ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక యువతి మరణించింది. ఆమెను ఆ ఆస్పత్రికి తీసుకొచ్చిన యువకుడిని ఆస్పత్రి వారు సంప్రదించగా.. మృతురాలితో తనకు ఏ సంబంధం లేదని.. ఆమె రోడ్డుపై పడి ఉంటే తీసుకొచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. ఇప్పుడా యువతి అనాథ శవంగా మారడంతో ఆస్పత్రి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ యువతి గురించి పోలీసులు విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లా పరిధిలోని షాహ్పానీ గ్రామానికి చెందిన శిల్ప(పేరు మార్చబడినది) అనే యువతికి అదే గ్రామానికి చెందిన అంకిత్ కుమార్ అనే యువకుడితో నాలుగేళ్లగా పరిచయం ఉంది. ఇటీవల శిల్ప గర్భవతి కావడంతో అంకిత్ కుమార్ ఆమెను మమతా అనే ఒక నర్సు వద్దకు తీసుకు పోయాడు. నర్సు మమత రూ.30,000 డబ్బు తీసుకొని మరో నర్సు కవిత సహాయంతో శిల్పకు అబార్షన్ చేసి పిండాన్ని తొలగించింది. కానీ ఆ తరవాత లీలాకు అధిక రక్తస్రావం అవుతుండడంతో నర్సులు కంగారు పడి శిల్పను ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు.
ఆ సమయంలో అంకిత్ కుమార్ శిల్పను తీసుకొని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ శిల్ప చికిత్స పొందుతూ మరణించింది. ఆ తరువాత ఆస్పత్రి వారికి అంకిత్ కుమార్.. తనకు శిల్పకు సంబంధం లేదని, ఏదో రోడ్డుపై పడి ఉంటే తీసుకొని వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. ఆస్పత్రి వారు పోలీసులకు శిల్ప గురించి సమాచారం అందించారు. పోలీసులు శిల్ప గురించి మరింతగా విచారణ చేసి అసలు నిజం తెలుసుకున్నారు. అంకిత్ కుమార్ను పట్టుకొని గట్టిగా ప్రశ్నించగా.. అతను శిల్ప అబార్షన్ గురించి చెప్పేశాడు. దీంతో పోలీసులు అక్రమంగా గర్భస్రావం చేసిన ఇద్దరు నర్సులను, అంకిత్ కుమార్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.