రాజన్న సిరిసిల్ల : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ నంది కమాన్ వద్ద చికెన్ షాపు నడుపుతున్నాడు. ఇతడి కుమారుడు మహమ్మద్ సమ్రాన్ మంగళవారం దుకాణం తెరిచి ఎయిర్ కూలర్ ఆన్ చేశాడు.
కూలర్కు సప్లై అయ్యే విద్యుత్ తీగ డ్యామేజీ కావడంతో అది షాపు ఇనుప చువ్వలకు తాకింది. అప్పటికే ఇనుప చువ్వలను పట్టుకుని ఉన్న యువకుడు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.