సంసారాన్ని సాగరం అన్నారు. ఇలా అనడంలో ఉద్దేశం మనిషి జీవితం ఆద్యంతాలు దుఃఖ భరితం కావడమే! ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తింది దుఃఖం అనుభవించడానికేనా? అన్న సందేహం కలుగుతుంది. దానికి సమాధానం ఒక్కటే! జన్మ ఏదైనా అది దుఃఖ భరితం కాకుండా ఉండదు. దుఃఖం జన్మను ఆశ్రయించి ఉంటుంది. జన్మ.. ప్రవృత్తులను, ప్రవృత్తులు.. రాగద్వేషాలను, రాగద్వేషాలు.. అవివేకాన్ని ఆశ్రయించి ఉంటాయని దార్శనికుల వివేచన. మొత్తమ్మీద మన అవివేకం వల్లనే జన్మ కలుగుతుంది. జన్మ వల్ల దుఃఖం ఏర్పడుతుంది. మరి ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక మహా మంత్రం వ్యాప్తిలో ఉంది. దాన్ని స్మరిస్తే, ఆర్థయుక్తంగా భావిస్తే దుఃఖం పోతుందని వేదరుషుల అభిమతం. అందుకే వారు ఏ కార్యక్రమాన్ని మంత్రపూర్వకంగా నిర్వహించినా, వారి నోట ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అనే వాక్కులు తప్పకుండా వెలువడుతాయి.
రస్సెల్ అనే తత్వవేత్త ప్రపంచ దుఃఖాల మీద పరిశోధన చేశాడు. సుమారు నలభై ఏండ్లపాటు దుఃఖం మీద పరిశోధన చేసినా ఆయనకు దుఃఖమే కలిగింది కానీ, దాని స్వరూపం ఏమిటో, దాన్ని తొలగించుకునే మార్గమేంటో తెలియకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి రస్సెల్ భారతావనికి వచ్చాడు. ఇక్కడ ఒక సాధువును కలుసుకొని తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
సుఖానికి ఇష్టం కారణమైనట్లే, దుఃఖానికి ఇష్టం కాని వస్తువు ప్రాప్తించడమే కారణమని తెలియజేశాడు ఆ సాధువు. ‘మనిషి జీవిత యాత్ర ఇలా ఇష్టానిష్టాలతో కొనసాగుతూ ఉంటుంది. ప్రయత్నశీలుడై తన దుఃఖాన్ని అధిగమిస్తాడు’ అని వివరించాడు సాధువు.
‘ఈ దుఃఖం ఎన్ని రకాలు?’ అని ప్రశ్నించాడు రస్సెల్. మూడు రకాలని బదులిచ్చాడు సాధువు. ‘ఒకటి శరీరగతమైన దుఃఖం. దీన్నే ఆధ్యాత్మికం అంటారు. మరొకటి తోటి ప్రాణికోటి వల్ల కలిగే దుఃఖం. దీన్నే ఆధిభౌతికం అంటారు. మూడోది ప్రకృతి వల్ల సంక్రమించే దుఃఖం. ఎండ, వాన, భూకంపాలు, సుడిగుండాలు, వరదలు ఇలా ప్రకృతిపరంగా ఆకస్మికంగా సంభవించే విపత్తులు.. ఇవన్నీ మానవుని దుఃఖానికి కారణమవుతాయి. వీటిని ఆధిదైవికం అంటారు. ఈ మూడు దుఃఖాలలోనే అన్ని దుఃఖాలు అంతర్గతంగా ఉంటాయ’ని సాధువు చెప్పిన మాటలు రస్సెల్ను ఆలోచింపజేశాయి. ఆశ్చర్యచకితుడైన రస్సెల్తో సాధువు సానునయంగా ఎంతోసేపు ముచ్చటించాడు.
ఈ మూడు రకాల దుఃఖాలు లేకుండా చేసుకోవడానికి మానవుడు ఎల్లవేళలా ప్రయత్నించాలి. ఔషధ సేవనం వల్ల శరీర దుఃఖం పోతుంది. సమభావన వల్ల తోటి ప్రాణుల వల్ల కలిగే దుఃఖం దూరమవుతుంది. మరి ప్రాకృతిక దుఃఖం మనకు తెలియకుండానే ఆవరిస్తుంది. ఎప్పుడో చేసిన కర్మల వల్ల ఏర్పడ్డ దుఃఖరూపం ఆధిదైవికం. దీన్నే ప్రారబ్ధ దుఃఖం అంటారు. ఇది అనుభవిస్తే పోతుంది. దీంతోపాటు ఏ దుఃఖమైనా మనిషి అనుభవానికి రావలసిందే. మరి ఎంతకాలం అనుభవిస్తూ ఉండాలి? దీనికి అంతం లేదా? అనే ప్రశ్నకు సాధువు చెప్పిన సమాధానమే శాంతి మంత్రం.
‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ ఓంకార సంయుక్తమైన శాంతి శబ్దం మూడుసార్లు ఉచ్చరించడానికి కారణం మూడు దుఃఖాల నుంచి మనల్ని రక్షించడానికే. సుఖం గాని, దుఃఖం గాని మనకు జన్మతోపాటు సంక్రమిస్తాయి. నిజానికి మనం చేసిన కర్మలే సుఖదుఃఖాల రూపంలో అనుభవించాల్సి వస్తుంది. వాటిని అనుభవింపజేసేది పరమేశ్వరుడే అయినా, అనుభవించాల్సింది మనమే! అందుకే ఓంకార వాచ్యుడైన పరమేశ్వరుడు మనల్ని దుఃఖ విముక్తులను చేయడానికి సర్వసమర్థుడు కనుక అతనినే మనం స్మరించాలి. ఆయన్నే ధ్యానించాలి, ఉపాసించాలి. ఇందులో భాగమే శాంతిమంత్రం. మూడు దుఃఖాలలో ఏ దుఃఖమూ మనకు చెప్పిరాదు. అయినా మనం దుఃఖ విముక్తి కోసం పరమాత్మను ధ్యానించక తప్పదు. అందుకే యోగులు ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అన్న శాంతి మంత్రాన్ని మనకు ఉపదేశించారు.
-ఆచార్య మసన చెన్నప్ప ,98856 54381