భద్రాద్రి కొత్తగూడెం : నవ మాసాలు మోసి కని పెంచింది. కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ వృద్ధాప్య దశలో తల్లి పట్ల కూతురు దుర్మార్గంగా ప్రవర్తించింది. పడుకోవడానికి మంచం ఇవ్వకుండా హింసించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ పట్టణంలోని బ్రహ్మణ బజార్కు చెందిన ఎస్ సావిత్రి అనే మహిళ కిరాణా స్టోర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. సావిత్రికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఎం లక్ష్మీ. అయితే లక్ష్మీ, సావిత్రి మధ్య గత కొద్ది రోజుల నుంచి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మంచం, పాత్రల విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణలు చెలరేగాయి. అయితే మంచం ఇచ్చేందుకు లక్ష్మీ నిరాకరించింది. సావిత్రి తీవ్ర మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుంది. అప్రమత్తమైన స్థానికులను సావిత్రికి అంటుకున్న మంటలను ఆర్పేసి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సావిత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.