భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడు. అపార కరుణా సింధువు. దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు సర్వదా సన్నద్ధుడు. ఏ విధంగా కొలిచినా ఏ రకంగా తలచినా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చునని అనేక పురాణాలు నిరూపిస్తున్నాయి.
‘అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం’ (భగవద్గీత 9.22)
‘ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నా యందే ఇతర చింతనలేని భక్తితో నిమగ్నులై ఉండేవారికి, ఎప్పుడూ నాపైన మనసు నిలిపిన వారికి ఏది లేదో అది సమకూర్చి పెడతాను. అలాగే వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను’ అన్నాడు శ్రీకృష్ణుడు.
‘అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్
యః ప్రయాతి సమద్భావంయాతి నాస్త్యత్ర సంశయః॥’ (భగవద్గీత 8.5)
‘మరణం సమీపించిన వేళ ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తూ దేహత్యాగం చేస్తారో, వారు పరమాత్మనే పొందుతారు. ఆ పిలుపులోని తపనకు అనుగుణంగా భగవత్ సాయుజ్యం లభిస్తుంది’ అని పై శ్లోకార్థం. వరబల గర్వితుడైనప్పటికీ హిరణ్యకశిపునికి మృత్యు రూపంలో లభించిందిదే.
శా॥ పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్, భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మరచెన్ సురారిసుతుఁ డేతద్విశ్వమున్ భూవరా!
అని అందమైన పద్యంలో ప్రహ్లాదుడి భక్తిని వివరించాడు పోతనామాత్యుడు. ‘పానీయాలు తాగుతున్నా, భోజనం చేస్తున్నా, ఇతరులతో మాట్లాడుతున్నా, పరిహాస సమయాల్లోనూ, పచార్లు చేసే సమయంలోనూ, ఆఖరికి నిద్రలోనూ ఎవరైతే శ్రీహరినే ధ్యానం చేస్తుంటారో, అటువంటి వారికి పరమాత్మ సాయుజ్యం తప్పక లభించి తీరుతుంది’ అని పద్యభావం. భక్త శిఖామణి అయిన ప్రహ్లాదుడికి లభించింది ఇదే.
ఈ రెండు విషయాలు ఆశ్చర్యకరంగా లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భావ సమయంలో మనకు ప్రకటితమయ్యాయి. వైరభక్తితో హిరణ్యకశిపుడు, జన్మతః పరమభక్తితో ప్రహ్లాదుడు ఒకేసారి నరసింహమూర్తి దర్శనాన్ని, అనుగ్రహాన్ని పొందడం విశేషం. నిరంతరం వైరంతో హరిని తలచి తలచి, పిలిచి పిలిచి హిరణ్యకశిపుడు నరకేసరి చేతిలో మరణించి సాయుజ్యాన్ని పొందాడు. నిరంతర నామస్మరణతో, నిష్కళంక భక్తితో స్వామిని కొలిచి కొలిచి ప్రహ్లాదుడు పరమా త్మను దర్శించి కటాక్షాన్ని పొందాడు.
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఏకకాలంలో విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో అతి విశిష్టమైనది నరసింహావతారం. దశావతారాల్లో ఇది నాలుగోది. నరసింహ మూర్తి కృతయుగంలో వైశాఖ శుక్ల చతుర్దశినాడు అవతరించాడు. హిరణ్య కశిపుడు తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని, దేవ, దానవ, మనుష్యులతో గాని, జంతువుల వల్ల గాని, ఆయుధాల కారణంగా గాని, ఇంట గాని, బయట గాని మరణం సంభవించరాదని విధాత నుంచి వరం పొందాడు. ఏ విధంగానూ మృత్యువు దరి చేరదన్న రాక్షస అహంకారాన్ని పటాపంచలు చేస్తూ స్తంభం నుంచి స్వామి అవతరించాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలు వమ్ము కాకూడదు, దైత్య సంహారం జరగాలి. అందుకే, ఎందెందు వెదకిచూచిన అందందే ప్రకటితమవ్వా లి. సర్వాంతర్యామి అయిన స్వామికి ఇది కష్టం కాకపోవచ్చు. కానీ, భక్తుని ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టాలి. అదే సమయంలో దుష్ట సంహారం జరపాలి. షరతులకు లోబడి హిరణ్యకశిపుడిని సంహరించి లోక కల్యాణం చేశాడు స్వామి.
ప్రహ్లాదుడు ఆగర్భ హరిభక్తుడు. పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యంతో మైమరచిపోయేవాడు. సకల ప్రాణుల్లోనూ సమభావం కలిగినవాడు. సుగుణాల రాశి. పుత్రరూపంలో శత్రువై నిలిచిన హరిభక్తునికీ, హరిద్వేషంతో రగిలిపోయిన దానవునికీ మధ్య జరిగిన సంఘర్షణ ఫలితమే నరసింహ ఆవిర్భావం.
‘ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహమ్’
నరమూర్తి కాదు, హరిమూర్తి కాదు. కేవలం హరిమాయా రచితమైన నరసింహావతార ఆవిర్భావం. శత్రువుకు ఎంత భీకరమో భక్తునికి అంత ప్రసన్న రూపం. సకల అపమృత్యు బాధలు తొలగించే రక్షాకవచం.
-మరుమాముల దత్తాత్రేయ శర్మ , 94410 39146