తెలంగాణ
ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్
దేశంలోనే మొదటిసారిగా ఫ్లో (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్ను ఐటీ మంత్రి కేటీఆర్ మార్చి 8న ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన ఈ పార్క్లో గ్రీన్ కేటగిరీ కింద 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించింది.
మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీని ద్వారా కార్పస్ ఫండ్ను అందుబాటులోకి తీసుకురావడం, వారి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు ప్రకటించారు.
జాతీయం
సీఐఎస్ఎఫ్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 6న నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నిర్వహించిన ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఉన్న సీఐఎస్ఎఫ్ను 1969, మార్చి 10న ఏర్పాటు చేశారు.
శివాజీ విగ్రహం
మహారాష్ట్రలోని పుణెలో నిర్మించిన 9.5 అడుగుల ఎత్తయిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ మార్చి 7న ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని 1,850 కిలోల గన్మెటల్తో రూపొందించారు. అనంతరం పుణెలోనే రూ.11,400 కోట్లతో 12 కి.మీ. నిర్మించిన మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు.
సోలార్ పవర్ ప్లాంట్
దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను మార్చి 7న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. దీనిని సదరన్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎస్పీఐసీ) లిమిటెడ్ ఏర్పాటు చేసింది. 62 ఎకరాలల్లో ఉన్న రిజర్వాయర్పై 42 ఎకరాల్లో రూ.150.4 కోట్లతో దీనిని నిర్మించారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 43 మిలియన్ యూనిట్ల కరంట్ను ఉత్పత్తి చేస్తారు.
ఉమెన్@వర్క్
కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్య, ఎలక్ట్రానిక్స్, ఐటీ-బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సీఎన్ అశ్వత్థ నారాయణ ‘ఉమెన్@వర్క్’ అనే కార్యక్రమాన్ని మార్చి 8న ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు అవసరమైన ఉపాధి నైపుణ్యాలను అందించి 2026లోగా 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. దీనిని కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ (కేడీఈఎం), కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాయి.
ధర్మ గార్డియన్-2022
భారత్, జపాన్ దేశాల సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ బెలగావి (బెల్గాం, కర్ణాటక)లో మార్చి 10న ముగిసింది. ఫిబ్రవరి 27న ప్రారంభమైన ఈ మిలిటరీ విన్యాసాలు 15వ బెటాలియన్ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్, 30వ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ ఆఫ్ జపనీస్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (జేసీఎస్డీఎఫ్) దళాలు పాల్గొన్నాయి. ప్రపంచ ఉగ్రవాదంపై పోరాడేందుకు అవసరమైన వ్యూహాత్మక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ఎక్సర్సైజ్ను ధర్మ గార్డియన్ పేరుతో 2018 నుంచి భారత్లో నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్ శాసనసభలోని 403 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడినాయి. దీనిలో బీజేపీ 273, ఎస్పీ, దానికి మిత్రపక్షాలు 125 స్థానాలు గెలుచుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా ఎన్నికయ్యారు.
పంజాబ్లో 117 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92, కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు గెలుచుకున్నాయి. భగవంత్ మాన్ సింగ్ నూతన సీఎంగా ఎంపికయ్యారు.
గోవా 40 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 20, కాంగ్రెస్ 11 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రమోద్ కుమార్ సావంత్ రెండోసారి సీఎంగా ఎన్నికయ్యారు.
ఉత్తరాఖండ్లో 70 స్థానాలకుగాను బీజేపీ 47, కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.
మణిపూర్లో 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు గెచుకుంది.
అంతర్జాతీయం
చైనా రక్షణ బడ్జెట్ పెంపు
చైనా డిఫెన్స్ బడ్జెట్ 2022కు గాను 1.45 ట్రిలియన్ యువాన్ల ముసాయిదా ప్రతిపాదనలను ప్రధాని లీ కెకియాంగ్ మార్చి 5న ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (పార్లమెంట్)’లో ప్రవేశపెట్టారు. చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రతి ఏటా తమ రక్షణ బడ్జెట్ను పెంచుతుంది. భారత రక్షణ బడ్జెట్తో పోలిస్తే చైనా రక్షణ బడ్జెట్ మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
అవగాహన ఒప్పందం
బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మోటార్ వెహికిల్ అగ్రిమెంట్ (బీబీఐఎన్-ఎంవీఏ) అమలు కోసం ఒక అవగాహన ఒప్పందాన్ని మార్చి 8న కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత తూర్పు దక్షిణాసియాలోని మూడు దేశాల మధ్య ప్రయాణికులు, వస్తువుల రవాణాకు సులువవుతుంది. ఈ సమావేశంలో భూటాన్ పరిశీలక సభ్యదేశంగా పాల్గొన్నది.
నూర్-2
ఇరాన్స్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నూర్-2 అనే సైనిక శాటిలైట్ను మార్చి 8న విజయవంతంగా ప్రయోగించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ మొదటి సైనిక ఉపగ్రహం నూర్-1ను 2020, ఏప్రిల్లో ప్రయోగించారు. నూర్ అంటే పర్షియన్ భాషలో కాంతి అని అర్థం.
ఉక్రెయిన్కు ఐఎంఎఫ్ సాయం
రక్షణ సహాయం కింద ఉక్రెయిన్కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) 1.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని మార్చి 11న ప్రకటించింది. ఐఎంఎఫ్ను 1944, జూలై 27న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. దీనిలో మొత్తం సభ్యదేశాలు 190. ఐఎంఎఫ్ ఎండీగా క్రిస్టలినా జార్జీవా పనిచేస్తున్నారు.
వార్తల్లో వ్యక్తులు
యూన్ సుక్ యోల్
దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన యూన్ సుక్-యోల్ ఎన్నికయ్యారు. మార్చి 10న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రత్యర్థి లీ జే-మ్యూంగ్ను ఓడించాడు. యూన్ 2019 నుంచి 2021 వరకు దక్షిణ కొరియా ప్రాసిక్యూటర్ జనరల్గా అప్పటి అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆధ్వర్యంలో పనిచేశారు.
కటాలిన్ నొవాక్
హంగేరీ దేశానికి అధ్యక్షురాలిగా కటాలిన్ నొవాక్ మార్చి 10న ఎన్నికయ్యారు. దీంతో ఆ దేశానికి ఎన్నికయిన తొలి మహిళా అధ్యక్షరాలిగా రికార్డుకెక్కారు. 51 ఓట్లతో ఎన్నికయిన ఆమె ఇదివరకు ఫ్యామిలీ పాలిసీ మినిస్టర్గా పనిచేశారు. హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్. హంగేరీకి ఈయూలో సభ్యత్వం ఉంది.
రిజ్వానా హసన్
బంగ్లాదేశ్ ఎన్విరాన్మెంటల్ లాయర్స్ అసోసియేషన్, ఆ దేశ సుప్రీంకోర్టు లాయర్ సైదా రిజ్వానా హసన్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (ఐడబ్ల్యూఓసీ) వార్షిక అవార్డును మార్చి 12న అందుకున్నారు. పర్యావరణాన్ని, అట్టడుగు బంగ్లాదేశీయుల గౌరవం, హక్కులను పరిరక్షించడం కోసం ఆమె చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న 12 మంది మహిళల్లో ఆమె ఒకరు.
క్రీడలు
సహజ
ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్కు చెందిన సహజ యామలపల్లి విజేతగా నిలిచింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మార్చి 6న జరిగిన సింగిల్స్ ఫైన్ల్లో 6-5 ఆధిక్యం ఉన్న దశలో ప్రత్యర్థి ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ) గాయం కారణంగా వైదొలిగింది. దీంతో సహజను విజేతగా ప్రకటించారు. ఆమె కెరీర్లో ఇదే తొలి ఐటీఎఫ్ టైటిల్.
పిస్టల్ టీం టోర్నీ
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్లో రాహీ సర్నోబత్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ త్రయం స్వర్ణ పతకం గెలుచుకుంది. మార్చి 6న ఈజిప్ట్లోని కైరోలో జరిగిన పోటీలో సింగపూర్కు చెందిన జట్టుపై విజయం సాధించింది.
25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో రిథమ్ సాంగ్వాన్, అనీష్ భన్వాల్ జోడీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మార్చి 7న నిర్వహించిన మ్యాచ్లో థాయిలాండ్ జోడీ పదుక చివిసా, రామ్ ఖాంహేంగ్లపై భారత జోడీ విజయం సాధించింది.
నారాయణన్
ఇటలీలో మార్చి 8న జరిగిన క్యాటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్లో భారత గ్రాండ్ మాస్టర్ ఎస్ఎల్ నారాయణన్ విజేతగా నిలిచాడు. భారత మరో ఆటగాడు ఆర్ ప్రజ్ఞానంద్ రన్నరప్గా నిలిచాడు. తొమ్మిది రౌండ్ల తర్వాత 6.5 పాయింట్లతో ముగిసిన ఏడుగురు ఆటగాళ్లలో నారాయణన్, ప్రజ్ఞానంద్ ఉన్నారు.
శ్రీశాంత్
అంతర్జాతీయ క్రికెట్ శ్రీశాంత్ మార్చి 9న అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.
టైగర్ఉడ్స్
గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ఉడ్స్ మార్చి 9న ‘వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలోకి ప్రవేశించాడు. అతడు మొదటిసారిగా 1996, ఆగస్టులో పీజీఏ టూర్ ఈవెంట్ గ్రేట్ మిల్వాకీలో ఆడాడు. యూఎస్ ఉమెన్స్ చాంపియన్ సూసీ మాక్స్వెల్ బెర్నింగ్, పీజీఏ టూర్ మాజీ కమిషనర్ టిమ్ ఫించెమ్, గోల్ఫ్ కోర్స్ డిజైనర్/ఆర్కిటెక్ట్ మారియన్ హొలిన్స్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్
హైదరాబాద్