ్యాయాల చికిత్స.. మనిషికి పరిపూర్ణ స్వస్థతనిస్తుంది. ఫీజుగా ఆయనేం ఆస్తిపాస్తులు అడగడం లేదు. ‘అన్యదా శరణం నాస్తి’ అంటే చాలు. బావ తేరు తోలిపెట్టిన బ్రహ్మాండ నాయకుడు మనల్నీ గమ్యానికి తీసుకెళ్తాడు. అలా అని, గీతాచార్యుడు అర్థం పర్థం లేని ‘అచ్చేదిన్’ వాగ్దానాలు చేయడు. గీతామార్గంలో ప్రయాణిస్తున్నప్పుడూ కష్టాలు ఉంటాయి. సంక్షోభాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ, వాటిని మనం చూసే కోణం మారుతుంది, ఎదుర్కొనే వ్యూహం మారుతుంది. ఈత తెలియనప్పుడు నీళ్లలో దిగడానికి, ఈత నేర్చుకున్నాక సంద్రానికి సవాలు విసరడానికి మధ్య ఉన్న తేడాలాంటిదే ఇదీ. జీవన ప్రయాణంలో మనం ఎప్పుడైనా, ఎక్కడైనా దారితప్పినట్టు అనుమానం వచ్చినా, చేతులెత్తేసినట్టు నిర్ధారణ అయినా .. కృష్ణుడే బెత్తం ఝళిపిస్తాడు. కుతస్తా కశ్మల మిదం.. ‘ఈ పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది డ్యూడ్!’ అని మందలిస్తాడు.
‘సుఖే దుఃఖే లాభాలాభౌ, జయాజయౌ’.. మిన్ను విరిగి మీదపడినా సరే, ధైర్యంగా ఉండమంటూ భుజం తడతాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలను సోదాహరణంగా వివరిస్తాడు. సహోద్యోగి బాస్ను బుట్టలో వేసుకుని ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేస్తున్నాడనో, స్నేహితుడు రియల్ దందాలో కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నాడనో.. కడుపుమండి మనం ఫిర్యాదు చేస్తే.. ఫక్కున ఓ నవ్వు నవ్వి, ‘స్వధర్మో నిధనం శ్రేయః..’ నీది కాని ధర్మం ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, ఆ ఊబిలో చిక్కుకోవద్దు బ్రో’ అని హెచ్చరిస్తాడు. మనసు పరకాంత వైపు మళ్లినప్పుడూ, ఆలోచనలు లౌకిక లంపటాల చుట్టూ గింగిర్లు కొడుతున్నప్పుడూ అంతే. ఒక్క క్షణం గీతను తలుచుకొంటే చాలు. భ్రమలు బద్దలయిపోతాయి. ‘ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే మాపజాయతే..’ అంటూ దురాలోచనలపై చక్రధారి సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. సమ్యక్ దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ‘ఐహిక విషయాల గురించి నిత్యం ఆలోచిస్తూ ఉంటే.. వాటి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఆకర్షణ వల్ల కోరిక అధికం అవుతుంది. కోరిక తీరకపోతే కోపం నెత్తినెక్కుతుంది. కోపం వల్ల అవివేకమూ, అవివేకం వల్ల చిత్త చాంచల్యమూ ఆవహిస్తాయి. ఫలితంగా బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే.. సర్వం నాశనమైనట్టే..’ అంటూ స్త్రీలోలత్వంతో చరిత్ర హీనులైనవారిని, అడ్డదారి సంపాదనలో పడి సర్వభ్రష్టులైనవారిని కండ్లముందు నిలబెడతాడు! సాక్షాత్తు పార్థసారథి మన మెంటర్గా మారిపోయి, దిశానిర్దేశం చేస్తున్నప్పుడు.. ఎదురేం ఉంటుంది?
గీత ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది. ప్రతి విజయం మరిన్ని విజయాలకు స్ఫూర్తినిస్తుంది, మరికొంతమందిని విజేతలను చేస్తుంది. ఫలితంగా సమాజమూ అభివృద్ధి చెందుతుంది. ఈ లక్ష్యంతోనే ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫౌండేషన్ ద్వారా ‘గడప గడపకూ భగవద్గీత’ కార్యక్రమాన్ని చేపట్టాం. కోటిమందికి గీతాగ్రంథాన్ని చేరువ చేయనున్నాం. గీతాజయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో కోటి భగవద్గీతోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.
గోసుల శ్రీనివాస్ యాదవ్
చైర్మన్, కృష్ణం వందే జగద్గురుమ్ ఫౌండేషన్