సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో జన్మించి, అత్యంత సాధారణ జీవితాన్ని గడిపి, అద్భుత కార్యాలు సాధించి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన అవతారమే శ్రీరామావతారం. అందుకే, ఇందులోని ప్రతీ ఘట్టాన్ని మానవులు ఈనాటికీ తమ జీవితాలకు చక్కగా అన్వయించుకొంటున్నారు. వాటిలో ఒకటే ‘శ్రీసీతారామ కల్యాణం’. సుప్రసిద్ధమైన ఈ పవిత్ర కార్యక్రమం ఏటా చైత్రశుక్ల నవమినాడు జరుగుతుంది. ఈరోజు శ్రీరామ జన్మతిథి. ఈ సందర్భంగా ‘శ్రీరామనవమి’ని ‘శ్రీసీతారామకల్యాణ మహోత్సవం’గా జరుపుకోవడం భారతీయులకు ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగానేకాక ముఖ్యంగా తెలుగువారికి ఈ కల్యాణంతో విడదీయరాని దివ్యానుబంధమే ఉంది. ఇవాళ ‘శ్రీసీతారాముల కల్యాణ దర్శనం’ ఎంతటి వారికైనా అనంతమైన తృప్తినిస్తుంది. అపురూపమైన ఈ భాగ్యం తమ జీవితాలను ఆనందమయం చేస్తుందనే గాఢ విశ్వాసమే ఈ సంప్రదాయానికి మూలం.
అయోధ్యా నగరానికి మహారాజైన దశరథునికి ముగ్గురు భార్యలు, నలుగురు కుమారులు. వారే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. దశరథ మహారాజు ఎంతటి భాగ్యవంతుడంటే తన నల్వురు కుమారుల వివాహాలను ఒకేరోజు, ఒకేసారి, ఒకే వేదికపై, ఒకే ముహూర్తంలో అత్యంత అట్టహాసంగా, వైభవోపేతంగా నిర్వహించి పరమానందాన్ని పొందాడు. శ్రీసీతారామ కల్యాణ సమయంలోనే లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహాలూ జరిగాయి. ఆవేళ సీతారాములతోపాటు లక్ష్మణుడు-ఊర్మిళ, భరతుడు-మాండవి, శత్రుఘ్నుడు-శ్రుతకీర్తిలు అగ్నిసాక్షిగా దంపతులయ్యారు. వసిష్ఠ విశ్వామిత్రాది మహామహర్షుల సమక్షంలో జరిగిన ఈ దివ్య వివాహాల వర్ణన శ్రీవాల్మీకి రామాయణంలోనే చదివి తెలుసుకోవలసిందే. ఆనాటి పెండ్లి దృశ్యాలు పఠితులను దివ్యానుభూతికి లోనుచేస్తాయి.
నిజానికి శ్రీరామకల్యాణ ఘట్టానికి లోక కల్యాణ సంకల్పమే అసలు సిసలైన పూర్వరంగం. లోక రక్షక హేతువుగా విశ్వామిత్రుడు అమోఘమైన యాగాన్ని సంకల్పించడం, దానిని నిర్విఘ్నంగా కొనసాగించడానికి శ్రీరామలక్ష్మణులను సహాయంగా పంపమని దశరథుని అడగడం, రామలక్ష్మణులు తాటకిని వధించడం, మారీచ సుబాహువులను మర్దించడం వంటివన్నీ జరిగాయి. లోక సంరక్షణ కార్యంలో విశ్వామిత్రునికి సహాయం చేయడం వల్ల శ్రీరామలక్ష్మణులు ఆ మహామహుని ఆశీర్వాదాన్ని పొందారు. అదే వారి కల్యాణానికి మార్గం వేసింది. శివధనుర్భంగం కావడం, స్వయంవరంలో సీతాదేవి శ్రీరాముని వరించడం.. అన్నీ దైవ సంకల్పం ప్రకారమే జరిగాయి. అయోధ్యనుండి మిథిలకు వచ్చిన దశరథ మహారాజు పెండ్లిరోజు తెల్లవారు ఝామునే పుత్రసమేతంగా నిద్రలేచి, శాస్ర్తోక్తమైన విధ్యుక్తధర్మాలన్నిటినీ నిర్వహించాడు. నల్వురు పెండ్లికుమారులు రక్షాబంధనాది కార్యక్రమాలు ముగించుకొని, బంధుమిత్రులతోకూడి పెండ్లిమంటపానికి తరలి వచ్చారు. జనక మహారాజు వసిష్ఠుని మనసారా ప్రార్థిస్తూ, వివాహ కార్యక్రమం నిర్వహించమని అర్థించాడు. సమ్మతించిన వసిష్ఠుడు విశ్వామిత్ర శతానందాది ఋషుల సహాయంతో దానిని ప్రారంభించాడు. మొట్టమొదట సీతను తెచ్చి శ్రీరామునికి ఎదురుగా కూర్చోబెట్టారు.
అప్పుడు అగ్నిదేవుని సాక్షిగా జనకుడు శ్రీరామునితో ఇలా అన్నాడు.. ‘ఈ కన్యామణి సీత నా కుమార్తె. ఇక నీకు సహధర్మచారిణి అవుతుంది. ఈమెను పాణిగ్రహణం చేయవలసింది. నీకు శుభమగుగాక! ఈమె మహాపతివ్రత, పరమ సౌభాగ్యవతి. నీడవలె నిన్ను నిరంతరం అనుసరిస్తుంది’. మంత్రపూరిత జలంతో జనకుడు సీతను శ్రీరామునికి కన్యాదానం చేశాడు. మంగళవాద్యాలు మిన్నుముట్టగా పుష్పవృష్టి కురిసింది. ఈ కల్యాణం సామాన్యమైంది కాదు, సర్వలోక మంగళకరం, సకలజన క్షేమదాయకం. సర్వపాపహరం, సర్వానందకరం. నిరంతరం కాలాతీతంగా సాగిపోయే పరమోన్నత దివ్యకల్యాణాలలో ఒకటిగా ఇది మానవచరిత్రలో నిలిచిపోయింది. ‘సీతాకల్యాణ వైభోగమే, రామకల్యాణ వైభోగమే’ అన్న శ్రీత్యాగయ్యస్వామి కల్యాణకీర్తనలను మనసులోనే ఆలపిస్తూ, మనమంతా ఆ అద్భుత వైభోగాన్ని కండ్లనిండా దర్శిస్తూ, తనివితీరా ఆనందిద్దాం.
డాక్టర్ వైష్ణవాంఘ్రి సేవక దాస్
98219 14642