సత్యవాణి, కొత్తగూడెం
‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’ అని లలితా సహస్రనామం. పరతత్తం దివ్యానుభూతిని అందుకోవాలంటే మానవుడు అంతర్ముఖుడు కావాలి. బయటి ప్రపంచంలోకి చొచ్చుకుపోవడం కాదు. మానసికంగా తన లోపలికి తాను చొచ్చుకుపోవాలి. అందుకోసం ఏకాంతం అతనికి సహకరిస్తుంది. నారద భక్తిసూత్రాల్లో ‘పరతత్త్వాన్ని ఎవరు తెలుసుకుంటారు? ఎవరు మాయను తరించగలరు?’ అనే ప్రశ్నకు ‘యో లోకబంధమున్మూల యతి- యో వివిక్తస్థానం సేవతే..’ అని పేర్కొంటాడు నారద మహర్షి. అంటే ‘ఎవరైతే బయటిలోకం బంధాలన్నీ తెగదెంపులు చేసుకుంటారో.. అట్లాంటివారే సాధించగలరు’ అని భావం. ఇంద్రియాలు అస్తమానమూ బయటి ప్రపంచంలో తిరుగుతూ ఉంటే పరబ్రహ్మానుభూతి కుదరదని తాత్పర్యం. అందుకే తలుపులు మూసుకొని ధ్యానమో, జపమో, పూజనో చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఎవరూ భంగపరచరాదని వారి ఉద్దేశం.
అలాగే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. అన్నం తినడం పరబ్రహ్మాన్ని ఉపాసించడమే! అంటే ఉబుసుపోని కబుర్లన్నీ చెప్పకుండా మౌనంగా, ఏకాంతంగా భోజనం చేయడం ఉత్తమం అని ఉద్దేశం. ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః’ అన్నాడు గీతాచార్యుడు. ‘నేను అగ్నిస్వరూపుడనై దేహంలో ఉండి తిన్నవన్నీ జీర్ణం చేస్తూ ఉంటాను’ అని భావం. ఏకాగ్రంగా భోజనాన్ని దైవంగా భావిస్తూ ఏకాంతంలో కూర్చొని తింటే అన్నం అమృతమై ఒంటబడుతుంది. ఎందుకంటే పరతత్త్వం అమృతత్వమే కదా! అలా ఏకాంతంగా భోజనం చేస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి జీవుని రూపంలో ఉన్న దేవుణ్ని అర్చించినట్టే అవుతుంది.
భగవంతుడి నివేదనం రెండు రకాలు. అవసర నివేదనం అంటే అరటిపండో, బెల్లం ముక్కనో దేవునికి పెట్టడం. మహా నివేదనం అంటే ప్రధాన దేవతకు ఇంట్లో వండిన భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలన్నీ కొంచెం కొంచెంగా పళ్లెంలో ఉంచి నివేదించడం. మనిషి ఏ విధంగా అయితే ఏకాంతంగా, ప్రశాంతంగా భోజనం చేయడం అలవాటు చేసుకున్నాడో, అలాగే మహా నివేదనం దేవునికి సమర్పించుకునే సందర్భంలో.. అది కూడా దేవుడు చేసే భోజనమే కాబట్టి గుడి తలుపులు మూసివేయడం అనేది ఆనవాయితీగా ఏర్పడింది. మహా నివేదన వేళ ఎవరి దృష్టి సోకవద్దనీ, దేవుడికి దిష్టి తగులుతుందనే ఉద్దేశంతోనూ ఈ నియమం ఏర్పాటుచేశారు మన పెద్దలు.
…? వెలుదండ సత్యనారాయణ, 94411 62863