శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మ ఆలయంలో పూజలు చేసి బంగారు బోనం సమర్పించారు. జోగిని నిషాక్రాంతి తలపై బోనం పెట్టుకుని డప్పుచప్పుళ్లతో నృత్యం చేస్తూ ఆలయ ప్రధాన వీధిగుండా ఆలయ ప్రవేశం చేశారు. దేవస్థానం అధికారులు అర్చక పండితులు తిలక ధారణ చేసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకుని సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం నైవేద్యంగా సమర్పించి తీర్థప్రసాదలు తీసుకున్నారు.
అనంతరం జోగిని నిషాక్రాంతి మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో భాసిల్లాలని, కరువుకాటకాలు నశించిపోయి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని శక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబదేవిని వేడుకున్నట్లు చెప్పారు. మహంకాళి ఆలయ కమిటీ ఛైర్మెన్ మాట్లాడుతూ అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కో క్షేత్రాన్ని ఒక్కొక్క సంవత్సరం దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శ్రీకారం చుట్టినట్లుగా పేర్కొన్నారు. శ్రీగిరి శ్రీశైల పరిరక్షణ విభాగ్ అధ్యక్షులు శివమల్లికార్జున గౌడ్, కమిటీ సలహాదారు జి.మహేష్గౌడ్, కే.విష్ణుగౌడ్, జే.లక్ష్మినారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి బి.మారుతి యాదవ్, కొశాధికారి జి.అరవింద్కుమార్గౌడ్, ప్రశాంత్, చేతన, ధనుష్, వరుణ్బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.