భువనేశ్వర్: పసి బిడ్డ ఎదుటే తల్లిపై 79 రోజులుగా లైంగికదాడికి పాల్పడిన తాంత్రికుడి చెర నుంచి బాధితురాలిని పోలీసులు రక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మహిళకు 2017లో ఒక వ్యక్తితో పెళ్లి అయ్యింది. అయితే అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తమామలు ఆమెను వేధించసాగారు. కాగా, కుటుంబ సమస్యను తొలగిస్తానని ఒక తాంత్రికుడు వారికి మాయమాటలు చెప్పాడు. దీని కోసం ఆ మహిళను కొన్ని నెలలపాటు తన వద్ద ఉంచాలని భర్త, అత్తమామలతో అన్నాడు. అయితే ఆ మహిళ దానికి ఒప్పుకోలేదు. రెండు నెలల కిందట అత్త మత్తు మందు ఇచ్చి ఆ మహిళను తాంత్రికుడి వద్దకు చేర్చింది. ఆమె స్పృహలోకి వచ్చి చూడగా తాంత్రికుడి గదిలో ఉన్నది. ఆమె రెండున్నర ఏళ్ల కుమారుడ్ని కూడా అక్కడే వదిలేశారు.
మరోవైపు ఆ తాంత్రికుడు ఆ మహిళను ఒక గదిలో బంధించాడు. పసి బాలుడి ఎదుటే 79 రోజులు ఆమెపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 28న ఆమెను బంధించిన గదిలో తన మొబైల్ ఫోన్ను తాంత్రికుడు మరిచిపోయాడు. దీంతో ఆ మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి బోరున ఏడ్చింది. తనను కాపాడాలని కోరింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన పోలీసులు తాంత్రికుడు మహిళను బంధించిన ప్రాంతానికి శుక్రవారం చేరుకున్నారు. ఆమెతో పాటు కుమారుడ్ని అక్కడి నుంచి రక్షించారు. అయితే అప్పటికే ఆ తాంత్రికుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళపై రెండు నెలలకుపైగా లైంగిక దాడికి పాల్పడిన తాంత్రికుడితోపాటు ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తమామలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.