మనిషికి రోజువారీ జీవితంలో ఎన్నో మానసిక, శారీరక సమస్యలు ఎదురవు తాయి. కొన్నిసార్లు రోజులు గందరగోళంగా దొర్లిపోతుంటాయి. మరికొన్ని సార్లు భయంభయంగా జరిగిపోతుంటాయి. ఇలాంటి తెలియని, ఊహించని భయాల నుంచి బయటపడేందుకు మార్గాలు ఎన్నో ఉండొచ్చు. మానసిక వైద్యుల దగ్గర సలహాలు తీసుకోవడం, భయం కలిగించే పరిసరాల నుంచి దూరంగా వెళ్లిపోవడం, వ్యాయామం చేయడం ఇలా. అయితే హిందువుల ఇళ్లలో పిల్లలు కానీ, పెద్దలు కానీ మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని తెలిస్తే మొదటగా వచ్చే సలహా ఏదైనా ఉందంటే.. అది హనుమాన్ చాలీసాను చదువుకోండి, ఆంజనేయుడికి దండం పెట్టుకోండనే. అందుకే దాన్ని రచించి దాదాపు 500 ఏండ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ దాని ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు.
హనుమాన్ చాలీసా రచన విషయానికి వస్తే, గోస్వామి తులసీదాసు రచించినట్లు ఇందులోని చివరి చౌపాయీలో తెలుస్తున్నది. తులసీదాసు (క్రీ.శ. 1532- 1623) 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన మొగల్ చక్రవర్తి అక్బర్కు సమకాలీనుడు. ఆయన జీవించిన కాలంలో భారత దేశం అంతటా భక్తి, సూఫీ ఉద్యమాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. రామానం ద్, కబీర్, గురునానక్, జ్ఞానేశ్వర్, అన్నమయ్య, పురందరదాసు, చైతన్య మహాప్రభు, శంకరదేవుడు, నర్సింహ మెహతా ఇలా అన్ని భాషల్లోనూ మనకు భక్తకవులే కనిపిస్తారు. ఆ ప్రభావం తులసీదాసు మీద కూడా పడింది. మధ్యయుగాల భారతదేశ చరిత్రలో భక్తిఉద్యమ శాఖలు రెండు ఉండేవి. అవి నిర్గుణ, సగుణ. భగవంతుడికి రూపం లేదని భావించేది నిర్గుణ శాఖ అయితే, రూపం ఉంటుందని పేర్కొన్నది సగుణ సంప్రదాయం. సగుణ సంప్రదాయం లో మళ్లీ రెండు శాఖలు. రామమార్గీ, కృష్ణమార్గీ. తులసీదాసు రామమార్గానికి చెందినవాడు. రామభక్తికి పట్టం కట్టిన తులసీదాసు సుప్రసిద్ధ రచన రామచరిత మానస్.
ఇలా ఉంటే తన సమకాలంలో అక్బర్ తర్వాత ఎక్కువమందికి తెలిసిన పేరు తులసీదాసుదే. దాంతో తులసీదాసును తన గురించి ఏదైనా పుస్తకం రాయమ ని కోరుతూ అక్బర్ మనుషుల్ని పంపించాడట. తులసీదాసు నిరాకరించడంతో ఆయనను ఫతేపుర్ సిక్రీలో కారాగారంలో బంధించాడని అంటారు. అలా కారాగారంలో ఉన్నప్పుడే తులసీదాసు హనుమంతుణ్ని ప్రార్థిస్తూ చాలీసా గానం చేశాడట. దీంతో ఫతేపుర్ రాజప్రాసాదం అంతటా కోతులు అలుముకు న్నాయట. కోతులు రాజభవనంలోని వారికి అసౌకర్యం కలిగిస్తుండటంతో, తులసీదాసును విడుదల చేయడమే దానికి పరిష్కారమని ఆస్థానంలోని వారు అక్బర్కు సూచించారు. అలా ఆయన విడుదల అయ్యాడన్నది ఐతిహ్యం.
తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ పూర్వ మాండలికాల్లో ఒకటైన అవధీ భాషలో రచించాడు. బలం, ధైర్యం, విజ్ఞానం, బ్రహ్మచర్యం, రామభక్తి లాంటి హనుమంతుడి గుణగణాలను ప్రస్తుతిస్తూ సాగే ఈ చాలీసాలో 43 వచనాలున్నాయి. మొదట్లో రెండు, ముగింపులో ఒకటి- మూడు దోహాలు ఉన్నాయి. వాటి మధ్యలో 40 (హిందీలో చాలీస్) చౌపాయీలు ఉన్నాయి. అందుకే దీనికి చాలీసా అన్నపేరు స్థిరపడింది. శ్రీగురు చరణ.. అని గురు ప్రార్థనతో ప్రారంభమయ్యే హనుమాన్ చాలీసాలో జీవితాన్ని రాముడి సేవకే అంకితం చేసుకున్న ఆ మహావీరుడి జననం, వేషధారణ, విద్యాధ్యయనం, సీతను రాముడితో కలపడం, లక్ష్మణుడికి సంజీవనితో ప్రాణాలు నిలబెట్టడం సహా చిరంజీవి అయిన ఆంజనేయుడి వైభవం అంతా చిన్నచిన్న పదాల్లోనే వర్ణించాడు తులసీదాసు. రావణుడి చెరనుంచి గ్రహాలకు విముక్తి కల్పించాడు కాబట్టి, మారుతిని ఆరాధిస్తే గ్రహబాధలు తొలుగుతాయని విశ్వాసం.
హనుమాన్ చాలీసాకు బహుళ ప్రాచుర్యం లభించిందంటే అది కేవలం మానసి క భయాల్ని దూరం చేస్తుందన్న కారణం ఒక్కటి మాత్రమే కాదు. అందులో లయాత్మకంగా, సరళంగా ఉన్న భాష కూడా ఒక కారణం. అవధీ భాషలో ఉన్న హనుమాన్ చాలీసా తెలుగు, తమిళం, గుజరాతీ, సంస్కృతం సహా వివిధ భాషల్లోకి అనువాదమైంది. అర్థం తెలియకపోయినప్పటికీ ఇప్పటికీ కొన్ని కోట్ల మంది నిత్యం హనుమాన్ చాలీసా చదువుతుండటం దాని ప్రాధాన్యాన్ని మరింత ఎక్కువ చేస్తున్నది.