ముంబై: కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన ప్రియుడికి ఆమె తల్లి సహాయం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. 17 ఏండ్ల బాలిక తల్లిదండ్రులు కొన్నేండ్ల కిందట విడిపోయారు. ఆ బాలిక, తమ్ముడు తల్లి వద్ద ఉంటున్నారు. అయితే 40 ఏండ్ల తల్లికి 52 ఏండ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తి తరచుగా వారి ఇంటికి వచ్చేవాడు.
గత ఏడాది ఆగస్ట్లో బాలిక తమ్ముడ్ని ఆమె తల్లి బంధువుల ఇంటికి పంపింది. దీంతో ఆ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా ప్రతిఘటించింది. అయితే అతడు చెప్పినట్లుగా వినాలని తల్లి చెప్పింది. నాటి నుంచి ఆ వ్యక్తి పలుమార్లు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అతడు బాధితురాలిని బెదిరించాడు.
మరోవైపు తల్లి ప్రియుడి లైంగిక వేధింపులకు తాళలేక ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే ఎక్కడకు వెళ్లాలో తెలియక ఇంటికి తిరిగి వచ్చింది. కాగా, తమ తప్పును కప్పిపుచ్చేందుకు తల్లి ప్రయత్నించింది. ఆ బాలికను మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు ప్రయత్నించింది.
ఇది సహించని ఆ బాలిక చైల్డ్ హెల్ప్లైన్కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అనంతరం తల్లి, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో బుధవారం ప్రవేశపెట్టారు. ఇద్దరు నిందితులను మూడు రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది.