న్యూఢిల్లీ: ఒక కారు వంతెనపై డివైడర్ను ఢీకొట్టింది. కారు అదుపు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి మరణించింది. ఈ అనూహ్య ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్కు చెందిన 45 ఏళ్ల పూనమ్ భాటియా, 21 ఏళ్ల ఆమె కుమారుడు వాట్స్ ఒక ఫంక్షన్కు వెళ్లి ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. భరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యవతి ఫ్లై ఓవర్పై డివైడర్ను కారు ఢీకొట్టింది. కారును నడుపుతున్న కుమారుడు దానిపై నియంత్రణ కోల్పోయాడు. ఆ కారు బలంగా వంతెన అంచును ఢీకొట్టి ఒరిగింది. దీంతో అందులో ఉన్న పూనమ్ భాటియా ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కారు నడుపుతున్న ఆమె కుమారుడు వాట్స్ కూడా గాయపడ్డాడు.
కాగా, ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గాయపడిన తల్లీ, కుమారులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి పూనమ్ భాటియా మరణించింది. కుమారుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్షం వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణం కావడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.