నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా
నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ (భగవద్గీత 2-66)
ప్రతి మనిషీ మనశ్శాంతిని కోరుకుంటాడు. అందుకోసం పలు మార్గాలను అన్వేషిస్తుంటాడు. కానీ, ‘మనశ్శాంతికి మూలం మనోనిగ్రహం కలిగి ఉండటమే’ అని బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ‘మనోనిగ్రహం లేనివాని బుద్ధి తప్పుదారి పడుతుంది. ఆత్మచింతన, ఆత్మనిష్ఠ కూడా సాధ్యం కాదు. ఆత్మచింతన లేని వానికి శాంతి ఉండదు. శాంతి కరువైన వారికి సుఖమెట్లా కలుగుతుంది?’ అన్నాడు కృష్ణ పరమాత్మ. నిశ్చల బుద్ధి ఉండాలంటే మనసును నిగ్రహించుకోగలగాలి. మనోనిగ్రహం లోపిస్తే ముందుగా బుద్ధి వికటిస్తుంది. చాంచల్యం వల్ల బుద్ధి మనిషిని పతనం దిశగా నడిపిస్తుంది. అది శాంతికి విఘాతం కలిగిస్తుంది. కనుక జీవితమంతా అశాంతిమయమై దుఃఖభాజనమవుతుంది. దానివల్ల పరమానందస్థితికి అవరోధం ఏర్పడి.. పరమాత్మను చేరుకునే దారి మూసుకుపోతుంది. జీవుడు దేవుణ్ని చేరాలన్న సంకల్పం వికల్పం అవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునునితో ‘సుఖం కావాలంటే శాంతి ఉండాలి. శాంతి ఉండాలంటే ఆత్మభావన కావాలి. అది రావాలంటే ప్రసన్న చిత్తం అవసరం. దానికి మూలం ఇంద్రియ నిగ్రహం. అదే మనోనిగ్రహం’ అని సుబోధకంగా చెబుతూ జ్ఞానమార్గాన్ని దర్శింపజేశాడు.
…? విష్ణువర్ధన్