వామన దాన ప్రదానం గురించి గురుశిష్యుల మధ్య సంభాషణం అత్యంత సంవేదన శీలంగా, గంభీరంగా, సనాతన ధర్మానుకూలంగా సాగుతోంది. సాక్షాత్ వనమాలి విష్ణువే తన యజ్ఞశాలకు అర్థియై వచ్చాడని తెలిసి పులకితగాత్రుడై బలి శుక్రాచార్యునితో ఇలా పలికాడు.. ‘మహాత్మా! ఎన్ని జన్నా (యజ్ఞా)లు చేసినా, ఎన్ని పున్నెపు పనులు కావించినా పన్నగశాయి వెన్ను (విష్ణువు)ని కన్నులతో కనలేరే! అంతటి పేరెన్నిక గన్నవాడు, ఎంతో ఉన్నతుడు అతి చిన్నవాడై- పొట్టివాడై వచ్చి అడుగుతున్నాడు. అతనికి అడిగింది ఇవ్వడం కన్నా నా వంటి ధన్యునికి అన్యమైనది ఇంకేమి శరణ్యం?’ ఈ సందర్భంలో మునుముందు మరంద భరిత అరవిందాల వంటి అందమైన, అమూలకాలైన అనేక అమూల్య పద్యాలను సారగర్భితంగా అందించి వీనుల విందు చేశాడు కవీంద్రుడు పోతన. వినయశీలి బలి అంజలి ఘటించి ఆచార్యునితో ఇలా అన్నాడు…
శా॥‘ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపైఁ గపోల తటిపైఁ బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు క్రిందగుట, మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?’
‘అయ్యా! చెయ్యి చాచి అడుగుతున్న ఈ యాచకుని చెయ్యి ఎంత గొప్పదో తెలుసా? ఆదిలో- మొదట శ్రీదేవి కొప్పుపైనా, మీదట మేను (శరీరం)పైనా, ఆపై భుజాల మీది పైట పైనా, పిమ్మట పాద పద్మాలపైనా, అటుపై నును బుగ్గలపైనా, చివరిగా అనురాగంతో చను మొగ్గలపైనా సరికొత్త గౌరవం అగ్గలంగ అందుకొనే గడుసరి! అంతటి గొప్ప చెయ్యి చప్పపడి కిందికి కావడం, అప్పనంగా నాది పై చెయ్యి అవడం భృగువరా! ఇది ఎంతటి భాగ్యం! (దాత, ప్రతిగ్రహీతల తారతమ్యం వారి చేతులలోనే సూచితమవుతుంది కదా!) ఈ రాజ్యం గీజ్యం శాశ్వతమా? ఎంతకాలం భోజ్యం- అనుభవ యోగ్యం? ఎప్పటికైనా త్యాజ్యమే కదా! పూజ్య గురుదేవా! చితి వరకు మాత్రమే సాయం- తోడు వచ్చే ఈ కాయం (శరీరం) కూడా నిరపాయం- అపాయ రహితం కాదు గదా!’
శంకర భగవత్పాదులు కూడా ‘లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంజ’- ‘స్వామీ! నీవు లక్ష్మీదేవి అందమైన పయోధరా (స్తనా)లనే పద్మాలయందు విహరించు ‘రాజహంసవు’. ప్రభూ! నాకు చేయూతనిచ్చి ఉద్ధరించు- అంటూ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రంలో ఆర్తితో అర్థించారు.బలి ఇంకా ఇలా పలికాడు..
మ॥‘నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము, కానిమ్ము పో
హరుడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ
దిరుగన్ నేరదు నాదు జిహ్వ, వినుమా ధీవర్య! వేయేటికిన్?’
‘ధీవరా! నాకు దుర్గతి- నరకం దాపురించినా, బంధనం కలిగినా, ఈ అవనీ (భూ) మండలం అదృశ్యమైపోయినా, నాకు దుర్మరణం వచ్చినా, నా అసురకులం అంతరించి పోయినా సరే! ఆర్యా! నేను అసత్కార్యానికి ఒప్పను- ఒడిగట్టను. ఆడిన మాట తప్పను. రానున్న ముప్పు రానీ! కానున్నది కానీ! యాచకుడు శివుడైనా, కేశవుడైనా, బ్రహ్మదేవుడైనా సరే! వేల మాటలెందుకు? చాలిక, నా నాలుకకు ముమ్మాటికి మారు మాట రాదు. సుధీమణీ! ఆడి తప్పక అన్నవిధంగా, ఆలస్యం చెయ్యక అభీష్ట (కోరిన) దానమిస్తే, అధోక్షజుడు ఎందుకు బంధిస్తాడు? ఒకవేళ పాడితప్పి- నన్ను అధర్మంగా బంధించినా నేను ఇతని అహితం- కీడు కోరను. ఎందుకంటారా? ఇతడు నా వైరి అయినా, నాకు వెరచి (భయపడి) విప్ర బాలక వేషంలో వచ్చాడు. నేనీ దానం ఇవ్వకపోయినా ఇతడు నన్ను సంగరం- యుద్ధంలో వధించి అయినా సాధించగలడు’. విష్ణువు కాకపోతే సమరంలో నాచేత హతుడై, నాలో శాశ్వత నిద్ర పొందగలడు!- ‘నా మదిలో పదిలంగా నిరంతరం నిదురించగలడు’- అని అంతరార్థం! ఎంత ఉదారమైన, ఉదాత్తమైన భావన! ప్రొద్దున వండిన అన్నం పొద్దుగూకేసరికి- సాయంకాలానికి కొద్దిగా మార్పునకు లోనవుతుంది. తెల్లవారగానే కుళ్లువాసన వచ్చేస్తుంది. అల్లాంటి అన్నరసం వల్ల పోషింపబడుతున్న ఈ డొల్ల శరీరానికి శాశ్వతత్తం కల్ల కాదా! ఒక దానవునిలోనే ఇంత దాతృత్వం, ధైర్యం, స్వార్థత్యాగం, ప్రతిజ్ఞాపాలన ఉంటే మానవులమై జన్మించిన మనలో అవి లేనందుకు ఎంత సిగ్గుపడాలి? అలవరుచుకొని బాగుపడమని మహాకవి ప్రబోధం!
‘సాధారణ యాచకుడు వచ్చి యాచించినా లేదననే. అలాంటిది, వేదరూపుడు శ్రీహరి వచ్చి అడిగితే లేదనటమా? అసంభవం అన్నాడు బలి. ఎందుకని? యజ్ఞానికి స్వరూపం, ఫలం, ఫలప్రదాత అంతా శ్రీకాంతుడు భగవంతుడే కదా!
కం॥“మేరువు దలక్రిందైనను
బారావారంబు లింకఁబారిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్’
‘గురుదేవా! మేరుపర్వతం తలక్రిందులైనా, వారిధులు (సాగరాలు) ఇంకిపోయినా, వసుంధర (భూమి)లోలోపల పొడియై పోయినా, మిన్నువిరిగి మీద పడినా సరే! విద్వన్నుతా! ఈ వెన్ను (విష్ణు)నికి దానం ఇచ్చితీరుతా.’
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! వైరోచని (బలి) వామనునికి దానమివ్వాలనే కుతూహలంతో తహతహలాడటం చూసి శుక్రుడు కోపగించుకున్నాడు. ‘నా ఆజ్ఞను అతిక్రమించావు కావున శీఘ్రమే పదచ్యుతి- సంపద్ భ్రష్టత కలుగు గాక’ అని శాపమిచ్చాడు. గురు శాపానికి గురియైన బలి ఆపసోపాలు పడలేదు. కొంచెం కూడా తాపం పొందలేదు. పాపరూపమైన అసత్యమార్గాన్ని ఎంచుకోలేదు. ‘మరణం సంభవించినా సరే, మానధనులు మాట తిరుగ (తప్ప)లేరు కదా’- ఇది శుకముని ముఖాన పోతన చేసిన నూతన విశ్లేషణ!
కం॥‘రమ్మా! మాణవకోత్తమ!
లెమ్మా! నీ వాంఛితంబులే దనకిత్తుం
దెమ్మా! యడుగుల నిటు రా
నిమ్మా! కడుగంగవలయు నేఁటికి దడయన్’
పతివ్రతామతల్లి అయిన బలి ఇల్లాలు వింధ్యావళి భర్త కనుసన్న- సైగ గమనించి వటుని కాళ్లు కడగడానికి సువర్ణ కలశంతో జలం తెచ్చింది. బలి కపట వటువుని నిష్కపటంగా ఇటురమ్మని ఆహ్వానించాడు..
మ॥‘బలి దైత్యేంద్ర కరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్
జలజాతాక్షుడు సాఁచె యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదముం
గలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్
నళినామోదము రత్ననూపురిత నానా వేదముం బాదమున్’
ఓ బాల బ్రహ్మచారీ! లేవయ్యా! ఇటు రావయ్యా! నీ వడిగింది లేదనక ఇస్తా. నీ అడుగులు కడుగనివ్వు. ఇంకా తడవు (ఆలస్యం) దేనికి? శ్రీసతిని లాలించే శ్రీకరమైన కరమును (చేతిని) వర్ణించి ఇప్పుడు సర్వశుభాలకు ఆకారమూ (నిధి), భక్తులకు ఏకైక శరణమూ, సంసార సాగర తరణ సాధనమూ అయిన శ్రీహరి చరణాన్ని వర్ణిస్తున్నాడు- ఆ పిలుపు విని, వైరోచని (బలి) తన రెండు చేతులతో కడగడానికి వీలుగా వామనుడు తన కుడిపాదాన్ని చాచాడు. ఆ పాదం యోగులు, దేవతలు ప్రార్థించే సంపదలను సమకూర్చేది. కుదురైన భక్తితో వంగిన కమలాలయ (లక్ష్మి) నుదురు మీది కస్తూరి పంకంతో కూడింది. పద్మాల పరిమళం గుబాళించేది. భవ భయ ఖేదాన్ని ఛేదించే ఆ పాదం నానా వేదాల రాశిని అందెగా అందగించుకొన్నది. అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది. బలి అలాగే వామనుని వామపాదం కూడా కడిగాడు. వడుగు పాదాల కడుగు జలాన్ని బలి కడు భక్తితో నెత్తిన చల్లుకొని ఆచమించాడు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006